పేజీలు

23, డిసెంబర్ 2022, శుక్రవారం

క్రిస్మస్ సందేశము!

 

దేవుడు మానవులను తన స్వరూపములో నిర్మించాడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తోంది. తన స్వరూపములో మనలను ఏర్పరచిన కూడా దేవుడు మనకు సొంత చిత్తమును అనుగ్రహించాడు. ఆవిధముగా మనము ఆయనను మనస్ఫూర్తిగా ప్రేమించే వారిగా ఉండాలని అయన అనుకున్నాడు. అంటే ఏమిటి? ఆయనను కాదని, అయన ఆజ్ఞలను కాదని మన ఇష్టానుసారముగా జీవించే అవకాశం దేవుడు మనకు ఇచ్చాడు. లేదు అంటే మనకు మర బొమ్మలకు తేడా ఉండదు.

ఆ క్రమములో మొదటి మానవులు అయినా ఆదాము, అవ్వ దేవుని ఆజ్ఞలను మీరి, తమ ఇష్టానుసారముగా జీవించాలనుకున్నారు. కాబట్టి దేవునితో సాన్నిహిత్యం కోల్పోయారు. ఎందుకని దేవుని సాన్నిహిత్యం కోల్పోయారు? దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో పరమాణువంత పాపం కూడా లేదు. కానీ దేవుని ఆజ్ఞను అతిక్రమించటం ద్వారా ఆదాము, అవ్వ పాపంలో పడిపోయారు. దేవుని స్వరూపములో చెయ్యబడిన వారిలో అప్పటి వరకు ఉన్న దేవుని మహిమ వారి నుండి విడిపోయింది. దాని స్థానములో తమ సొంత చిత్తము ద్వారా వచ్చిన స్వార్ధము, అసూయా, కోపము, ద్వేషము మరియు కామము లాంటి శరీర క్రియాలన్నీ పెరిగిపోయాయి.

ఈ క్రమములో పాపమునకు హేతువయినా మానవ శరీరమునకు మరణం సంభవించటం మొదలయింది. కానీ మరణం లేని ఆత్మ దేవుని ముందు తీర్పునకు నిలబడే పరిస్థితి ఏర్పడింది. ఆ విధముగా శరీరములో ఉండి చేసిన ప్రతి పాపానికి నిత్యత్వములో నరకము లేదా పరలోకము అనగా దేవుని సన్నిధి అనుగ్రహించాలన్నది దేవుని నియామము. మనుష్యులు శరీరములో ఉన్నంత కాలం పాపం లేకుండా జీవించాలని, ముందుగా మనుష్యులకు మనసాక్షిని ఇచ్చాడు. ఆ తర్వాత లోకానికి తానె రక్షకుడిగా రావటానికి, ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకొని వారికి పది ఆజ్ఞలు ఇచ్చి, తన ప్రజలుగా వారిని నడిపించాడు. 

వారు తప్పు చేసిన ప్రతి సారి కూడా వారిని  శిక్షించాడు, న్యాయమంతుడిగా నిరూపించుకున్నాడు. ఆదే సమయంలో అనంతమయిన ప్రేమ కలిగిన తండ్రిగా, ఎన్నో మహిమల ద్వారా వారిని ఆదుకున్నాడు. యేసు క్రీస్తుగా తానూ రాబోతున్నట్లుగా ఎన్నో ప్రవచనాల ద్వారా తన రాకను ముందుగా తెలియజేసాడు. కన్య మారియా గర్భములో దేవుని పరిశుద్దాత్మ ద్వారా రక్షకునిగా లోకములో పుట్టాడు. ఈ యేసు క్రీస్తు ఎవరు? "దేవుడు పెట్టిన ఆజ్ఞలు అన్ని నెరవేర్చి, తన సొంత చిత్తము నెరవేర్చే అవకాశం ఉండి కూడా, తన ఇష్టం వదులు కొని కేవలం దేవుని చిత్తము చేయటానికి వచ్చాను" అని చాల సందర్భాలలో బోధించాడు అని దేవుని వాక్యం చెపుతుంది. దేవుని శక్తిని పొందుకొని, పాపం లేకుండా, ఎలా జీవించాలో మనుష్యులకు నేర్పించటానికే అయన వచ్చాడు. మనుష్యులను పాపం నుండి రక్షించటానికి వచ్చిన దేవుని కుమారుడు.

మనుష్యులను పాపం నుండి ఎలా రక్షిస్తాడు? దేవుని బలిదాన నియమం ప్రకారం, పాపం లేకుండా జీవించి మన అందరి కోసం కళంకం లేని తన రక్తం కార్చి మన పాపాలను రద్దు చేసాడు. మనుష్యులు గురవుతున్న మరణమును తానూ పొంది, దాన్ని జయించి, పాపం ద్వారా మనకు వచ్చే మరణాన్ని తొలగించాడు. ఆయనను విశ్వాసించి, మన పాపాలను ఒప్పుకొని, మన ప్రవర్తన మార్చుకుంటే, తన పరిశుద్దాత్మ శక్తి ద్వారా మనలను తనకు ఇష్టమయిన వారిగా నడిపించి, మనకు రక్షణను అనుగ్రహిస్తాడు. ఆదాము ద్వారా మనం కోల్పోయిన దేవుని మహిమను, యేసు క్రీస్తు స్వరూపము లోకి మార్చటం ద్వారా, శరీర మరణం తర్వాత, దేవునితో పరలోకములో తన మహిమలో నివసించే నిత్య జీవితన్ని అనుగ్రహిస్తాడు.

