పేజీలు

26, నవంబర్ 2023, ఆదివారం

చూస్తున్న దేవుడు (ఎల్రోయి)!


సామెతలు 15: "3. యెహోవా కన్నులు ప్రతి స్థలముమీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును."

దేవుని కన్నులు నిత్యమూ ప్రతి స్థలము మీద ఉండి, చెడ్డ వారిని మరియు మంచి వారిని చూస్తున్నాయి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. మనం చేసే ప్రతి క్రియ అయన ఎరిగి ఉన్నాడు, ప్రతి ఆలోచన చెడ్డదా మంచిదా ఆయనకు అవగతమై ఉన్నది. కనుక విశ్వాసులయిన మనము దేవుణ్ణి సంతోష పెట్టెలాగా జీవించాలి. చాల సార్లు మనం మన జీవితములో వివిధ రకాల పరిస్థితుల గుండా వెళ్తుంటాము. ఎన్నో సార్లు భయపెట్టె పరిస్థితులను ఎదురుకొంటాము. అటువంటి సమయంలో మన విశ్వాసం కాస్త సన్నగిల్లే పరిస్థితి ఏర్పడవచ్చు. కానీ ఇటువంటి పరిస్థితిని దేవుడు మన మీదికి అనుమతించాడు అని సమస్తము అయన అధీనములో నడుస్తున్నాయని మనము పూర్తిగా విశ్వాసం చూపాలి. 

విశ్వాసులయిన మనలను ఓడించటానికి సాతాను దేవుని నుండి అనుమతి పొందుకుంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. మనం ఎంత గొప్ప విశ్వాసం చూపితే అంత గొప్పగా సాతాను మన మీదికి శోధనలు తీసుకువస్తాడు. అయితే ఆ శోధన కూడా మనం తట్టుకునేది గానే ఉంటుంది తప్ప, మన శక్తికి మించినదిగా ఉండదు అని కూడా దేవుని వాక్యం సెలవిస్తోంది. కనుక ఇటువంటి భయపెట్టే పరిస్థితులను ఎదుర్కోవటం దేవుని శక్తి ద్వారానే సాధ్యం అవుతుంది. నిత్యమూ ప్రార్థనలో దేవునికి మన మొరలు చెప్పుకోవటం ద్వారా దేవుని నుండి ఆదరణ పొందుకుంటాము, తద్వారా ఆ శోధనలు గెలుస్తాము. 

కొంతమంది దేవుడు మనలను పట్టించుకోడు, కేవలం పూజలు చేసి వేడుకుంటేనే మనకు కావలసిన అవసరాలు తీరుస్తాడు అని నమ్ముతారు. కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు.  మనలను మిక్కిలిగా ప్రేమించే దేవుడు, మనం ఎటువంటి స్థితిలో ఉన్న, ఆయనకు ఎంత దూరంగా ఉన్న మనలను చూస్తున్నాడు, మన గురించే ఆలోచిస్తున్నాడు. మనలను ఏ విధంగా రక్షించు కోవాలా? ఏ విధంగా ఆయనకు దగ్గరగా ఉంచుకోవాలా? ఏ విధముగా ఆయనను ప్రేమించే వారిగా మనలను మార్చుకోవాలా? అని ఆరాటపడుతున్నాడు. యేసయ్య చెప్పిన తప్పిన పోయిన కుమారుని ఉపమానం గుర్తుందా? కొడుకు తనను కాదని దూర దేశం వెళ్ళిన కూడా తండ్రి, అతని రాక కోసం ఎదురుచుశాడు. దూరాన ఉన్న కొడుకును గుర్తుపట్టి, పరుగున వెళ్ళి ముద్దాడి, నూతన వస్త్రాలు ధరింప జెసి, విందు చేశాడు. మన గురించి కూడా దేవుడు ఆలాగే ఎదురు చూస్తున్నాడు. 

