పేజీలు

16, జనవరి 2021, శనివారం

సంఘములో ఐక్యత!

సంఘము అనగా యేసు క్రీస్తును తలగా చేసుకొని అయన దేహముగా అయన రెండవ రాకడ కోసం సిద్దపడే వధువు వంటిది. దేహము / శరీరము తో పోల్చినప్పుడు అందులో భాగములు కూడా ఉంటాయి కదా! అనగా సంఘములో ఉండే అంగములే విశ్వాసులు. ఈ విశ్వాసుల మధ్యలో ఐక్యత, సఖ్యత కలిగి ఉంటేనే సంఘమంత ప్రభువు రాకడకు సిద్ధపడుతున్నట్లు చెప్పుకోవచ్చు. కానీ నేటి సంఘములలో అటువంటి ధోరణి కొనసాగుతుందా? వాటి గురించి ఏకరువు పెట్టేముందు! అసలు సంఘము యొక్క లక్షణములు ఏమిటి? వాక్యానుసారముగా తెలుసుకుందాం.  

అపొస్తలుల కార్యములు 2: "44.  విశ్వసించినవారందరు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచు కొనిరి. 45.  ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి, అందరికిని వారి వారి అక్కరకొలది పంచిపెట్టిరి. 46.  మరియు వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందినవారై 47. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువురక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేర్చుచుండెను."

పై వచనములో ఆదిమ సంఘము, పెంతేకొస్తు దినమున పరిశుద్దాత్మ పొందుకొన్న తర్వాత, ఎలా తాము ప్రభువులో ఎదుగుతూ తమ పరిచర్యను కొనసాగించారో తెలుపుతుంది. విశ్వాసులు అందరు  తమకు కలిగినది అమ్మి అవసరం ఉన్నవారికి పంచి ఇచ్చారు. అంతే కాకుండా వారు ఏక మనస్సు కలిగిన వారై! దేవుణ్ణి స్తుతించారు. తద్వారా ప్రజల యొక్క దయను పొందారు. ఆనందముతోను నిష్కపట హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు అనుదినము రక్షణ అనుభవము పొందిన వారిని వారితో చేర్చు చుండెను. అనగా రోజు కొత్తవారు సంఘములో చేర్చబడుచున్నారు. క్రీస్తు సంఘముగా ప్రజల యొక్క ఆదరణ పొందటం ఎంతో ప్రాముఖ్యమయినదిగా పరిగణించాలి.  మన ప్రవర్తనయందు క్రీస్తు ప్రేమను చూపుతూ మన యొక్క రక్షణను ప్రకటించాలి. అదియే ప్రభువు ప్రేమను ప్రజలకు చాటి అయన వైపు వారిని నడిపిస్తుంది. ఇది జరగాలంటే విశ్వాసులు ఏక మనసు కలిగిన వారై ఉండాలి. దేహము యొక్క ప్రవర్తన తలను బట్టి ఉంటుంది గాని చేతిని బట్టి, ముక్కును బట్టి లేదా కళ్ళను బట్టి ఉండదు. అదే విధముగా సంఘము కూడా ప్రభువును బట్టి అనగా వాక్యాను సారముగా నడుచుకోవాలి గాని ఏ ఒక్క విశ్వాసిని బట్టి, సంఘ పెద్దలను బట్టి కాదు. దేవుడు ప్రతి విశ్వాసిని తన దేహములో అనగా సంఘములో అవయవాలుగా చేసాడు. తన చిత్తము చొప్పున తలాంతులు అనుగ్రహించి తన పరిచర్యను చేయటానికి అనగా తన రాజ్య వ్యాప్తికై వాడుకుంటున్నాడు. తద్వారా సంఘము యొక్క అభివృద్ధిని జరిగిస్తున్నాడు అనగా కొత్తవారిని చేర్చటానికి ఇష్టపడుతున్నాడు. కొత్తగా వచ్చిన విశ్వాసుల పట్ల సంఘ సభ్యుల ప్రవర్తనను విశదీకరిస్తూ పౌలు గారు కొరింథీయులకు లేఖ రాశారు (1 కొరింథీయులకు 8) చదవండి. 

1 కొరింథీయులకు 1: "10.  సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాట లాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సు తోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండ వలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను."

పౌలు గారు ఎంతో భారముతో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ వచనము చూడండి. సహోదరులందరు ఏకభావము కలిగిన వారై ఉండాలని, కక్షలు లేకుండా ఏక మనసు కలిగిన వారై ఉంటు  ప్రభువు రాకడకై సంఘముగా సిద్దపడి ఉండాలని ప్రభువు పేరిట వేడుకుంటున్నాడు. విభిన్న మనస్తత్వాలు, నేపథ్యాలు కలిగిన మనుష్యుల మధ్య ఇది సాధ్యమేనా? క్రీస్తును బట్టి నడచుకొంటే సాధ్యమే. ప్రతి విశ్వాసి తమను తాము తగ్గించుకోవాలి, ఇతరులను ప్రేమించాలి అన్న క్రీస్తు లక్షణాలు కలిగి ఉంటె సాధ్యమే కదా! 

1 పేతురు 3: "8.  తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖ ములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి. 9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి." 