అందుకనే, యేసు క్రీస్తును నమ్ముకున్న వారిని రక్షణ పొందుకున్న వారు లేదా రక్షించబడిన వారు అని పిలుస్తారు. అసలు రక్షణ పొందుకోవటం అంటే ఏమిటి? దేవుని  వాక్యాను సారముగా నేర్చుకుందాము.

లూకా సువార్త 19: "8. జక్కయ్య నిలువబడిఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవని యొద్ద నైనను అన్యాయముగా దేనినైనను తీసికొనిన యెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. 9. అందుకు యేసు ఇతడును అబ్రాహాము కుమారుడే; ఎందుకనగా నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది. 10. నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను."

ఇక్కడ జక్కయ్య అనబడే వ్యక్తి, పన్నులు వసూలు చేసే  అధికారి, ఎంతో ధనవంతుడు అయినప్పటికీ యేసు క్రీస్తు గురించి విని ఆయనను చూడాలని, ఆ దారి వెంట అయన వస్తున్నాడని కాపు కాచాడు. కానీ తానూ పొట్టి వాడు కావటం చేత జనాలు ఆడ్డువస్తారని చెట్టు ఎక్కి ఎదురు చూస్తున్నాడు. ఆ రోజుల్లో పన్నులు వసూలు చేసే వారిని ఘోరమయిన పాపులుగా భావించే వారు. ఎందుకంటే వారు పేదలను పీడించి డబ్బులు వసూలు చేసి ధనవంతులు అవుతారని. అటువంటి వాడే జక్కయ్య కూడా. అంతటి ధనవంతుడు, ఏ చీకు చింత లేని జక్కయ్య దారుల వెంబడి ఎందుకు తిరుగుతున్నాడు? బహుశా తనకు మనశాంతి కరువయి ఉందేమో. యేసు క్రీస్తు ఇచ్చే ఆ శాంతి, సమాధానం తనకు కావాలనుకున్నాడేమో. ఎక్కడో "తానూ పాపం చేసి ధనం సంపాదించాడు" అని మనసాక్షి ఎదురు తిరిగిందేమో. అందుకే ఏసయ్యను ఒక్కసారి చూడాలని, అయన మాటలు వినాలని ఆశపడ్డాడు. 

జనాలు అడ్డు వస్తున్నారు, మళ్ళి ఎప్పుడయినా చూద్దాంలే అని వెనుకకు తిరిగి పోలేదు. ధనవంతుడయినా నేను, ఒక బోధకుడి కోసం చెట్టు ఎక్కటం ఏమిటీ? అని అహంకారం చూపించలేదు. ఎలాగయినా అయన మాటలు వింటే, తన బ్రతుకు మారిపోతుందేమో,  పాపిగా తనకు పడిన ముద్ర ఆ విధముగా చెదిరి పోతుందేమో, అని ఆశ పడ్డాడు. ఇప్పటికి కూడా ఎంతో  మంది యేసయ్యను విశ్వసించాలని, వెంబడించాలని ఆశ ఉన్న కూడా, పాత కాలం అలవాట్లు అడ్డువచ్చి ఆగిపోతారు. బంధువులు, స్నేహితులు ఎక్కడ వెలి వేస్తారో, హేళన చేస్తారో  అని భయపడతారు. మరణం లేని మన ఆత్మకు జవాబు దారి మనమే అవుతాము కానీ, మన బంధువులు, స్నేహితులు కారు.  చెట్టు ఎక్కిన జక్కయ్య యేసయ్య ను పిలువలేదు, తనను చూడాలని ఏ విధమయిన సైగలు చెయ్యలేదు. చెట్టు కిందికి రాగానే యేసయ్య "జక్కయ్య కిందికి దిగి రా, నేను నీ ఇంటికీ వస్తాను" అన్నాడు. 

మనలను కూడా అలాగే అలాగే పిలువటానికి, దర్శించటానికి అయన సిద్ధముగా ఉన్నాడు. కేవలం, ఆయనను చూడాలని ఆశ కలిగి ఉంటె చాలు, ఒక్క అడుగు నువ్వు వేస్తె లెక్కలేని అడుగులు వేసి నిన్ను చేరుకుంటాడు,  తన వాడిగా నిన్ను మార్చుకుంటాడు. అప్పుడు ఏమి జరుగుతుంది? ఒక్కసారి జక్కయ్య జీవితాన్ని చూడండి, అప్పటి వరకు అన్యాయంగా ధనం సంపాదించినా జక్కయ్య ఒక్కసారిగా నీతి మంతుడిగా మారిపోయాడు. పేదలకు తన సంపాదనలో సగం దానం చేసాడు, అంతే కాకుండా ఎవరి వద్దయినా అన్యాయంగా పన్ను వసూలు చేస్తే నాలుగు రేట్లు పరిహారం చెల్లించాడు. ఇక్కడ జక్కయ్య తన పాపాలు ఒప్పుకున్నాడు, తన పాపపు జీవితం వదిలి పెట్టాడు. అందుకే యేసయ్య అన్నాడు "ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చిందని. నశించిపోయిన దానిని, వెతికి రక్షించటానికి నేను వచ్చానని" 

