పేజీలు

26, ఫిబ్రవరి 2022, శనివారం

ముచ్చట్లకు అలవాటు పడిపోయావా?

 

మనలో చాలామందికి ఎంతో ఇష్టమయిన వ్యాపకము బైబిల్ చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం కన్న ఇతరుల గురించి ముచ్చటించుకోవటం. అనగా ముసలమ్మా ముచ్చట్లు ఎంతో ప్రితికరమయినవి. దేవుణ్ణి తెలుసుకోక ముందు సినిమాలు, షికార్లు ఇంకా ఎన్నో బోలెడు వ్యాపకాలు ఉండేవి. మరీ ఇప్పుడు పొద్దు పుచ్చటం ఎలా? అస్తమానం బైబిల్ ఎం చదువుతాం! ఎన్నిసార్లు ప్రార్థిస్తాం! సరదాగా వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాట్లాడుకొంటే తప్పేంటి? సాటి సహోదరి, సహోదరులే కదా! బైబిలే చెపుతుంది సహోదరులను హెచ్చరించమని వారిని సరయిన మార్గంలో నడుపుమని. మరింకేంటి? అని చాల సంఘములలో చాల మంది విశ్వాసులు ఇలా ఆలోచిస్తూ దేవునికి ఇష్టంలేని కార్యములు చేస్తూ పాపములో ఉండిపోతున్నారు. 

ఇక టెక్నాలజీ పెరిగిపోయాక సంఘములలో వాట్స్అప్ గ్రూపులు పెరిగిపోయాయి. ఒక్క తాటి మీద, క్రీస్తు ప్రేమను బట్టి నడుచుకోవాల్సిన విశ్వాసులు అస్తమానం చాటింగ్లలో గ్రూపులు పోషిస్తూ, తమతో కలువలేని, స్నేహంగా లేని విశ్వాసులను బట్టి దుష్ప్రచారం చేస్తూ మానసికమయిన పాపములకు లోనవుతున్నారు. ఇందులో అడా మగ తేడా లేదు. ఆరాధన అయిపోగానే ఫెలోషిప్ పేరుతొ కబుర్లాడుకోవటం, తమ మధ్య లేని సాటి సహోదరి, సహోదరుల మీద ఛలోక్తులు వేసుకోవటం చాల సంఘములలో పరిపాటి. ఇటువంటి ప్రవర్తన వాక్యాను సారమా?  అన్యులు సైతం దగ్గర లేని వారి గురించి మాట్లాడకూడదు అని మర్యాదను పాటిస్తారు. క్రీస్తును ఎరిగిన వారిగా ఉన్న మనము, సాటి క్రీస్తు విశ్వాసులను కించపరుస్తూ ఛలోక్తులు వేసుకోవటం క్రీస్తు ప్రేమను చూపిస్తుందా? ఎవరయినా వాక్యానుసారం నడుచుకోక పొతే సంఘ పెద్దలు నచ్చచెప్పాలి, కానీ పది మందిలో వారిని కించపరచటం క్రీస్తుకు వారిని దగ్గర చేస్తుందా? మానసిక క్షోభకు గురయిన వారు క్రీస్తుకు దూరమయితే దానికి బాధ్యులు మనం కదా? సరదాగా మాట్లాడుకోవటం తప్పుకాదు! అది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న చనువును బట్టి, స్నేహమును బట్టి ఉంటుంది. కానీ సంఘములో ఉన్నప్పుడు క్రీస్తు ప్రేమను మాత్రమే చూపించాలి. తన ఆత్మీయ కూమారుడయినా తిమోతికి పౌలు గారు హెచ్చరిస్తూ రాసిన మొదటి లేఖలో ఈ వచనం చూడండి!

1 తిమోతికి 4: "7. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసికొనుము." 

ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవుని పై భక్తి విషయములో నీకు నీవే సాధకము చేసికొనుము అంటున్నాడు పౌలు. "నీకో విషయం తెలుసా! ఫలానా వాళ్లు ఫలానా" అని మొదలు పెట్టి, దానికి ఇంకెన్నో కల్పితాలు జోడించి సదరు ఆ కుటుంబాన్ని  దోషులుగా నిలబెట్టటమే కొందరి పని. నాలుగు వాక్యాలు కంఠత వచ్చి, పది పాటలు పాడగలిగితే చాలు, వీరిని మించిన నీతి మంతులు, భక్తి పరులు ఉండరన్న భావనలో బ్రతుకుతుంటారు. ఎదుటి వారికి  అదేపనిగా తీర్పు తీరుస్తూ ఉంటారు. కానీ దేవుని ప్రేమను చూపటం వీరికి చేతకాదు. ఎదుటి వారు వేసుకున్న దుస్తులను బట్టి, ఆభరణాలను బట్టి వారి భక్తిని నిర్ణయించి గుస గుసలు మొదలు పెట్టేస్తారు. వీటి వలన ఆత్మీయ జీవితానికి వచ్చే ఉపయోగం ఏమిటి? గుస గుసలు చేయటం అన్నది సాతాను లక్షణం. ఎందుకంటే వాడు చెప్పేది నిజం కాదు కాబట్టి. కానీ యేసు క్రీస్తు తనను పట్టుకోవటానికి వచ్చిన వారితో, మరియు తనను విచారిస్తున్న వారితో ఏమన్నాడు "అందరి ముందు వెలుగులో నేను బోధించాను కదా! ఇప్పుడు ఏమిటి చీకటిలో నన్ను బందించాలని వచ్చారు" అని. వెలుగు సంబంధులయిన మనకు  చీకటితో సంబంధం దేనికి?

2 తిమోతికి 2: "16. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై యుండుము. అట్టి మాటలాడువారు మరి యెక్కువగా భక్తిహీనులగుదురు."

ఇటువంటి అపవిత్రమయిన మాటలకు విముఖులమై ఉండవలెనని పౌలు గారు హెచ్చరిస్తున్నారు. అట్టి మాటలు పలికే వారు భక్తి హీనులవుతారని దేవుని ఆత్మ పౌలు గారి ద్వారా మాట్లాడుతుంది.  ఛలోక్తుల దగ్గర మొదలు పెట్టి వివిధ రకాల మాటలకు ఆ సంభాషణలు దారి తీస్తాయి. తద్వారా మనలో చిక్కగా ఉండవలసిన క్రీస్తు ప్రేమ పలుచనవుతుంది. ఒకరిని మించిన వారిమి ఒకరమని నిరూపించుకోవటం క్రీస్తు తత్వమా లేక అతిశయం మానివేసి అణిగి ఉండుట క్రీస్తు తత్వమా? 

1 కొరింథీయులకు 5: "6.  మీరు అతిశయపడుట మంచిదికాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా?"