కొన్ని సార్లు సాతాను పెట్టె శోధనలకు ఓడిపోయి, కొంతమంది విశ్వాసులు దేవునికి దూరంగా వెళ్ళి పోవాలనుకుంటారు. కానీ అప్పుడు కూడా దేవుడు వారిని చూస్తున్నాడు అన్న విషయం మరచిపోతారు. ప్రభువయినా యేసు క్రీస్తు సిలువలో చేసిన త్యాగాన్ని నిర్లక్ష్యం చేసి, వారిని బట్టి సాతాను దేవుని ముందు నిత్యము పిర్యాధులు చేయటానికి వారు కారణం అవుతున్నారు (ప్రకటన 12:10). అటువంటి వారికి ఘోరమయిన తీర్పు వేచి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తోంది (హెబ్రీయులకు 10:29). తల్లి గర్బంలో మనలను రూపించినప్పుడే దేవుడు మన పట్ల కొన్ని ఉద్దేశ్యాలు కలిగి ఉన్నాడు మరియు మనం ఎలా బ్రతకాలో నిర్ణయించాడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. 

కీర్తనలు 139: "16. నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను. 17. దేవా, నీ తలంపులు నా కెంత ప్రియమైనవి వాటి మొత్తమెంత గొప్పది."

దావీదు తానూ రాసిన కీర్తనలో తానూ పిండముగా ఉన్నప్పుడే తానూ బ్రతక వలసిన దినములన్ని దేవుని గ్రంథములో రాయబడ్డాయని చెపుతున్నాడు. అంతే కాకుండా దేవునికి తన పట్ల ఉన్న తలంపులు లెక్కించటం అసాధ్యం అని చెపుతున్నాడు. ఎందుకు పనికి రాని, ఏ మంచి లేని మన గురించి దేవుడు ఇంతగా ఆలోచిస్తాడా? అని అనుమానం వద్దు. సృష్టి కారకుడయినా యేసు క్రీస్తు, మన కోసం మనిషిగా పుట్టి, పాపం లేకుండా జీవించి, సిలువలో మన కోసం తన ప్రాణం పెట్టి, తిరిగి సజీవుడయినది ఎంత నిజమో, మన కోసం అయన నిత్యం ఆలోచిస్తున్నాడు, మనలను చూస్తున్నాడు అన్నది కూడా అంతే నిజము. ఇకనయినా దేవుని వైపు తిరిగి, విశ్వాసములో బలపడుతూ సాతానుకు సవాలుగా నిలుద్దాము, దేవునికి గొప్ప సాక్ష్యులుగా సాగుదాము. 

చూస్తున్న దేవుడు లేదా ఎల్రోయి అన్న ఈ మాటను మొదట ఉపయోగించింది అన్యురాలయినా హాగరు. ఈమె అబ్రాహాము భార్య అయినా శారా దగ్గర దాసిగా ఉండేది. శారా దేవుడు ఇచ్చిన వాగ్దానమును పూర్తిగా విశ్వసించకుండా, కుమారుణ్ణి కనటానికి తన భర్త అయినా అబ్రాహామును దాసితో కలువుమని చెప్పింది. విశ్వాసులకు తండ్రి అని పిలువబడిన అబ్రాహాము శారాను గద్దించటం మాని ఆమె చెప్పినట్లు చేశాడు. గర్భవతి అయినా హాగరు, శారను చిన్న చూపు చూడటంతో, అబ్రాహాము అనుమతితో శారా హాగరును హింసించటం మొదలు పెట్టింది. తట్టుకోలేని హాగరు అరణ్యంలోకి పారిపోయింది. అటు పైన యెహోవా దూత ఆమె సంతానం గురించి దేవుని వాగ్దానాలు వివరించి, ఆమె కుమారుడయిన ఇస్మాయేలు గురించి ప్రవచనాలు చెప్పటం జరుగుతుంది.

ఆదికాండము 16: "12. అతడు అడవిగాడిదవంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి యెదుట నివసించునని దానితో చెప్పగా  13. అదిచూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచినవాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను."

హాగరు దేవునికి ఇష్టం లేకుండా కుమారుణ్ణి కనటానికి వాడుకోబడింది. ఇది శారా, అబ్రాహాముల తొందరపాటు వలన కలిగిన పొరపాటు. కనుక దేవుడు హాగరును కనికరించాడు. ఆమె ఎటు వెళ్తుంది కనిపెట్టడానికి, ఆమెకు ధైర్యం చెప్పటానికి దేవుడు తన దూతను పంపాడు. తిరిగి తన యజమానురాలయిన శారా వద్ద వినయంగా ఉండి కుమారుని కనుమని హితవు చెప్పించాడు. లెక్కింప శక్యం కానీ సంతానమును ఆమెకు వాగ్దనము చేశాడు. 