ప్రియయిన నేస్తమా! నువ్వు నమ్మే సిద్ధాతం నిన్ను ఎంతగా మారుస్తుందో ఒక్కసారి పరిశీలించి చూసుకో! నరకం పేరు చెప్పి భయపెట్టటం క్రీస్తు తత్త్వం కాదు. నీకు మారు మనసు ఇచ్చి, నీలో ఉన్న పాపమూ యొక్క బీజమును తొలగించటం క్రీస్తు విధానము. శరీరం పై కలిగే పుండుకు మందు రాయటం పాతకాలం నాటి నాటు వైద్యపు పద్దతి, పుండ్లకు కారణం అవుతున్న శరీరంలో బ్యాక్టీరియాను చంపే పద్దతి నూతనమయిన ఉన్నత వైద్య విధానము. యేసయ్యను తెలుసుకోవటం వల్ల జరిగేది అదే. మన పాపానికి కారణం అవుతున్న అన్ని శరీర క్రియలను జయించటానికి శక్తి లభిస్తుంది. మన సాక్షి కంటే ఎంతో, శక్తి కలిగిన పరిశుద్దాత్మ శక్తి మనలను నడిపిస్తుంది. 

నువ్వు ఎన్ని పుణ్య కార్యాలు చేస్తే, దేవునికి ప్రామాణికమయిన జీవితాన్ని పొందుకోగలవు? ఎంత నిష్టగా ఉంటె, నువ్వు కోరుకొనే మోక్షము అందుకోగలవు? ఏసయ్యను విశ్వాసిస్తే, అయన నీతి నీకు లభిస్తుంది. ఆయన శక్తి ద్వారా నువ్వు కోరుకొనే పాపం లేని జీవితం జీవించే అవకాశం ఉంది. క్రీస్తు చేతకాక సిలువలో చనిపోలేదు, అయన చనిపోవటానికే ఈ భూమి మీదికి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించటానికే ఆ దేవుడు మనిషిగా అవతరించాడు. అదే క్రిస్మస్ పండుగ. మన పాపాలు ఒప్పుకోని, వాటిని విడిస్తేనే మనకు రక్షణ. అది వదిలేసి, ఎన్ని పాటలు పాడిన, ఎన్ని గంతులు వేసిన, ఆయన తెచ్చిన రక్షణ మనలో లేనట్లే. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకు దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!! 

22, డిసెంబర్ 2022, గురువారం

సువార్త చెపుతున్నావా?


ప్రపంచం అంత జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్, అంటే యేసు క్రీస్తు పుట్టిన రోజు అని అందరి నమ్మకం. క్రైస్తవులు అంటే క్రీస్తును అనుసరించే వారు అని అర్థమని మనందరికి తెలుసు. క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అన్న విషయం కూడా ప్రతి క్రైస్తవుడికి తెలుసు. పాపముల నుండి మనలను రక్షించటానికి దేవుని కుమారుడు అయినా యేసు క్రీస్తు భూమి మీద జన్మించాడు. ఈ సువార్తను పది మందికి తెలుపాలని క్రైస్తవులందరు ఎంతగానో ఆరాట పడుతుంటారు. క్రైస్తవులుగా పిలువబడుతున్న వీరు, క్రీస్తును నిజముగా అనుసరిస్తున్నారా? 

క్రిస్మస్ సీజన్ వచ్చిందంటే చాలు, ప్రతి చర్చ్ లో ఎంతో హడావిడి మొదలవుతుంది. కారల్స్  తో  సువార్త,  మినీ క్రిస్మస్ తో సువార్త, పాటల ద్వారా సువార్త, క్రిస్మస్ ఉత్సవాలతో సువార్త. ఎందుకని  సువార్త చెపుతున్నాము? యేసయ్య చెప్పమన్నాడు కాబట్టి. కానీ అయన సువార్త ఒక్కటే చెప్పమన్నాడా? వారందరిని తన శిష్యులుగా మార్చమన్నాడు. యేసు క్రీస్తు దేవుడని అన్యులు సైతం నమ్ముతారు కదా. మరి వెళ్ళి వారికి సువార్త చెప్పినంత మాత్రాన మారిపోతారా? దేవుడు ఒక వ్యక్తిని మార్చాలనుకుంటే ఒక చిన్న కరపత్రిక చాలు. ఇంత హడావిడి అవసరం లేదు. 

యేసయ్యను అనుసరించమని అన్యులకు చెప్పే ముందు, నువ్వు ఆయనను అనుసరిస్తున్నావా? అయన శిష్యునిగా మారమని, నీ స్నేహితునికి చెప్పే ముందు, నువ్వు అయన శిష్యుడిగా ఉన్నావా? యేసయ్య తన శిష్యులను సువార్త చెప్పమని ఎప్పుడు పంపాడు? వారిని విశ్వాసములో బలపరచిన తర్వాత కదా! మరి మన విశ్వాసము కేవలం మాటలలోనే ఉందా లేక చేతలలో కూడా ఉందా? యేసయ్య శిష్యులుగా ఉండటం అంటే, అయన చెప్పిన ప్రతి ఆజ్ఞను పాటించాలని. 

1 యోహాను 3: "22. ఆయన ఆజ్ఞ యేదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని, ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింప వలెననునదియే."