పై వచనంలో పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో కొంచెం పులిసిన పిండి, మొత్తం పిండిని పులియ చేసినట్లు ఎంతో చిన్నదిగా కనిపించే ఈ ముచ్చట్ల అలవాటు మనలను క్రీస్తుకు విరోధులుగా మారుస్తుంది. తీర్పు తీర్చేవారిగా మనలను ఎదిగిస్తుంది.  వాక్యాను సారముగా నడచుకోని వారిని హెచ్చరించమన్న పౌలు గారు సంఘములో కలహములు ఉండవలదని ఉపదేశించారు (1 కొరింథీయులకు 1:11). క్రీస్తు ప్రేమతో ఐక్యంగా ఉండవలసిన సంఘములో కలహములు ఎలా వస్తాయి? 

సామెతలు  26: "22. కొండెగాని మాటలు రుచిగల పదార్థములవంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును." 

పై వచనం చూడండి చాడీలు చెప్పు వాని మాటలు రుచిగల పదార్థం వంటివి. వాటిని బట్టి సంఘములో సహోదరుల మధ్య అపార్థములు చోటు చేసుకుంటాయి. తద్వారా సంఘము యొక్క అభివృద్ధి ఆగిపోతుంది. దేవుని పరిచర్య జరగటం కుంటుపడుతుంది, మరియు విశ్వాసులు భక్తి హీనులుగా మారిపోవడానికి ఎంతో సమయం పట్టదు.  దురదృష్టవశాత్తు మనలో చాల మంది ఎదుటి వారి జీవితాలలో ఏమి జరుగుతుందో వారి ఆత్మీయ స్థితి ఏమిటో తెలుసుకోవటంలో ఉన్న ఆసక్తి మనం క్రీస్తులో ఎలా ఉన్నాము, ఇంకా అయన ప్రేమను ఎలా పంచాలి అన్న వాటి మీద ఉండటం లేదు. అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చెప్పటమే వీరి ఆత్మీయ జీవితం అవుతోంది. తద్వారా సంఘములో పదవులు ఆశిస్తూ తమ ఆత్మీయ జీవితానికి చేటు చేసుకుంటున్నారు. సహోదరుడా, సహోదరి ఇకనయినా మేలుకో! ప్రభువును మించిన శక్తి ఏది లేదు! ప్రభువు తన చిత్తానుసారముగా నిన్ను దివిస్తాడు. అయన సేవకు అవసరమయిన పదవిలో నిన్ను కొనసాగిస్తాడు. 

సామెతలు 16: "28. మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రభేదము చేయును."

సొలొమోను గారు రాసిన సామెతలు గ్రంథంలో ఎన్నిమార్లు చాడీలు చెప్పేవారి గురించి హెచ్చరిక చేయబడిందో తెలిస్తే దేవుడు ఇటువంటి ప్రవర్తన విషయంలో ఎంత కఠినంగా ఉంటాడో అర్థమవుతుంది. ముచ్చట్లు చెపుతూ, చాడీలు మోస్తూ ఏమిటి సాధిస్తారు? ఇదేమీ క్రీస్తు ప్రేమ! ఇదేమి ఆత్మ నడిపింపు! సంఘము క్షేమమును పాడు చేసేవాడు క్రీస్తుకు విరోధిగా మిగిలిపోతాడు. స్నేహితుల మధ్య కలహములు రేపేవాడు దేవుని ఆగ్రహమునకు పాత్రుడవుతాడు. 

సామెతలు 11: "12. తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు. వివేకియైనవాడు మౌనముగా నుండును. 13. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును నమ్మకమైన స్వభావముగలవాడు సంగతి దాచును."

మనకున్న జ్ఞానము, విశ్వాసము కేవలము దేవుడు ఇచ్చిన కృపమే అని నమ్మిననాడు ఎవరి మీద చిన్న చూపు ఉండదు, కేవలం క్రీస్తు ప్రేమను బట్టి వారిని ప్రోత్సహిస్తాము, మనకు తెలిసిన దేవుని వాక్కుల ద్వారా వారిని సున్నితంగా హెచ్చరిస్తాము. కానీ వివేకము లేని వారు, క్రీస్తు ప్రేమ లేని వారు మాత్రమే ఎదుటి వారిని చిన్న చూపు చూస్తారు. ఎవరయినా మనలను నమ్మి తమ పాత జీవితంలో చేసిన తప్పులను పంచుకున్నట్లయితే వారి నమ్మకమును నిలబెట్టుకోవాలి. ఎక్కడ కూడా వారిని దెప్పిపొడవటం కానీ, పది మందిలో వారి గుట్టు రట్టు చేయటం కానీ చేయరాదు. అట్టి వారు దేవుని ప్రేమను చూపించని వారిగా ఉన్నారు. దేవుడే వారి తప్పులను గుర్తుంచుకోను అంటున్నాడు, మధ్యలో మనం ఎవరం? మన తప్పులు బయట పడనంత వరకే మనం నీతిమంతులం. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, క్రీస్తు రక్తంలో మనం నీతిమంతులం. మనలో పాపం లేదు, ఏ తప్పులేదు అనుకొంటే దేవుని సత్యం మనలో లేదు. కొన్ని సంఘాలలో సాక్ష్యం చెప్పటానికి కూడా సాటి విశ్వాసులు ఆలోచించే పరిస్థితి! ప్రభువు తమ జీవితాలను ఎలా మార్చాడో చెప్పటానికి, వారి పాత జీవితమును పంచుకొంటే చాలు, వారిని తిరిగి అదే దృష్టితో చూస్తూ ఉంటారు, వారి మీద ఇదివరకు లేని కొత్త అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు, మరో విధంగా వారితో ప్రవర్తిస్తారు. 

క్రీస్తులోకి వచ్చిన వాడు నూతన సృష్టి అని నమ్మిన నాడు, ఎవరిని వారి పాత జీవితమును బట్టి చిన్నచూపు చూడము. పౌలు గారు ఫిలేమోనుకు రాసిన పత్రిక సారాంశం ఏమిటి?  బానిసగా ఉండలేక దొంగగా పారిపోయిన ఒనేసిమును కుమారుడిగా సంబోధిస్తూ ఇక మీదట అతను దాసుడు కాదు గాని క్రీస్తులో సహోదరుడు అని ప్రకటిస్తున్నాడు.  కనుక సహోదరి, సహోదరుడా ముచ్చట్లు మానివేయండి, చాడీలు చెప్పటం అపివేయండి, ఎదుటి వారి సంగతులు గోప్యంగా ఉంచండి. 

ఎఫెసీయులకు 4: "29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి. 30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచనదినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడి యున్నారు. 31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. 32. ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి."

ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటున్నారో చూడండి. అవసరమునుబట్టి అనుకూల వచనములే పలుక వలెను గాని ఏ విధమయిన దుర్భాషలు పలుకరాదు. దాని వలన దేవుని పరిశుద్దాత్మ దుఖఃపడుతుంది. ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ అన్ని రకాల దుష్టత్వములను  మానుకోవాలి. ఒకరి యెడల ఒకరు దయగలిగి కరుణా హృదయమును కలిగి ఉంటూ దేవుడు మనలను క్షమించినట్లు ఇతరులను మనం కూడా క్షమించాలి. అంతే కానీ ఎదుటి వారి తప్పులను భూతద్దంలో పెట్టి చూపిస్తూ వారిని సిగ్గుపరచటం వాక్యానుసారం కాదు. వ్యభిచారంలో పట్టుపడిన స్త్రీని సైతం "అమ్మ" అని పిలిచినా గొప్ప ప్రేమ కలిగిన దేవుని విశ్వాసులము మనము. అటువంటిది సాటి సహోదరులు తప్పు చేస్తే మనమే నీతి మంతులము అయినట్లు చాడీలు చెప్పటం, గుసగుస లాడటం క్రీస్తు ప్రేమకు  విరుద్ధమే కదా?

మత్తయి 1: "19. ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను."

పై వచనము చూడండి! మత్తయి సువార్తలో యేసయ్య పుట్టుకకు ముందు మరియమ్మ పరిశుద్దాత్మ ద్వారా గర్భవతి అయినందుకు ప్రధానం చేయబడిన యోసేపు ఆమెను అవమానము చేయలేదు. రహస్యముగా ఆమెను విడవాలని చూశాడు. యోసేపు వంటి మనసు మనకు ఉందా? ఎదుటి వారి పిల్లల్లో గాని, వారి జీవితాల్లో గాని ఏవయినా తప్పులుంటే బయటపెట్టి అల్లరి పెట్టటం కాదు. వాక్యానుసారముగా హెచ్చరిస్తూ క్రీస్తు ప్రేమ ద్వారా  వారిని ప్రోత్సహించాలి.  సహోదరి, సహోదరులారా ప్రభువు ప్రేమ ఎప్పుడు ఇతరుల తప్పులను ఎత్తి చూపదు. ఆ ప్రేమకు తప్పులను క్షమించి మరచిపోవటమే తెలుసు. కానీ వాటి విషయమై గుస గుసలు పెట్టడం, చాడీలు మోయటం క్రీస్తు ప్రేమ కానేరదు. 

చాడీలు చెప్పే ప్రవర్తన మనలో ఉంటె క్రీస్తు లక్షణములు మనలో లేనట్లే! అయన ప్రేమను మనం పాటించనట్లే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక  13 అధ్యాయంలో ప్రేమ లక్షణములు  చదవండి. క్రీస్తు ప్రేమకు బద్దులుగా ఉన్న మనము వ్యర్థ పలుకులు  పలుకుతూ, చాడీలు చెపుతూ సంఘమును శోధించటం తగదుదేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!

19, ఫిబ్రవరి 2022, శనివారం

సమాధానం, సమృద్ధిని కోరుతున్నావా?

 

సమస్యలు లేని జీవితం ఎవరు మాత్రం కోరుకొరు! ప్రతి పనిలో విజయం ఎవరికీ మాత్రం ఇష్టం ఉండదు. అన్నింటిలో సమృద్ధిని ఎవరు మాత్రం కాదనుకుంటారు! మరి ముఖ్యంగా జీవము కలిగిన దేవుణ్ణి ఎరిగిన మనము, అయన మహిమలు చూసి మేలులు పొందిన క్రీస్తు విశ్వాసులుగా మనం చేసె పనులలో విజయం కోరుకుంటాము! ఏ బాదరా బంది లేని జీవితాన్ని ఆశిస్తాము! అందులో తప్పులేదు! ఆయనే కదా చెప్పాడు "సమస్త భారము మోయు వారలారా నా యొద్దకు రండి" అని. మరీ ఎందుకనో ప్రతి దాంట్లో సమస్య, చిన్న చిన్న విషయాల దగ్గర సమాధానం లేకపోవటం, ఎంతో వస్తుందనుకున్న దగ్గర అరకొరగా రావటం, ఎంత పెద్ద ఉద్యోగం ఉన్న చాలి చాలని జీవితం! దేనికి ఇదంతా జరుగుతోంది? 

అసలు దేవుడు ఎందుకు ఇలా మౌనంగా ఉంటున్నాడు? తనను నమ్ముకున్న ప్రజలను ఇలా సమృద్ధి, సమాధానం లేని వారిగానే ఉంచుతాడా? సహోదరి, సహోదరుడా! ఒక్కసారి నీ జీవితం పరికించి చూసుకో. నీ దినచర్యను పరిశీలించి చూడు. నీ దిన చర్యలో దేవునికి ఎంత సమయం కేటాయిస్తున్నావు? నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నావు? దేవుని మందిరమయిన నీ దేహాన్ని ఎంత పవిత్రంగా ఉంచుకుంటున్నావు? 

హగ్గయి  1: "2.  సమయమింక రాలేదు, యెహోవా మందిర మును కట్టించుటకు సమయమింక రాలేదని యీ జనులు చెప్పుచున్నారే. 3. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయిద్వారా సెలవిచ్చినదేమనగా 4.  ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబీవేసిన యిండ్లలో నిసించుటకు ఇది సమయమా?" 

ఈ వచనములలో దేవుడు ఏమంటున్నాడు! ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరానికి  ప్రాముఖ్యత ఇవ్వకుండా తమ ఇండ్లను బాగు చేసుకోవటానికి శ్రద్ద చూపిస్తున్నారు. దేవుని మందిరం బాగు చేయటానికి చాల సమయం ఉందనుకుంటూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. అంటే దేవునికి ప్రథమ స్థానం  ఇవ్వకుండా తమ సొంత విషయాలకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారు. 

హగ్గయి ప్రవక్త ద్వారా ఆనాడు ఇశ్రాయేలు తో మాట్లాడిన దేవుడు నేడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకుండా మిగతా విషయాలకు ప్రాముఖ్యత ఇస్తున్నావా? మనలో చాల మంది కూడా అప్పుడే ఏమిటి అంత భక్తి? ఎదో వారం వారం చర్చ్ కు వెళితే సరిపోతుంది కదా అనుకుంటున్నారు. కానీ దేవుడు ప్రత్యేక పరచుకున్న మనం అయనకు ఇష్టమయిన వారీగా జీవించాలని విస్మరిస్తున్నాము. మనకు ఇంకా చాల సమయం ఉంది అనుకుంటూ దేవునికి సమయం ఇవ్వటమే మానేసాం కదా! 