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! అన్యురాలు మరియు దేవునికి  ఇష్టం లేని సంతానం మోస్తున్న ఒక దాసిని దేవుడు ఇంతగా చూస్తున్నాడు, ఆమె పట్ల అంతటి కనికరం కలిగి ఉన్నాడు. మనకు విశ్వాసం ఇచ్చి, తన రక్తం ద్వారా మనలను పరిశుద్దులుగా చేసుకొని, తన బిడ్డలుగా పిలుచుకున్న మనలను చూడకుండా ఉంటాడా? ఇక్కడ ఇస్మాయేలును గురించిన వాగ్దానాలు ప్రోత్సాహకరంగా లేకపోయినా హాగరు ఎక్కడ కూడా బాధపడలేదు. ఎందుకంటే ఐగుప్తు దాసీగా ఉన్న తనకు దేవుని వాగ్దానాల ద్వారా గొప్ప స్థానం లభించింది. మరియు దేవుడు చేసిన వాగ్దానాలు ఖచ్చితముగా నెరవేరుస్తాడని విశ్వాసం. మరియు తన కుమారుని సంతానం లెక్కలేని రేట్లు విస్తరిస్తుందని  సంతోషం. అంతే కాకుండా దేవుని తోడులో  తనకు, తన కుమారునికి రక్షణ దొరుకుతుందని నిశ్చయత ఆమెకు కలిగాయి. 

అందుకని "నన్ను చూసిన దేవుణ్ణి నేను ఇక్కడ చూశాను" అనుకొని దేవునికి "చూస్తున్న దేవుడు" అని పేరు పెట్టింది. మనం కూడా శోధన ఎదురయినప్పుడు, వేదన కలిగినప్పుడు "చూస్తున్న దేవుడు" అని గుర్తుచేసుకుని ధైర్యం పొందుకుందామా?  అలాగే చుట్టూ ఎవరు లేరు కదా అని పాపం చేస్తున్నపుడు, "చూస్తున్న దేవుడు" అని గుర్తెరిగి భయపడుదామా? దేవుని ప్రణాళికలు, అయన ఉద్దేశ్యములు మనకు అంతుపట్టవు. అబ్రాహాము, శారా దేవుడు చేసిన ఆలస్యముకు కారణాలు తెలియకుండా, తొందరపడ్డారు. స్త్రీ ధర్మము నిలిచిపోయిన  శారా గర్భమును తెరిచి ఇస్సాకును ఇవ్వటం ద్వారా దేవుడు మహిమ పొందగొరుతున్నాడు అని గుర్తించలేకపోయారు (ఆదికాండము 18:11). మనం కూడా ఆలస్యానికి అలసిపోయి, లేదా కలిగే శోధనలకు అధైర్యపడి విశ్వాసం కోల్పోకుండా వాటిని ధైర్యంగా ఎదురుకుందాము, విశ్వాసములో బలపడుదాము. సాతానుకు లొంగిపోయి మన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశ్యాలు తప్పిపోకుండా ఉందాము.  అయన చూస్తున్న దేవుడు, నిత్యమూ మనలను కాస్తున్న దేవుడు. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసు కుందాము. అంతవరకు దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!!

22, నవంబర్ 2023, బుధవారం

ఆత్మీయ ఆరోగ్యము!

 

విశ్వాసులయిన చాల మంది, యేసు క్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన తరువాత, కొంత కాలానికి తిరిగి లోక రీతుల వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. కొన్ని సార్లు మనం అనుకున్నది దేవుడు మనకు అనుగ్రహించటం లేదని నిస్తేజమయిన స్థితికి వెళ్ళి పోవటం ద్వారా ఇటువంటి స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంది. కానీ దేవుడు మనకు చాలిన దేవుడిగా ఉంటాడు. కొన్ని సార్లు మనం అనుకున్న మేలులు  దీర్ఘ కాలంలో మనకు కీడుగా మారటాన్ని బట్టి దేవుడు దాన్ని మనకు అనుగ్రహించకుండా ఉంటాడు. అందును బట్టి నిరాశపడి పోయి దేవునికి దూరంగా వెళ్ళటం ద్వారా, దేవుణ్ణి  బాధించే వారిగా మారిపోతాము. 