యేసయ్య ప్రియా శిష్యుడయినా యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ఈ వచనం ఏమి చెపుతుంది. యేసు క్రీస్తు మనకు ఇచ్చిన ఆజ్ఞ, ఒకరి నొకరు ప్రేమించాలని. మనం క్రీస్తు మనుష్యులం అని చెప్పుకుంటే సరిపోదు, మనలో పాపం లేకుండా చూసుకోవాలి. పాపం మనలో ఉంటే, మనకు ఆయనకు సంబంధం లేదని దేవుని వాక్యం చెపుతుంది (1 యోహాను 3:6). మనకు అన్ని సౌకర్యాలు ఉండి, మన పక్కవాడు, తిండికి కూడా కష్టపడుతుంటే, నాకేందుకు అనుకుంటే, యేసయ్య ప్రేమ మనలో లేనట్లే. మనం అయన శిష్యులం కానట్లే. మనకు ఉన్నవన్నీ అందరికి పంచేయమని దేవుడు చెప్పటం లేదు. నీకు ఉన్న దాంట్లో, సంతోషంగా ఇతరులకు సహాయం చేయమని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. 

మనం చూపే ఆ ప్రేమ ఎంతో మందిని యేసయ్యకు దగ్గర చేస్తుంది! నీతి కలిగిన జీవితం మన బంధువులను, స్నేహితులను అయన శిష్యులుగా మారుస్తుంది. ఎన్నో ప్రసంగాల ద్వారా చెప్పలేని సువార్త నీ జీవితం ద్వారా చెపితే, ఎంతో మంది మారి, నశించి పోకుండా క్రీస్తులోకి వచ్చే అవకాశం ఉంది. సువార్త భారం మంచిదే, కానీ అంతకన్నా ముందు మన  విశ్వాస జీవితం ఇంకా ప్రాముఖ్యమయినది. మనం బ్రతికి చెపితే, ఎదుటి వారి హృదయంలో దేవుడు దాన్ని ఫలింప చేస్తాడు. మనం పాటించకుండా ఎంత గొంతూ చించుకున్నా ఫలితం ఉండదు. 

1 యోహాను 3: "19. దేవుడు మన హృదయము కంటె అధికుడై, సమస్తమును ఎరిగి యున్నాడు గనుక మన హృదయము ఏ యే విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన యెదుట మన హృదయములను సమ్మతి పరచుకొందము."

పై వచనంలో చెప్పినట్లుగా దేవునికి నచ్చినట్లు బ్రతకటానికి మనకు గొప్ప బైబిల్ వాక్యాలు కూడా తెలియనవసరం లేదు. మన మనసు ఏ విషయాలలో మనలను తప్పు పడుతుందో వాటి విషయంలో దేవుని ఎదుట మన మనసును  సమాధాన పరచుకుంటే చాలు. మనలో దేవుని ప్రేమ ఉన్నట్లే, మనం యేసయ్య శిష్యులుగా నడచుకున్నట్లే. 

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మాటలతో, పాటలతో, ఇంకా ఎన్నో రకాలుగా సువార్త చెప్పటం మంచిదే! అన్నింటి కన్నా మనకు తెలిసిన వారికి మన జీవితాల ద్వారా చెపితే ఇంకా గొప్ప పరిచర్య చేసిన వారిగా ఉంటాము. మీకు పాటలు పాడే శక్తి లేక పోవచ్చు, ప్రసంగాలు చేసే తెలివి, దైర్యం లేక పోవచ్చు, మిమల్ని ఎవరు దేవుని పరిచర్యలో పాలి బాగస్తులు చేయట్లేదేమో! వాటి అవసరం లేదు. ప్రభువు మిమల్ని పిలుచుకున్నాడు, విశ్వాసం ఇచ్చి నడిపిస్తున్నాడు. మీ జీవితం చాలదా! అయన ప్రేమను చాటటానికి, సువార్త చెప్పటానికి! ఆలోచించండి, ఆచరించండి. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!!

9, డిసెంబర్ 2022, శుక్రవారం

దేవుడు ఇచ్చే సమృద్ధి!


విశ్వాసులు అయినా  మనము చాల సార్లు మనకు ఉన్న అవసరాలను బట్టి, దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానాలు ఎత్తి పడుతూ ఆయనను ప్రార్థిస్తూ ఉంటాము.  కానీ మనలో చాల మంది తాము ఉన్న పరిస్థితులను బట్టి, వారికి ఉన్న జ్ఞానమును బట్టి అవిశ్వాసములో పడిపోతూ ఉంటారు. ఎందుకంటే చాల సార్లు మనము దేవుడు నుండి ఆలస్యముగా సమాధానము పొందుకుంటాము. కానీ దేవుడు పాటించే సమయము, అయన ప్రణాళికలు అన్ని కూడా మనకు మేలు చేయటానికే తప్ప కీడు చేయటానికి కాదు అని దేవుని వాక్యం సెలవిస్తోంది (యిర్మియా 29:11).  అధె విధముగా మన తెలివిని బట్టి కాకుండా, మన పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మకము ఉంచి, మన ప్రవర్తన అంతటి యందు అయన అధికారమును ఒప్పుకోవటం ద్వారా అయన మన త్రోవలు సరళం చేస్తాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తోంది (సామెతలు 3:5-6). 