యవ్వనస్తులు, కొంతమంది పెద్దవారు సైతం  క్రికెట్ మ్యాచ్ వస్తుంటే ఎన్ని గంటలయినా విసుగు రాకుండా చూస్తారు, కానీ చర్చ్ లో పాస్టర్ ఒక్క అరగంట వాక్యం ఎక్కువ చెపితే, గడియారాల వైపు చూస్తారు.  ఆడవారు, యవ్వన సహోదరిలు సమయం చిక్కితే సంఘంలో జరిగే అన్ని విషయాల గురించి చర్చిస్తూ ముచ్చట్లు పెడుతూ సమయం వృధా చేసుకుంటారు తప్ప, దేవుని వాక్యం చదవటానికి మాత్రం ఆసక్తి చూపించారు. దేనికి మనం ప్రాముఖ్యత ఇస్తున్నాం? దేవుని కా లేక లోకానికా? 

మేము కూడా దేవుణ్ణి నమ్ముకున్నం, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాము, దశమ భాగం క్రమం తప్పకుండ ఇస్తాము ఇంకేం కావాలి అనుకుంటున్నారా? ఇది కేవలం నామమాత్రపు విశ్వాసము మాత్రమే. దీని వలన దేవుణ్ణి మేము నమ్ముకున్నాము అని చెప్పగలరే కానీ, మేము దేవుని మీద ఆధారపడ్డాము అని చెప్పుకోలేరు. రెండింటికి తేడా ఏమిటి? నమ్ముకోవటము అన్నది దేవుడు కేవలం సమస్యలు తీర్చటానికే అన్న భావన సూచిస్తుంది. కానీ ఆధారపడటం అన్నది, అన్నింటిలో ఆయనను వెతకటాన్ని సూచిస్తుంది. సంతోషమయిన, దుఃఖమయిన అయన యందు నిరీక్షణతో ముందుకు సాగే స్థితిని సూచిస్తుంది.  

దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలి కదా? సర్వ శక్తిమంతుడయినా దేవుణ్ణి ఎక్కడో మూలకు నెట్టేస్తావా? కేవలం ఆదివారం కొంత సేపు సమయం వెచ్చించే స్థితిలో  ఉన్నాడా దేవుడు నీ జీవితంలో? కేవలం క్యాలెండర్ లో వచనం చదివి దేవుని వాక్యం చదివేసాను అనే స్థితిలో ఉందా నీ ఆత్మీయత? కనీసం రోజుకు ఒక్కసారయినా ప్రార్థించనంత సమయం లేని స్థితిలో ఉందా నీ జీవితం? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు! 

హగ్గయి 1: "5. కాబట్టి సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి. 6. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పు కొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టముచేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. 7. కాగా సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగామీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి." 

ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వని ఇశ్రాయేలును దేవుడు ఎలా హెచ్చరిస్తున్నాడు ఈ వచనములలో చూడవచ్చు. వారు ఎంత కష్టపడినా సరయిన ఫలితములు పొందుకోలేక పోతున్నారు. నీ జీవితంలో కూడా ఇవీ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికయినా గుర్తెరిగి దేవునికి మొఱ్ఱ పెట్టుమని ప్రభువు పేరిట మిమల్ని  బ్రతిమాలు కొనుచున్నాము. మనకు అయన నుండి శ్రేష్ఠమయిన ఈవులు కావాలి కానీ ఆయనకు మాత్రం శ్రేష్ఠమయినవి ఇవ్వలేక పోతున్నాము. కనుకనే దేవుని వాగ్దానాలు నీలో ఫలించటం లేదు, కనుకనే నీ సమస్యల సమయంలో నీ ప్రార్థనలు సమాధానం పొందుకోవటం లేదు! సమృద్ధిని, సమాధానాన్ని కోరుకుంటున్నావా? 

అయితే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వు. దేవుని మందిరమును అనగా  దేహాన్ని పాడు చేసే ఆ లోక రీతులకు ఈనాడే స్వస్తి చెప్పు.  దేవుని మందిరమును కట్టుకోవటానికి అనగా మన దేహమును కట్టడిగా పవిత్రముగా ఉంచడానికి దేవుని శక్తిని అడుగు. ఆయనే నీకు శక్తిని దయచేస్తాడు. ఆయనే ఆత్మీయ సమృద్ధిని అనుగ్రహిస్తాడు. అన్నింటిలో అయన నీతిని వెదుకు! నువ్వు కోరుకుంటున్న వన్నీ నిన్ను చేరుకుంటాయి. 

మత్తయి 6: "33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పు డవన్నియు మీకనుగ్రహింపబడును. 34.  రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును."

కొండమీద ప్రసంగంలో యేసయ్య చెపుతున్న ఈ మాటలు చూడండి. ముందుగా మనం దేవుని రాజ్యమును, అయన నీతిని వెతకాలి అప్పుడు సమస్తం మనకు ఆయనే అనుగ్రహిస్తాడు. యేసయ్య మాటలలో స్పష్టంగా చెపుతున్న  విషయాలు మనం దేవుని మీద ఆధారపడుతూ  ఈ లోకంలో  ఉన్న ఆరాటాలు, సమస్యలు వదిలిపెట్టమని. ఆలా అని దేవుడు మనకు ఇచ్చిన జీవనాధారమును నిర్లక్ష్యం చేయమని కాదు. అన్నింటికి అయన మీద ఆధారపడుతూ అన్నింటికన్న మనం దేవునితో ఎక్కువ సమయం గడుపుతూ  అయన పనికి మొదటి స్థానం ఇవ్వాలి.  

ఎందుకంటే సమస్యలు అన్నవి ఏనాటికి పూర్తిగా తీరిపోలేవు అంటే సమస్య తరువాత సమస్య. ఎంత  చెట్టుకు  అంత గాలి అన్నట్లుగా వారి వారి స్థాయిని బట్టి సమస్యలు ఉంటాయి. వాటి మూలంగా చింతపడుతూ ఉంటె, సర్వ శక్తిమంతుడయినా దేవుణ్ణి అవమానించటం కదా? విశ్వాసంతో ఆయనకు ప్రథమ స్థానం ఇస్తూ దేవునిలో ఎదగటానికి ఆసక్తి చూపించండి. తగు సమయంలో మన సమస్యలు ఆయనే తీరుస్తాడు, మనకు అవసరమయిన సమృద్ధిని, సమస్యలలో సమాధానాన్ని ఆయనే మనకు అనుగ్రహిస్తాడు. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాము! అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్ !!

12, ఫిబ్రవరి 2022, శనివారం

పరిచర్యలో దీనత్వం ఉందా?