మరియు కొన్ని సార్లు మనకు జీవితంలో ఎటువంటి బాదరా బందీలు, శోధనలు లేకపోవటం ద్వారా కూడా దేవుని మీద ఆసక్తిని కోల్పోతాము. చాల సార్లు సరయిన సంఘము, లేదా సరయిన ఆత్మీయ స్నేహితులు లేక పోవటం ద్వారా ఇటువంటి స్థితిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఆత్మీయ జీవితంలో నెమ్మదిగా వెనుకపడి పోయి, చివరకు ప్రార్థించటానికి కూడా సమయం కేటాయించనంత స్థితిలోకి వెళ్ళి పోతాము. మరియు దేవుని వాక్యము చదవటానికి ఆసక్తి చూపించాము. ఎందుకంటే ఆ లోక రీతులు మనకు ఎంతో సంతోషం కలిగిస్తుంటాయి, వాటి ద్వారా కలిగే సుఖాలకు తిరిగి అలవాటు పడి పోతాము. 

ఈ అలవాట్లు మన ఆత్మీయ జీవితమును నశింప చేస్తూ, దేవునితో మనకు ఉండే సంబంధమును పలుచన చేస్తుంటాయి. తద్వారా ఎంతో గొప్ప త్యాగం చేసి క్రీస్తు మన కొరకు సాధించిన రక్షణను కూడా కోల్పోయే స్థితిలోకి మనలను నడిపిస్తాయి. ఈ లోక రీతులను బట్టి, మనం విశ్వాసము కోల్పోయి మన రక్షణను మనమే నశింప  చేసుకుంటున్న వారిలా మారిపోతాము. ఈ అలవాట్లు హృదయములో చోటు చేసుకొని, మనలను నియంత్రిస్తుంటాయి. తద్వారా వాక్యము అంటే విసుగు, ప్రార్థన పట్ల విముఖత మరియు దేవుడంటే విరక్తిని పెంచుతాయి. ఆ విధముగా పరిశుద్దాత్మను వినే సున్నితత్వమును కోల్పోయి,  రక్షణకు ముందు ఉన్న స్థితి కంటే దారుణమయిన స్థితిలోకి వెళ్ళి పోతాము. 

ఆత్మీయంగా అనారోగ్యమునకు గురి అయినా మనలను  స్వస్థ పరచి తిరిగి పరిశుద్దులుగా  మార్చేది  ప్రభువయినా యేసు క్రీస్తు మాత్రమే. కేవలము అయన ముందు మోకరించి, మన పాపపు అలవాట్లు  ఒప్పుకుని, క్షమించమని అడిగితె చాలు, ఆ సిలువలో అయన సాధించిన విజయం నీకు కూడా అనుగ్రహిస్తాడు. నిన్ను తమ అధీనములో ఉంచుకొని, ఆత్మీయముగా నాశనం చేస్తున్న ప్రతి లోక రీతి నుండి అయన విడుదల దయచేస్తాడు. పాపములు ఒప్పుకోవటం అన్నది, షరతులు లేకుండా, సంజాయిషీలు ఇవ్వకుండా జరగాలి. అంటే ఫలానా కారణం వల్ల ఆలా చేసాను, ఫలానా వారి వల్ల ఇది చూసాను, వంటి ఆలోచనలు చేస్తే మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి క్షమాపణ కోరటం లేదని అర్థం. దేవుడు మనకు తన వాక్కును అనుగ్రహించాడు,  పరిశుద్ధాత్మను తోడుగా ఉంచాడు. మన ముందు నడచిన క్రీస్తు పాపం లేకుండా జీవించాడు. ఆలా బ్రతకటం మనకు కూడా  సాధ్యమే అని భూమి మీదికి వచ్చి నిరూపించాడు. 