వాగ్దానము ఇచ్చి మరచి పోనీ దేవుడు ఖఛ్చితముగా మనకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే యేసు క్రీస్తు బోధలో చెప్పినట్లుగా, పాపములము అయినా మనమే మన బిడ్డలకు ఎన్నో గొప్ప ఈవులు ఇవ్వాలని ఆశపడుతుంటే, నీతి మంతుడయినా పరలోకపు తండ్రి ఇంకా ఎన్నో గొప్ప దీవెనలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అయన రొట్టె అడిగిన వారికి రాతిని, చేప అడిగిన వారికి పామును ఇవ్వని దయ కలిగిన తండ్రిగా ఉన్నాడు.  కానీ ఈ సమృద్ధి చాల సార్లు మనలను గర్విష్టులుగా మారుస్తుంది. మన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశ్యాలను మనం తప్పిపోయేలా చేస్తుంది. 

దేవుని వాక్యంలో నుండి మనం ఇప్పుడు అటువంటి వారిని గురించి ఇప్పుడు ధ్యానించుకుందాము. 

‭‭నిర్గమకాండము‬ ‭11‬:‭ "2. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును తన చెలికత్తె యొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసికొనుడని ప్రజలతో చెప్పుము. 3. యెహోవా ప్రజలయెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను; అదిగాక ఐగుప్తుదేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను."

ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం లో నుండి విడిపించే చివరి సమయంలో దేవుడు మోషే ద్వారా,  ఐగుప్తీయుల నుండి వెండి నగలను, బంగారు నగలను అడిగి తీసుకోవాలని చెపుతున్నాడు. ఐగుప్తీయులకు బానిసలయినా ఇశ్రాయేలు వారి మీద దేవుడు కరుణ కలిగించాడు. అంతే కాకుండా  దేవుడు మోషే ద్వారా చేసిన అద్భుత కార్యములను బట్టి వారికి మోషే పట్ల కూడా ఎంతో గౌరవం ఏర్పడింది. బానిసలూ అయినా వారికి జీత భత్యాలు ఉండవు, పెట్టినది తినీ చెప్పిన పని చెయ్యటమే వారి పరిస్థితి. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను సమృద్ధిగా దీవించి బయటకు తీసుకురావాలనుకున్నాడు. వారు అంతకాలం చేసిన వెట్టి చాకిరికి జీతం ఇప్పించాడు. 

ఫరో ఒక్కసారి మోషేతో "మీ పశువులను ఇక్కడే ఉంచి మీ దేవుణ్ణి ఆరాదించటానికి వెళ్ళండి" అన్నప్పుడు, మోషే "మా దేవునికి మేము బలులు అర్పించాలి, ఎన్ని పశువులు అవసరం అవుతాయో మాకు తెలియదు, కనుక మా పశువులన్ని మాతో రావాల్సిందే" అంటాడు. ఇక్కడ ఇశ్రాయేలు వారికి లభించిన బంగారం కూడా దేవునికి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకోకుండా,  దేవుడు వారికి ఆ సమృద్ధిని ఎందుకు ఇచ్చాడో ఎదురు చూడకుండా, సమృద్ధి ఉంది కదా అని వారు చేసిన పని ఏమిటి? మోషే దేవుని ధర్మశాస్త్రం కోసం వెళ్ళి నలుపది దినాలు కొండ దిగి కిందికి రాలేదని, దేవునికి వ్యతిరేకంగా బంగారు దూడను చేసుకొని దాన్ని పూజించటం మొదలు పెట్టారు, దేవుని ఆగ్రహానికి గురయినారు. 

2 దినవృత్తాంతములు 9: "13 . గంధవర్గములు అమ్ము వర్తకులును ఇతర వర్తకులును కొని వచ్చు బంగారముగాక సొలొమోనునకు ఏటేట వచ్చు బంగారము వెయ్యిన్ని మూడువందల ముప్పది రెండు మణుగులయెత్తు."

దావీదు కుమారుడు అయినా సొలొమోను దేవుని చేత ఎంతో గొప్పగా దీవించబడ్డాడు. పై వచనం చూస్తే ప్రతి యేడు ఆయనకు కలిగే సంపద మనకు తెలుస్తుంది. అయన సంపద గురించి తెలియాలంటే తొమ్మిదవ అధ్యాయం పూర్తిగా చదువుమని కోరుకుంటున్నాను. అయితే సంపద కారణముగా సొలొమోను తన హృదయమునకు తోచిన ప్రతి కోరికను నెరవేర్చుకున్నాడు. ప్రసంగి గ్రంథంలో అయన రాసినట్లుగా, ఎన్నో అందమయిన భవనాలు, ఉద్యానవనాలు, ద్రాక్ష తోటలు నిర్మించుకున్నాడు. ఎందరో భార్యలను కలిగి ఉండి, నిత్యము కామాతురతతో బ్రతికాడు అని దేవుని వాక్యం చెపుతుంది. 

1 రాజులు 11 : "6. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడచి తన తండ్రియైన దావీదు అనుసరించినట్లు యథార్థహృదయముతో యెహోవాను అనుసరింపలేదు."