 

ప్రభువయిన యేసు క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించకున్న తర్వాత, ప్రతి విశ్వాసి ఆశపడేది! అయన సేవలో వాడబడాలని. ఎందుకంటే దేవుడు పౌలు భక్తుని ద్వారా స్పష్టంగా  రాయించిన సత్యాలు ప్రతి విశ్వాసి లో  అటువంటి ఆలోచనలు,  ఆశలు కలగటానికి ప్రేరేపిస్తాయి.  పవిత్ర  గ్రంధమయిన  బైబిల్ లో చూసినట్లయితే అపొస్తలుడయిన పౌలు గారు కొరింథీయులకు  రాసిన మొదటి  పత్రికలో చాల విషయాలతో పాటు 12 వ అధ్యాయంలో ఆత్మసంబంధమైన వరములను గురించి చాల వివరంగా రాశారు. 

1 కొరింథీయులకు 12: "10. మరియొకనికి అద్భుతకార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి యున్నవి. 11. అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు."

ఈ వచనములలో స్పష్టంగా చెప్పబడుతున్న సంగతులు, క్రీస్తుసంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకై ప్రభువు తనను విశ్వసించిన వారికి తన చిత్తమును చొప్పున వారి వారి విశ్వాసమును బట్టి కృపావరములు అనుగ్రహిస్తున్నాడు. అందులో ఎన్నో ఆత్మీయ వరములు తెలుపబడి ఉన్నాయి. పౌలు గారు ఈ పత్రికలో కొరింథీ సంఘములో, ఆ సమయంలో జరుగుతున్న అపార్థములను వివరించారు. దురదృష్టవశాత్తు ప్రస్తుతం కూడా ఎన్నో సంఘములలో అంటువంటి అపార్థములు జరుగుతున్నాయి. సంఘమును నడిపే వారు సంఘము యొక్క క్షేమాభివృద్ధి  కొరకు కాకుండా తమను తాము ఘన పరచు కోవటానికి, ప్రజలను ఆకర్షించటానికి, ఈ కృప వరములను దుర్వినియోగం చేస్తున్నారు. అంతే కాకుండా లేని స్వస్థత వరములను ప్రదర్శిస్తూ సువార్త యొక్క ముఖ్య ఉద్దేశ్యములయిన మారు మనసు, పాప విమోచన మరియు  నిత్య జీవము అనే గొప్ప బహుమతులకు ప్రాముఖ్యం లేకుండా చేస్తున్నారు. 

దేవుడు స్వస్థతలను ఇస్తాడు, మరియు తనను నమ్ముకున్న వారికి క్షేమాభివృద్ధిని  కలిగిస్తాడు. కానీ అవి మాత్రమే పొందుకోవటానికి దేవుణ్ణి విశ్వసిస్తే, డబ్బు  సంచిని ఆశించి యేసయ్యను వెంబడించిన ఇస్కరియోతు  యూదాకు, మనకు  ఏవిధమయిన తేడా లేదు. దేవుడు ఎప్పుడయినా అల్పులను మరియు అభాగ్యులను హెచ్చించి తన పనిలో పాత్రలుగా వాడుకున్నాడు. ఎందుకంటే వారిలో ఉన్న బలహీనతను బట్టి  దీనత్వముతో పూర్తిగా దేవుని పైన ఆధారపడ్డారు. దేవుడు  ప్రతి విశ్వాసిని క్రీస్తు దేహమయిన సంఘములో ఒక అవయవముగా చేసుకొని ఉన్నాడని పౌలు గారు స్పష్టంగా వివరిస్తున్నారు. సంఘము లో అభివృద్ధి జరగటానికి ప్రతి ఒక్కరికి బాధ్యతలు అప్పగించి ఉన్నాడు. ఆ బాధ్యతల ఫలితమే ఈ  కృపావరములు లేదా తలాంతులు అని ప్రతి ఒక్కరం గ్రహించుకొని, వాటిని దేవుని నామ ఘనతార్థమై మాత్రమే ఉపయోగించాలి.  

దేవుడు జంతువులలో  ఎంతో అల్పమయిన గాడిదను మరియు పక్షులలో ఎంతో అల్పమయిన కాకిని సైతం తన పనిలో వాడుకున్నాడు. చెడిపోయిన ప్రవక్త బిలామును హెచ్చరించటానికి గాడిదకు మాట్లాడే శక్తిని ఇచ్చాడు. అంతే కాకుండా యేసు క్రీస్తు ప్రభువుల వారు బెత్లెహేము నుండి యెరూషలేముకు వస్తున్న సమయంలో గాడిదను ఎక్కి వచ్చారు. అదేవిధంగా జల ప్రళయం తర్వాత నొహవు బయటకు పంపితే మాంసమునకు ఆశపడి  శవములను తింటూ  వెనుకకు రాని కాకిని తన ప్రవక్త అయిన ఎలియా ఆకలి తీర్చటానికి వాడుకున్నాడు.  

మనం చెప్పుకుంటున్న ఈ సంఘటనలలో గాడిద ఎంత అల్పమయినది అయినప్పటికి దేవుడు దానికి మాట్లాడే శక్తిని ఇచ్చాడు. ఎందుకంటే ఆ సమయంలో ఆ ప్రవక్తను హెచ్చరించటానికి. ఆ విధంగా తన పనిని ఆ గాడిద ద్వారా జరుపుకున్నాడు. అదేవిధంగా మొదట మాంసానికి  కక్కుర్తి పడి వెనుకకు రాకుండా  తనకు ఇచ్చిన బాధ్యతను  నెరవేర్చని కాకిని సైతం దేవుడు వాడుకున్నాడు. తనకు ఎంతో ఇష్టమయిన మాంసమును తినకుండా ప్రవక్త కడుపు నింపే ఆ బుద్దిని దేవుడే కాకికి ఇచ్చాడు అనటంలో ఏ సందేహం లేదు.  అటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడు ప్రతి విశ్వాసికి ఇస్తాడని దేవుని వాక్యం స్పష్టంగా చెపుతోంది. కానీ దేవుడు తన సంఘము పనిలో మనలను బాగస్తులుగా చేసుకోవటానికి ఇచ్చిన ఈ ప్రతిభ, సామర్థ్యం మన గొప్పే అనుకోవటం, గర్వపడటం మన ఆత్మీయ జీవితానికి మేలు చేస్తుందా? 