మార్కు 5: "13. యేసు వాటికి సెలవియ్యగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు రెండు వేల సంఖ్యగల ఆ మంద ప్రపాతమునుండి సముద్రపుదారిని వడిగా పరుగెత్తికొనిపోయి, సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను."
"15. జనులు జరిగినది చూడ వెళ్లి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించు కొని, స్వస్థచిత్తుడై కూర్చుండియుండుట చూచి భయ పడిరి."

ఇక్కడ దురాత్మల గుంపు చేత పీడించబడుతూ, వాటి అధీనములో ఉండి, తనను తానూ గాయపరచుకుంటున్న ఒక వ్యక్తిని యేసు క్రీస్తు స్వస్థపరచటం మనం చూస్తాము. ఆ వ్యక్తిని ఇనుప సంకెళ్ళు వేసి బంధించిన కూడా, వాటిని తెంపుకొని తిరిగి స్మశానంలో తిరుగుతూ, రాళ్ళతో గాయాలు చేసుకొనే వాడు అని దేవుని వాక్యం చెపుతోంది.   ఇటువంటి మతి స్థిమితం లేని స్థితిలో మనలో చాల మంది ఉన్నారు. ఎంతో నిష్ఠగా ఉండాలనుకుంటారు, కానీ చివరకు ఆ సంకెళ్ళు తెంచుకొని, ఆ అలవాట్లకు లొంగి పోతారు. ప్రతి లోక రీతి, చెడు అలవాటు సాతాను ప్రవేశ పెట్టిన దురాత్మలు  మాత్రమే. 

ఆనాడు సాతాను యేసయ్యను శోధీంచినప్పుడు, లోకములో ఉన్న ఎన్నో సుఖ సౌఖ్యాలను, బోగ భాగ్యలను చూపించి ఆయనను లొంగదీసు కోవాలని చూశాడు. ఈనాడు మనలను కూడా లొంగ దిసుకొని, దేవునికి దూరముగా, ఆయనకు ఇష్టం లేని అపవిత్రపు జీవితం జీవించేలా చేస్తున్నాడు. కొంత మంది యోగ, ధ్యానము వంటివి సాధన చేస్తూ పంటి బిగువున వాటిని నియంత్రిస్తుంటారు. కానీ మనసులో నిత్యమూ వాటిని గురించి వ్యసన పడుతూ ఉంటారు, వాటి గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇది మారు మనసు అనిపించుకోదు. కేవలం సొంత శక్తి మీద ఆధారపడి పవిత్రముగా జీవించాలను కోవటం లాంటిది, అది పాపానికి నిలయం అయినా మన శరీరానికి సాధ్యం కాదు.

మనకు సొంత నియంత్రణ ఉండాలి, వాటి మీద విజయం కావాలన్నా తపన ఉండాలి. ఆ విధముగా ఆత్మీయ జీవితమును అభ్యాసం  చేయాలి, కానీ అది మొదటి మెట్టు మాత్రమే. తర్వాత మనం దేవుని శక్తి మీద అంటే పరిశుద్దాత్మ మీద ఆధారపడి వాటి మీద విజయం పొందుకుంటూ ఉండాలి. నెమ్మదిగా క్రీస్తు స్వభావములోకి మారిపోవాలి. సొంత శక్తి మీద ఆధారపడటం అనేది, పాత్రను పైన శుభ్రం చేయటం లాంటిది. పరిశుద్దాత్మ శక్తి మీద ఆధారపడటం అనేది, పాత్రను లోపల శుభ్రం చేయటం లాంటిది.  అందుకే క్రీస్తు పరిసయ్యులతో, పాత్రను లోపల శుభ్రం చెయ్యండి అని గద్దించాడు (మత్తయి 23:26). అంటే మారు మనసు పొందుకొని, దేవునికి ఇష్టముగా జీవించటము. 