ఈ వచనంలో సొలొమోను దేవునికి ఇష్టం లేని జీవితాన్ని కొనసాగించాడు అని తెలుస్తుంది. దేవుడు ఇచ్చిన సమృద్ధిని తన సొంత గొప్ప కోసం వాడుకొని, దేవునికి తన పట్ల ఉన్న ఉద్దేశ్యాలను పూర్తిగా కోల్పోయాడు. భర్యలను అనుసరించి అన్య దేవతలకు ఎన్నో గొప్ప బలి పీఠములు కట్టించాడు. దేవుడు ఎన్నో మార్లు హెచ్చరించిన కూడా పేడ చెవిన పెట్టాడు. కేవలం దావీదు కు దేవుడు ఇచ్చిన వాగ్దానమును బట్టి ఆయనను రాజుగా కొనసాగించాడు. 

ఎజ్రా 1: "6. మరియు వారి చుట్టు నున్న వారందరును స్వేచ్ఛగా అర్పించినవి గాక, వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్తు వులను ఇచ్చి వారికి సహాయము చేసిరి."

బబులోనుకు బానిసలుగా వెళ్లిన ఇశ్రాయేలు వారిని తిరిగి దేవుడు తన మందిర నిర్మాణానికి రప్పించాలనుకున్నప్పుడు, రాజయిన కోరెషు మనసును ప్రేరేపించినాడు. ఆ సందర్భంలో అక్కడ ఉన్న ఇతర ప్రజలకు కూడా ఇశ్రాయేలు ప్రజలకు వెండి, బంగారం, పశువులను, మరియు ఎంతో విలువయిన వస్తువులను ఇవ్వటానికి దేవుడు ప్రేరేపించాడు. అధిక ధనవంతుడయినా సొలొమోను కట్టిన మందిరము వలే లేకపోయినప్పటికీ, బానిసలుగా బ్రతికి, ఏ సంపద లేకుండా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరమును కట్టటం సామాన్యమయిన విషయం కాదు. కానీ దేవుడు వారికి ఇచ్చిన సమృద్ధిని వారు దేవుని చిత్తమునకు ఉపయోగించారు. అందును బట్టి తిరిగి దేవునిలో బలపడ్డారు, తప్పిపోయిన ప్రజలను నిలబెట్టారు. 

అపొస్తలుల కార్యములు 24: "26. తరువాత పౌలువలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి, మాటిమాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను."

అపొస్తలుడయినా పౌలు ధనిక కుటుంబముకు చెందిన వాడని బైబిల్ లో స్పష్టంగా లేకపోయినప్పటికి, అయన  పుట్టుకతోనే రోమా పౌరసత్వం కలిగి ఉన్నాడు. రోమీయుల చేత పాలించబడుతున్న యూదులకు రోమా పౌరసత్వం ఎలా దొరుకుతుంది? వారి కుటుంబం ఎంతో గొప్ప సంపద కలిగి ఉంటె తప్ప సాధ్యం కాదు. అంతే కాకుండా అత్యంత ఖరీదయిన రోమా పట్టణములో రెండు సంవత్సరాలు అద్దె ఇంట్లో ఉండటం అత్యంత పేదవారికి సాధ్యపడేది కాదు. కనుకనే పౌలు నుండి లంచం ఆశించి గవర్నరు అయినా ఫేలిక్సు తన పని వారిని అతనికి పరిచర్య చేయమని పంపేవాడు, మరియు  తనను అదే పనిగా పిలిపించి మాట్లాడే వాడు. కానీ పౌలు తన కుటుంబం ద్వారా తనకు వచ్చిన ధనమును ఎంత మాత్రము, తన నిమిత్తము వాడుకోకుండా, అతను తనను పిలిపించిన ప్రతి సారి, క్రీస్తును గురించి సువార్తను తెలిపాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! దేవుడు నీకు ఇప్పుడు సమృద్ధిని ఇవ్వలేదేమో! కానీ దేవుడు తన వాగ్దానాలు నెరవేరుస్తాడు, ఖచ్చితముగా నీకు సమృద్ధిని ఇస్తాడు. కానీ ఆ సమృద్ధిని నువ్వు ఎలా వాడ బోతున్నావు? ఆ ధనము, ఆ సమృద్ధి నీకు యజమానిగా ఉండబోతోందా? ఒక వేళ దేవుడు నీకు సమృద్ధిని ఇప్పటికే ఇచ్చి ఉంటె, ఏ విధముగా ఆ సమృద్ధిని వాడుతున్నావు? నీ గొప్పల కోసం, డంబికముగా బ్రతకటానికి వాడుతున్నావా? దేవుని పరిచర్య నిమిత్తం, అయన చిత్తానుసారం వాడుతున్నావా? లాజరు, మరియు ధనికుని ఉపమానం గుర్తుందా? పేద వారీగా ఉండమని చెప్పటం ఇక్కడ ఉద్దేశ్యం కాదు. కానీ సమృద్ధిని బట్టి మీ  ఆత్మీయ జీవితం నశించి పోకుండా  చూసుకోండి. గర్వముకు లోనయి, సాతాను వలలో చిక్కుకోకండి, మీ పట్ల దేవుని ఉద్దేశ్యాలు తప్పిపోకండి. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!

4, డిసెంబర్ 2022, ఆదివారం

పక్కవారితో ఉండే ప్రమాదము!