విశ్వసంలో మనం శిశువులుగా ఉన్నపుడు ఉండే తగ్గింపు, కాస్త అనుభవం రాగానే నెమ్మదిగా మనలో తగ్గిపోవటం మొదలవుతుంది.  ఒక వేళ దేవుని శక్తి మూలంగా  మాట్లాడే సామర్థ్యం  పొందిన గాడిద దేవుడు చెప్పమన్న  మాటలు పలుకకుండా తన ఇష్టానుసారంగా పలకటం సబబేనా! అన్ని జంతువుల కన్నా తాను ఎంతో గొప్పదని తలిస్తే! ఎంత ముర్కత్వం? అదే గాడిద యేసు క్రీస్తు తనను అధిరోహించినప్పుడు ప్రజలంతా తన  ముందు నాట్యమాడుతూ, తమ వస్త్రములు పరుస్తున్నారని, తనను వారు ఆరాధిస్తున్నారనుకుని విర్ర విగితే ఎలా? ఆ గాడిద గుర్తించ వలసిన విషయం ఏమిటంటే దేవుని పలుకులు పలికినంత వరకే తనకు మాట్లాడే సామర్థ్యం, యేసు క్రీస్తును తాను మోసినంత వరకే తన ముందు ప్రజలు నాట్యమాడేది, హర్ష ధ్వనాలు చేసేది.

ఒక్కసారి మనలో దీనత్వం దూరం అయితే మన  ప్రతిభ, సామర్థ్యం ఎంత మాత్రం ఆశీర్వదింప బడలేవు. ఏవో వాణిజ్య ప్రకటనలు ఉపయోగించి ప్రజలను మభ్య పెట్టవచ్చు గాక! కానీ మనం  చేసే పనులు దేవునికి ఇష్టం ఉండదు, సంఘ అభివృద్ధికి ఎంత మాత్రం ఉపయోగపడవు. దేవుని పాత్రగా వాడబడాలని ఆశపడే సహోదరి, సహోదరుడా మన  సామర్థ్యం దేవుడు తన పని కోసం ఇచ్చినదే కానీ, మనలను మనం  ఘనపరచు కోవటానికి,  గర్వపడటానికి కాదని తెలుసుకోవాలి. అయన హస్తం మన మీద ఉన్నంత వరకె మనం ఏం చెప్పిన, ఏం పాడిన  విశ్వాసులకు కోకిల స్వరంల వినపడుతుంది లేదంటే కాకి అరుపులుగా మిగిలి పోతుంది. 

యాకోబు 4:6 "....అందుచేతదేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్ర హించును అని లేఖనము చెప్పుచున్నది."

దేవుని వాక్యం ఎన్నో సార్లు చాల స్పష్టంగా చెపుతున్న మాట గర్విష్ఠులను దేవుడు ఏమాత్రం అంగీకరించడని. నాశనమునకు ముందు గర్వం వస్తుందని. యాకోబు గారు రాసిన పత్రికలో ఈ  వచనము చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. దేవుడు ఇచ్చిన తలాంతులు అయన ఘనత కోసం వాడండి, దీనత్వాన్ని వదిలి పెట్టకుండా, గర్వ పడకుండా  ప్రభువు చిత్తమును నెరవేర్చండి. సంఘము క్షేమాభివృద్ధికై పాటు పడండి. మనం కాకపోతే మరొకరిని దేవుడు లేపుతాడు తన కార్యములు జరుపుకుంటాడు. గర్వపడి, దీనత్వమును విడచి  గొప్ప దేవునికి మీ పట్ల  ఉన్న  ఉద్దేశ్యమును కోల్పోకండి. 

దేవుని చిత్తమయితే వచ్చే  వారం  మరొక వాక్య భాగం  మీ ముందుకు తీసుకొస్తాము. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!

5, ఫిబ్రవరి 2022, శనివారం

ఆత్మీయతకు సూచనలు ఆశీర్వాదాల?

 

ఆత్మీయంగా ఎదగటం అనగా దేవునిలో ఎదగటం! మనలో చాల మంది ఎన్నో సమస్యలతో పోరాడుతూ ఉంటారు. కొంతమందికి సమస్యగా ఉన్నది కొందరికి చాల అల్పమయినదిగా ఉండవచ్చు, కొందరికి అసలు సమస్యగానే ఉండక పోవచ్చు. వారి వారి నేపథ్యములను బట్టి, పరిస్థితులను బట్టి వారి సమస్యల తీవ్రత మారిపోతూ ఉంటుంది. 

సమస్యతో మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, తనకున్న సర్వశక్తిని బట్టి దేవుడు మన సమస్యను తీర్చినప్పుడు, దేవుని మీద మనకు నమ్మకం ఏర్పడుతుంది, తద్వారా అన్ని ఆయనకు సాధ్యమే అని ఎరిగిన వారీగా ఆయనకు మరింతగా దగ్గరవుతాము. ఆ రకంగా విశ్వాసములో ఎదుగుతూ, అయన ప్రేమను ఎరిగి ఆ ప్రేమను పంచె వారీగా మారిపోతాము (నిజంగా పంచుతున్నామా?). అనగా వాక్యానుసారముగా బ్రతకటానికి ఇష్టపడేవారిగా మారిపోతాము (నిజంగా బ్రతుకుతున్నామా?). 

దేవుడు ఇచ్ఛే వాగ్దానాలను బట్టి మరింతగా మేలులు పొందుకోవటానికి ఆశపడుతూ ఉంటాము. అయితే ఇలాంటి మేలులు పొందుకోవటమే ఆత్మీయతకు అనగా దేవునికి చాల దగ్గరగా ఉన్నాం అనటానికి నిదర్శనం అని చాలామంది భ్రమపడుతూ, తాము అనుకున్నది జరగనప్పుడు దేవుని మీద అలగటానికి, ఆయనను ప్రశ్నించటానికి కూడా వెనుకాడటం లేదు!  చాల మంది తమ విశ్వాసమును కూడా కోల్పోతున్నారు.  

ఈనాడు ఎంతోమంది దైవ సేవకులు సైతం ప్రజల మానసిక బలహీనతలు ఎరిగి, వారికి లేనిపోని ఆశలు కల్పిస్తూ, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ సమస్యలు అన్ని తీరిపోతాయి అని అభివృద్ధిని కాంక్షించే బోధను మాత్రమే బోధిస్తున్నారు. కానీ ఆత్మీయ అభివృద్ధిని ఎవరు పట్టించుకోవటం లేదు. అసలు ఆశీర్వాదాలు పొందుకోవటమే ఆత్మీయ ఎదుగుదల, నువ్వు అనుకున్నది జరిగితినే దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు అన్న భ్రమలో సంఘమును ఉంచుతున్నారు. అదే నిజమయితే అపొస్తలులు అందరు అంబానీల? వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండలేదా? వారికీ ఎల్లప్పుడూ స్వాగత సత్కారాలే లభించాయా? 

ఆలోచించండి నా ప్రియా సహోదరి, సహోదరులారా! దేవుడు మనలను యాచించే స్థితిలో ఉంచడు! అయన ఎల్లప్పుడూ మనలను గమనిస్తూనే ఉంటాడు. ఉంటె ఎంత! ఊడిపోతే ఎంత! అనుకునే మన తల వెంట్రుకలు సైతం లెక్కించిన ఆయనకు, మన ఉద్యోగ విషయం తెలియదా? మన ఇంటి సమస్య పట్టదా? మన ఆరోగ్యం అవసరం లేదా? మన క్షేమం ఆయనకు సంభందం లేదా? 