ఇక్కడ దురాత్మల చేత పీడించబడుతున్న వ్యక్తిని సంకెళ్ళు వేసి బంధించిన కూడా, ఆ దురాత్మల నుండి అతనిని నియంత్రించ లేక  పోయారు. ఎందుకంటే అవి అతనిలోనే నివసిస్తున్నాయి కాబట్టి. ఎప్పుడయితే యేసయ్య వాటిని అతని నుండి వెళ్లగొట్టి పందుల గుంపులోకి పంపించాడో, అతను పూర్తిగా స్వస్థ పరచ బడ్డాడు. మన చెడు అలవాట్లు, లోక రీతులు కూడా అటువంటివే.  వాటి నుండి పూర్తిగా విడుదల కావాలంటే, మన మనసులో నుండి వాటిని పూర్తిగా తొలగించాలి. ఆ మారు మనసు పొందుకున్న  స్థితి మరల మనకు తిరిగి రావాలి. అది కేవలము దేవుని శక్తి ద్వారానే సాధ్యం అవుతుంది, దేవుని వాక్యము ద్వారానే అది కొనసాగుతుంది. 

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! నిరాశ, నిస్పృహ అసలు వద్దు. సాతాను చెప్పే అబద్దాలు నమ్మవద్దు. దేవుడు మనం ఎన్ని సార్లు పడిపోయిన క్షమించటానికి సిద్ధముగా ఉన్నాడు. మనం వద్దని చెప్పిన కూడా మురికిలో ఆడుకొని వచ్చిన మన బిడ్డలను ఇంట్లోంచి వెళ్ళగొడుతామా? లేక స్నానం చేయించి మన పక్కన పడుకో బెట్టు కొంటామా? మనం కూడా దేవుని పిల్లలమే! అయన మనం ఎప్పుడు వస్తామా, మనలను పరిశుద్ధ పరచమని ఎప్పుడు అడుగుతామా అని ఎదురు చూస్తున్నాడు. అనుమానం వద్దు, అవిశ్వాసం చూపొద్దు. 

మార్కు 5: "17. తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలుకొనసాగిరి."

మనలో కొంత మంది క్రీస్తును పూర్తిగా నమ్ముకుంటే బంధువులు ఏమనుకుంటారో, ఎటువంటి కష్ట నష్టాలు కలుగుతాయో అని సంకోచిస్తూ ఉంటారు. అటువంటి స్థితిలోనే యేసు క్రీస్తు దురాత్మలు వదిలించిన వ్యక్తి యొక్క గ్రామస్తులు కూడా ఉన్నారు అన్న విషయం పై వచనంలో చూడవచ్చు. యేసయ్య దురాత్మలను పందులలో ప్రవేశ పెట్టటం వల్ల, ఆ పందులు సముద్రములో దూకి చనిపోయాయి. అందును బట్టి వారు భయపడి, క్రీస్తును తమ ప్రాతం నుండి వెళ్ళి పోవలసిందిగా వేడుకున్నారు. ఇక్కడ వారు, ఒక వ్యక్తి స్వస్థపరచ బడ్డాడు అని ఆనందించ కుండా, ఎక్కడ తమకు ఇంకా ఆర్థిక పరమయిన నష్టం కలుగుతుందో అని వ్యసన పడ్డారు. అటువంటి స్థితిలో మనలో చాల మంది ఉన్నారు. కొంతమంది యవ్వనస్తులు ఫలానా అలవాటు మానేస్తే, ఎక్కడ ఇతరుల ముందు లోకువ అవుతామో, ఫలానా సంగతి తెలియదంటే ఎక్కడ చిన్న చూపు చూస్తారో అని భయపడుతు వాటిని కొనసాగిస్తుంటారు. 

మన రక్షణను మించిన విలువయినది ఏది లేదు! దేవుణ్ణి సంతోష పెట్టె పవిత్రమయిన జీవితం కంటే మేలయినది మరొకటి లేదు. ఎవరు మనలను  కాదన్నా, ఎంతగా చిన్న చూపు చూసిన, మన ఆత్మీయ ఆరోగ్యము మనకు ప్రధానం కావాలి. ఎన్ని నష్టాలూ వచ్చిన, కష్టాలు ఎదురయినా! పవిత్రంగా జీవిస్తూ, యేసయ్య వద్దకు చేరి దేవునికి ఇష్టముగా జీవించాలి. తగిన సమయంలో మన నష్టాలను, కష్టాలను ఆయనే తొలగిస్తాడు, తిరిగి పడిపోని బలమును అనుగ్రహిస్తాడు. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకు దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!