క్రీస్తు విశ్వాసులుగా మారిన తర్వాత, ప్రతి రోజు మన విశ్వాసమును మెరుగు పరుచుకుంటూ ఆత్మీయతలో ఎదుగుతూ ఉండాలి. ఈ క్రమములో మనకు సాతాను ద్వారా ఎన్నో రకముల శోధనలు కలిగే అవకాశం ఉంది. వాటిలో ముఖ్యమయినది, పక్క వారితో స్నేహము. వీరు అన్యులు కావలసిన అవసరం లేదు. వీరు కూడా క్రైస్తవులుగా చెలామణి అవుతుంటారు, కానీ వీరి ఆత్మీయ జీవితం మనలను శోదించేదిగా ఉంటుంది. లోకపు అలవాట్లు పాటిస్తూ, దేవునికి ఇష్టం లేని కార్యములు చేస్తూ మనలను కూడా అటువైపు లాగే వారిగా ఉంటారు. అటువంటి వారితో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ముఖ్యముగా కొత్తగా విశ్వాసములోకి వస్తున్న కుటుంబము లేదా వ్యక్తి  వీరికి దూరముగా ఉండకపోతే  తిరిగి లోకములోకి జారిపోయే అవకాశం ఉంది. 

2 థెస్సలొనీకయులకు 3: "6. సహోదరులారా, మావలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్దనుండి తొలగిపోవలెనని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము."

అపొస్తలుడయినా పౌలు గారు థెస్సలొనీయ సంఘమునకు రాసిన రెండవ పత్రికలో ఈ వచనము ఏమని చెపుతుంది చూడండి. దేవుని వాక్యము చెప్పినట్లు కాకుండా అనగా క్రమముగా జీవించకుండా, ఇష్టాను సారముగా  అనగా లోక రీతిగా ప్రవర్తించే సహోదరుని నుండి దూరముగా వెళ్లిపోవాలని చెపుతుంది. వీరు మాటకు ముందు, వెనుక దేవునికి స్తోత్రం అని చెపుతారు, సంఘములో  గొప్పగా ప్రార్థిస్తారు. కానీ దేవుని వాక్యమును ఎంత మాత్రము పాటించారు. రోడ్డు మీదికి రాగానే చెడ్డ మాటలు మాట్లాడుతారు. మరియు ఇతరుల గురించి అదే పనిగా గుసగుసలాడుతారు. 

ఇటువంటి వారిని బట్టి జాగ్రత్తగా ఉండాలి, లేకపోతె మనం కూడా వారిలాగే మారిపోయి, అదే  క్రైస్తవ విశ్వాసం అనుకుని వెనుకపడే అవకాశం ఉంది. క్రీస్తు విశ్వాసులుగా మనము నూతన సృష్టిగా చేయబడాలి,  నిత్యమూ శరీరనుసారము కాకుండా దేవుని  వాక్యానుసారముగా జీవించే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నములో ఇటువంటి శరీరనుసారముగా జీవించే వారితో సాంగత్యము మనలను కూడా శోధించే అవకాశం ఉంది. తద్వారా మన ఆత్మీయ పరుగులో వెనుక పడిపోతాము. కనుక అట్టి వారిని నుండి దూరముగా తొలగిపొండి. 

1 కొరింథీయులకు 5: "11. ఇప్పుడైతే, సహోదరుడనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్ర హారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్నయెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపనుకూడదని మీకు వ్రాయుచున్నాను."

కొరింథీ సంఘమునకు పౌలు గారు రాసిన మొదటి పత్రికలో, ఇతరుల మీద వ్యామోహం అనగా  సినిమా తారలు లేదా ఇతర స్త్రీ, పురుషుల మీద వ్యామోహం ఉన్నవాడు,  డబ్బు మీద వ్యామోహం కలవాడు, విగ్రహారాధకుడు అనగా దేవుని కంటే ఇతరమయిన  విషయాలను ఎక్కువగా ప్రేమించే వాడు, ఇతరులను దుర్భాషలాడు వాడు, త్రాగుబోతు, ఇతరులను  మోసం చేసేవాడు  సహోదరుడయినను అనగా సాటి విశ్వాసి అయినా కూడా అట్టి వారి నుండి దూరముగా తొలగి పోవటమే కాకుండా, కలిసి భోజనము కూడా  చేయరాదని దేవుని వాక్యము చెపుతుంది. వీరి  ప్రవర్తన మనలను శోధించి మన ఆత్మీయతను  బలహీన పరుస్తుంది. 

మనలో చాల మంది ఎదుటి వారిని మార్చాలి, లేదా వారిని ఉద్దరించాలి అన్న ఆత్రము కలిగి  ఉంటారు. ముఖ్యముగా కొత్త విశ్వాసులు అటువంటి ఆలోచనలకూ దూరముగా ఉండాలి. వారిని గురించి  భారం ఉంటె ప్రార్థించండి, మరియు సంఘ పెద్దలకు చెప్పి ప్రేమ పూర్వకముగా గద్దించండి. వారు క్రీస్తుతో పూర్తిగా అనుసంధానం  చేయబడని వారుగా ఉన్నారు. కనుక వారితో వాదనకు దిగి మీ విశ్వాసమును ప్రశ్నార్థకం చేసుకోకండి. ఇలాంటి వారికి వాక్యము బహుగా తెలిసి ఉన్నట్లయితే, వారు వక్రీకరించే వాక్యమును బట్టి మీరు మోసపోయే అవకాశం ఉంది. కనుక వీరికి దూరముగా వెళ్లిపోవటమే మీ ఆత్మీయతకు క్షేమము. 