ప్రసంగిలో చెప్పబడినట్లుగా ప్రతి దానికి ఒక సమయం ఉంది! ఆలస్యానికి ఎదో కారణం ఉంది. అది మన జ్ఞానమునకు అంతుపట్టదు. విశ్వాసము విడువక ఆయనకు మొఱ్ఱ పెట్టడమే మనం చేయవలసింది! తగు సమయంలో నీకు శ్రేష్ఠమయినది అయన దయచేస్తాడు. కానీ అనుకున్నది జరిగితినే ఆత్మీయ ఎదుగుదల అనగా దేవునికి చాల దగ్గరగా ఉన్నాం అనుకోవటం, మన ఆత్మీయతను తప్పుదారి పట్టిస్తుంది. 

మన సాక్ష్యములు కూడా అలాగే ఉంటాయి! అన్ని అద్భుతాలే ఉండాలి. ఎన్నో రకాల మలుపులు ఉండాలి, వినే వారికి మన మీద గొప్ప విశ్వాసులు అని అభిప్రాయం కలగాలి. దేవుడు మన జీవితాలలో అద్భుతాలు చేస్తున్నాడు అని అందరికి తెలియాలి. తద్వారా సంఘంలో మన పట్ల గొప్ప విశ్వాసులు అని పేరు, గౌరవం! కానీ మన పాత స్వభావమును దేవుడు ఏలా మారుస్తున్నాడు, ఎన్ని ఆత్మఫలములు పొందుకున్నాము అన్న విషయాలు ప్రాధాన్యం లేనివిగా మారుతున్నాయి.  

దేవుడు చేసిన గొప్ప కార్యములు పంచుకోవటం తప్పుకాదు! కానీ దేవుడు మన జీవితాలలో చేస్తున్న అద్భుతాలను బట్టి, ఆశీర్వాదాలను బట్టి మనం ఆత్మీయంగా బలపడుతున్నాం అనుకోవటం మన ఆత్మీయ జీవితానికి క్షేమం కాదు. ఆశీర్వాదాలు పొందుకోవటమే దేవునికి దగ్గర ఉండటం అయితే! అదే మన ఆత్మీయతకు కొలమానము అయితే, యేసయ్య ఎందుకు "సూది బెజ్జములోంచి ఓంటే వెళుతుందేమో గాని ధనవంతుడు పరలోకం చేరలేడు" అని బోధించాడు! దేవుడు తన ప్రజలను దీవిస్తాడు, అవసరం అయినంత! తన ప్రజలకు ధనాన్ని ఇస్తాడు కానీ తనను మరచిపోనంత! 

సామెతలు 30: "8. వ్యర్థమైనవాటిని ఆబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయ చేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. 9. ఎక్కువైనయెడల నేను కడుపు నిండినవాడనై నిన్ను విసర్జించి యెహోవా యెవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతు నేమో."

సొలొమోను గారు రాసిన సామెతల గ్రంథం నుండి పై వచనం చూడండి! "ఎక్కువ పేదరికంలో నన్ను ఉంచకు, నేను దొంగగా మారిపోతానేమో! అలాగే ఎక్కువ ధనము నాకు ఇవ్వకు అహంకారముతో నిన్ను మరచిపోతానేమో" అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. దేవునికి మనలను దూరం చేసే ఏ ఆశీర్వాదమైన మనకు దేనికి?  యేసయ్య (మత్తయి 16:26) "ఒక్కడు సర్వ లోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమిటి లాభము, ప్రాణమునకు బదులుగా ఏమి ఇవ్వగలడు?" అని హెచ్చరించలేదా? 

అదే పనిగా లోకపరమయిన ఆశీర్వాదాల కోసం ఆశపడకండి, అవి పొందుకుంటేనే ఆత్మీయ ఎదుగుదల అని భ్రమపడకండి. దేవుణ్ణి నమ్మిన వారు, అయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎన్నటికీ తోకగా ఉండరు. కీర్తనల గ్రంథంలో క్రింది వచనం చూడండి!

కీర్తనలు 37: "25. నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుండలేదు."

ప్రభువునందు ప్రియులారా పై వచనం ఎంతగానో మనకు ధైర్యం నింపుతుంది కదా! దావీదు వృద్దుడిగా అయినప్పుడు అంటున్న మాట ఏమిటంటే, తన చిన్నతనం నుండి నీతిమంతులు అనగా దేవుని యందు విశ్వాసముంచి అయన ధర్మ శాస్త్రమును జరిగించు వారు అనగా అయన వాక్యానుసారముగా నడచుకొనే వారి పిల్లలు యాచన చేయటం చూడలేదట. అయ్యో మన భవిష్యత్తు ఏమవుతుందో అని బెంగ మానుకోండి. అన్ని మన పరలోకపు తండ్రికి తెలియును. ఆలా అని చేతిలో ఉన్న పని మానేయటం కాదు సుమా!  పని చేయకపోవటం కూడా దేవుని వాక్యానికి విరుద్ధమే (2 థెస్సలొనీకయులకు 3:10). 

సహోదరి, సహోదరుడా ఒక్కసారి ఐగుప్తు నుండి బయలు దేరిన ఇశ్రాయేలు ప్రజల జీవితమును తరచి చూడు! వారి ప్రయాణం అంత అద్బుతములే! వారు పొందుకున్నవి అన్ని ఆశీర్వాదములే! కానీ వారి జీవితం దేవునికి ఎందుకు హేయముగా మారిపోయింది? ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్న, ఎన్ని అద్భుతములు చూసిన వారి ఆత్మీయ జీవితం ఎదుగలేదు. దేవుని యెడల విశ్వాసం పెంచుకోలేక పోయారు, కాస్త విశ్వాసాన్ని కూడా  కొనసాగించలేక పోయారు. ఐగుప్తులో తెగుళ్ళ  నుండి కాపాడటం, ఎర్ర సముద్రం రెండుగా చీలిపోవటం, ఆరిన నేల మీద సముద్రంలో నడవటం, ఫరో సైన్యం సముద్రంలో మునిగిపోవటం, ఆహారం అడిగినప్పుడు, దేవదూతలు తినే ఆహారం మన్నాను దేవుడు వారి కోసం కురిపించటం, ఇవ్వని అద్బుతములే. 

నిర్గమకాండము 16: "15.  ఇశ్రాయేలీయులు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియకఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. 16. మోషేఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించిన దేమనగాప్రతివాడును తనవారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరుచొప్పున దాని కూర్చుకొనవలెను, ఒక్కొక్కడు తన గుడారములో నున్నవారికొరకు కూర్చుకొనవ లెననెను. 17. ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చు కొనిరి. 18. వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చు కొనినవానికి ఎక్కువగా మిగులలేదు తక్కువగా కూర్చుకొనినవానికి తక్కువకాలేదు. వారు తమ తమ యింటివారి భోజనమునకు సరిగా కూర్చుకొనియుండిరి. "

పై వచనం చదివితే ఏమి తెలుస్తుంది! దేవుడు ఇశ్రాయేలు వారిని పోషించటానికి వారు ఎన్నడూ చూడని దేవదూతల ఆహారం మన్నాను కురిపించాడు. వారిలో కొందరు కొలత తెలియక తక్కువ సమకూర్చుకున్న కూడా వారికి తక్కువ కాలేదు, ఎక్కువ తీసుకున్న వారికి ఎక్కువ కాలేదు. ఈ విధంగా వారి ప్రయాణం అంతటిలో ఎన్నో అద్భుత కార్యముల చేత వారిని నడిపించాడు మరియు పోషించాడు. అయినప్పటికి వారి కోరికలకు అంతే లేకుండా పోయింది, వారి సణుగుడు దేవుని ఆగ్రహానికి వారిని గురి చేసింది. దేవుడు ఎన్నోమార్లు అద్బుతములచే మన యొక్క అవసరతలు తీరుస్తాడు. తద్వారా మనం ఆత్మీయంగా ఎదిగాం అనుకోవటం మనలను మనం మోసం చేసుకోవటమే అవుతుంది. 

దేవుని చిత్తమును ఎరిగి, అయన స్వరూపంలోకి మారటమే నిజమయిన ఆత్మీయ ఎదుగుదల. మన ప్రాచీన స్వభావమును ఎంతగా తగ్గించుకుంటున్నాము, ఎన్నీ ఆత్మ ఫలములను (గలతీయులకు 5:22)  పొందుకొంటున్నాము. ఇవి మన ఆత్మీయతకు కొలమానాలు కావాలి. 

మన ముందు ఉన్న గొప్ప ఉదాహరణ,  మన రక్షకుడయినా యేసు క్రీస్తు ప్రభువు! అయన ఏనాడూ కూడా అద్భుతములు కోరుకోలేదు! అద్బుతముల ద్వారా ప్రజలను స్వస్థపరచి వారికి  దేవుని ప్రేమను పరిచయం చేసాడు. అదేవిధంగా తన పరిచర్యకు అవసరమయినప్పుడు మాత్రమే అద్భుతములను చూపించాడు. తనను శోధించి, సూచక క్రియ చూపుమన్న వారికి ఏ విధమయిన  సూచక క్రియను లేదా అద్బుతమును చూపలేదు. తన గొప్పకోసం కాకుండా కేవలం దేవుని చిత్తమును మాత్రమే అయన కోరుకున్నాడు. 

నలుపది దినములు ఉపవాసము ఉన్న ఆయనను సాతాను ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని ఆకలి తీర్చుకో అన్నప్పుడు అయన అద్భుతములు చేయలేదు. దేవుని నోట నుండి వచ్చే మాటలు తనను బ్రతికిస్తాయని సాతానును ఎదిరించాడు. ఇది దేవుని చిత్తమును నెరవేర్చటం. అద్భుతములు చేయటం, ప్రదర్శించటం యేసయ్య  ప్రథమ కర్తవ్యం కాదు కానీ  దేవుని ప్రేమను చూపటమే తండ్రి చిత్తము అని ఎరిగి అటువంటి జీవితమును అయన జీవించాడు, మన నుండి అదే కోరుతున్నాడు. 

మత్తయి 6: "33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పు డవన్నియు మీకనుగ్రహింపబడును."

మత్తయి సువార్త కొండమీది ప్రసంగములో యేసయ్య ఏమన్నాడో పై వచనంలో చూడండి. దేవుని రాజ్యమును, నీతిని వెదకు వారికీ అన్నియు అనుగ్రహింపబడును. దేవుని రాజ్యము అనగా పాపములను బట్టి పశ్చాత్తాపపడి, మారు మనసు పొందుకొవటం (మార్కు 1:15). మరియు దేవుని నీతి అనగా యేసు క్రీస్తు మొదటి రాకడకు ముందు అయితే ధర్మశాస్త్రమును పాటించటం. కానీ యేసు క్రీస్తు ధర్మ శాస్త్రమును నెరవేర్చాడు కనుక అయన యందు విశ్వాసమే దేవుని నీతి అని రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు స్పష్టం చేస్తున్నారు. 

రోమీయులకు 3: "21. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు. 22. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై,నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది."

యేసు క్రీస్తు నందు విశ్వాసము అనగా ఏమిటి? అయన బోధలు పాటిస్తూ, మనలను మనం తగ్గించుకొంటూ అయన రూపంలోకి మారిపోవటమే. యేసయ్య ఏనాడూ అద్భుతములు ప్రదర్శించలేదు, ధనమును ఎవరికీ ఇవ్వలేదు. అయన ఇచ్చింది పాప క్షమాపణ, కోరుకుంటున్నది మారు మనసు, పవిత్ర జీవితము. ఇవి మాత్రమే ఆత్మీయ జీవితానికి సాక్ష్యములు. 

1 తిమోతికి 6: "6. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది. 7.  మనమీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము. 8. కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము. 9. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును."

చివరగా పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రికలో పై వచనము చూడండి! (ఆరవ అధ్యాయము పూర్తిగా చదవ వలెనని ప్రభువునందు మిమల్ని వేడుకుంటున్నాను)  సంతృప్తి కరమయిన జీవితము దైవ భక్తికి దోహదపడుతుంది. లోకంలోకి ఏమి తీసుకోని రాలేదు! ఏమి తీసుకోని పోలేము! ధనాపేక్ష మనలను శోధనలో పడవేస్తుంది! తద్వారా మన ఆత్మీయ జీవితం నశించిపోతుంది. న్యాయంగా సంపాదించుకోవటం తప్పు అని చెప్పటం లేదు! 

అబ్రాహాము, యోబు లాంటి గొప్ప భక్తులు ఎంతో ధనవంతులు అని బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. వారు ఆశీర్వాదాలు పొందుకోవటమే ఆత్మీయ జీవితం అనుకోలేదు. దేవుణ్ణి ప్రేమించటం, అయన ఆజ్ఞలు పాటిస్తూ, పవిత్రముగా జీవించటమే  ఆత్మీయ ఎదుగుదల అనుకున్నారు. ఆత్మఫలములే మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కావాలి కానీ ఆశీర్వాదాలు, అద్భుతాలు కాదు! 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరొక వాక్య భాగంతో  మీ ముందుకు వస్తాము. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!