1 సమూయేలు: 2: "17. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్య పడుటకు ఆ యౌవనులు కారణమైరి, గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను. 18.  బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్యచేయు చుండెను."

ఇక్కడ ఏలీ కుమారులు దేవునికి ఇష్టం లేని కార్యములు చేస్తూ ఇతర విశ్వాసులను శోదిస్తూ ఉన్నారు మరియు దేవుని ఆగ్రహమునకు కారణముగా మారారు. అదే స్థలములో సమూయేలు ఏలీ యొక్క శిష్యరికములో యాజకులు ధరించే ఏఫోదును ధరించి దేవునికి పరిచర్య చేస్తున్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏమిటీ? సమూయేలు ఏనాడూ కూడా ఏలీ కుమారులను హెచ్చరించాలని చూడలేదు, కనీసం ఏలీ కి ఫిర్యాదు కూడా చేయలేదు. దేవుని  మందిరములో పడుకొనే వాడు. తన కన్న పెద్దవారు, తన గురువు కుమారులు అయినా వారు ఎంత చెడ్డగా ప్రవర్తించిన కూడా సమూయేలు ప్రభావితం కాలేదు. 

కొన్ని సార్లయినా వారు సమూయేలు ను అతి భక్తి పరుడు అని లేదా మరో రకముగా హేళన చేసే ఉంటారు కదా! సమూయేలు వారి మాటలకూ, చేష్టలకు లొంగిపోలేదు, వారి చెడ్డ కార్యాలలో పాలు పంచుకోలేదు. నిత్యమూ దేవుని సన్నిధిలో గడుపుతూ, ఏలీ కి దేవుని పరిచర్యలో సహాయపడుతూ దేవునికి ఇష్టమయిన ప్రవక్తగా ఎదిగాడు. పక్కనున్న నులి వెచ్చని విశ్వాసులను చూసి, వారు బాగానే ఉన్నారు కదా, ఇది చేస్తే ఏమౌతుంది, ఈ ఒక్కసారికి పర్వాలేదు లే అనుకుని వారు చేసే అక్రమ కార్యములు, వాక్య విరుద్దమయిన పనులలో వారితో కూడి విశ్వాసంలో వెనుకపడొద్దు. అదే విధముగా ఎవరో కొందరు సంఘ పెద్దలు వాక్యమునకు విరుద్ధముగా ప్రవర్తిస్తున్నారని, మీ కన్న పాత విశ్వాసులు క్రమము లేకుండా ఉన్నారని వారిని బట్టి ఆ స్థాయికి పడిపోవద్దు. మన మాదిరి మన రక్షకుడయినా క్రీస్తు మాత్రమే! 

మత్తయి 5: "13. మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు."

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! కొండ మీద ప్రసంగంలో యేసయ్య చెప్పిన ఈ మాటలు ఒక్కసారి చూడండి. మనము లోకమునకు ఉప్పుగా ఉన్నాము. ఉప్పు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది! ముఖ్యముగా ప్రతి వంటను రుచిగా మారుస్తుంది. మనం ఎవరికయినా పరిచయం అయితే వారి జీవితంలో మనం రుచిగా మారాలి, కానీ ఇబ్బందిగా ఉండకూడదు (సామెతలు 25:17).  అలాగే ఉప్పు పదార్దములు పాడు కాకుండా కూడా ఉపయోగపడుతుంది. మనలను బట్టి మన పక్కవారు మంచి విషయాలు నేర్చుకోవాలి, కానీ మనలను బట్టి చెడి పోకూడదు, లేదా శోధించ బడకూడదు. ఉప్పు వంటి లక్షణాలు మనకు అలవాడాలంటే, దేవుని వాక్యము పాటించటమే మార్గము. 

యేసయ్య తనను అనుసరించమని చెప్పాడు తప్ప తనను విశ్వసించినా వారిని కాదు. కనుక మన పక్కవారిని బట్టి, వారి సూటి పోటీ, హేళన కరమయిన మాటలను బట్టి దేవుని పై మీకు ఉన్న ప్రేమను  తగ్గించుకోకండి. మిమల్ని హేళన చేసిన  వారికి మీకంటే  ఎక్కువగా వాక్యం  తెలిసి ఉండవచ్చు. కానీ వారి ప్రవర్తన వాక్యాను సారం ఉందా? లేదంటే, వారి నుండి తొలగిపోవటమే మీ ఆత్మీయతకు క్షేమము. దేవుని ప్రేమ మన లో లేని  నాడు  క్రీస్తు విశ్వాసులైన మనలను అన్యులు సైతం అసహ్యించుకొని, క్రీస్తుకు దూరముగా, సువార్తకు వ్యతిరేకముగా మారిపోయే అవకాశం ఉంది. దేవుడు మనలను రక్షించుకున్నది, అయన ప్రేమను మనం లోకానికి  చూపటానికే కానీ,  లోకము పట్ల  అనగా లోక  రీతుల పట్ల మన ప్రేమను  చూపటానికి కాదు. అంతే కాకుండా దేవుడు నిన్ను లెక్క అడిగేది నీ జీవితమును బట్టి కానీ పక్కవారిని బట్టి కాదు కదా!

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము! అంతవరకు దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!