అపొస్తలుడయిన పేతురు గారు కూడా తాను రాసిన మొదటి లేఖలోని పై వచనములు చూడండి. ఏక మనస్సు కలవారై ప్రతి ఒక్కరి సుఖదుఃఖముల యందు పాలు పంచుకొంటూ సహోదర ప్రేమ గలవారును, కరుణాచిత్తులుగా, వినయ మనస్సు కలవారై ఉండుమని ప్రోత్సహిస్తున్నారు. ఆశీర్వాదమునకు వారసులు కావటానికి మనం పిలువబడ్డ వారము కనుక కీడు చేసే వారికి ప్రతిగా కీడు చేయకుండా, దూషించిన వారిని తిరిగి దూషించకుండా దీవించుమని పరిశుద్దాత్మ ప్రేరణతో హెచ్చరిస్తున్నారు. యేసు క్రీస్తు చెప్పినట్లుగా "మిమల్ని దీవించిన వారిని దీవిస్తే మీకేమి ప్రయోజనము, మీకు తిరిగి సహాయము చేసేవారికి సహాయం చేస్తే ఏమిటి లాభము" అన్నట్లుగా ప్రతి ఒక్క విశ్వాసి పై లక్షణములు పాటించినట్లయితే సంఘములో ఐక్యత సాధ్యమే. 

సామెతలు 15: "1. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును."

సామెతల గ్రంథములో సొలొమోను రాసిన ఈ గొప్ప మాటను ఒక్కసారి చూడండి. మృదువైన మాట క్రోధమును చల్లార్చుతుంది కానీ నొప్పించు మాట కోపమును రేపుతుంది. అసలు ఇశ్రాయేలు పన్నెండు గోత్రములు విడిపోవడానికి సొలొమోను కుమారుడవైన రెహబాము మాట్లాడిన పరుషమయిన మాటలే అని లేఖనములు స్పష్టం చేస్తున్నాయి. రాజయిన వెంటనే రెహబాము తండ్రి రాసిన సామెతల గ్రంథమును చదివినా బాగుండేదేమో అనిపిస్తుంది. 

రాజులు 12: "3. ​జనులు అతని పిలువనంపగా యరొబామును ఇశ్రాయేలీయుల సమాజ మంతయును వచ్చి రెహబాముతో నీలాగు మనవి చేసిరి. 4. ​నీ తండ్రి బరువైన కాడిని మామీద ఉంచెను; నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మామీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసినయెడల మేము నీకు సేవచేయుదుము."

ఇశ్రాయేలు వివిధ గోత్రముల నుండి కొంతమంది పెద్దలు రెహబాముతో కొన్ని విన్నపములు చేసుకోవటనికి వచ్చారు. అతని తండ్రి అయినా సొలొమోను వారిని ఎంతగా కష్టపెట్టింది చెప్పుకొని తానయినా ఆ కష్టములు తొలగించుమని వేడుకుంటున్నారు. అయితే అహంకారుడయినా రెహబాము పెద్దల మాటను పేడ చెవిన పెట్టి తనవంటి  యవ్వనస్తులు చెప్పిన సలహాలు విని వారితో పరుషంగా మాట్లాడి ఇశ్రాయేలులో పది గోత్రముల వారు విడిపోయేలాగా ప్రవర్తించాడు. 

రాజులు 12: "16. కాబట్టి ఇశ్రాయేలువారందరును రాజు తమ విన్నపమును వినలేదని తెలిసికొని రాజుకీలాగు ప్రత్యుత్తరమిచ్చిరి దావీదులో మాకు భాగమేది? యెష్షయి కుమారునియందు మాకు స్వాస్థ్యము లేదు; ఇశ్రాయేలువారలారా, మీమీ గుడారములకు పోవుడి; దావీదు సంతతివారలారా, మీ వారిని మీరే చూచుకొనుడి అని చెప్పి ఇశ్రాయేలువారు తమ గుడారములకు వెళ్లిపోయిరి."

పై వచనములో రాజు తమ మాట మన్నించకపొగ పరుషంగా మాట్లాడినందుకు తన ఏలుబడిలో నుండి వెళ్ళి పోయారు ఇశ్రాయేలు వారు. తద్వారా దేవుని వాగ్దానము నెరవేరటమే కాదు ఇశ్రాయేలులో సమైఖ్యత నశించిపోయింది. సంఘములో సైతం పరుషముగా మాట్లాడుతూ, ఇతరులను నొప్పించువారు ఉన్నట్లయితే సంఘములో ఐక్యత ఖచ్చితంగా దెబ్బ తింటుంది. మృదువయిన మాట తీరును అలవరచుకుందాం! ఏక మనసు కలిగి ఉండటానికి ఇష్టపడుదాం కానీ ఏక పక్షముగా ఉండటాన్ని కాదు. ఇక్కడ రెహబాము ప్రజలు లొంగి ఉంటున్నారు కదా అని నిరంకుశంగా ఏక పక్షంగా ఉండాలని చూశాడు కానీ ప్రజలు దాన్ని స్వాగతించ లేదు. సంఘములో ఉండే పెద్దలు సైతం ఇటువంటి మనస్థితిని జయించాలి. క్రీస్తు సంఘములో ఉన్న ప్రతి విశ్వాసిని సంఘము నిర్ణయలలో పాలిభాగస్తులను చెయ్యాలి. వాక్యానుసారముగా నిర్ణయాలు తీసుకోవటానికి ప్రేరణ కలిగిస్తూ ప్రోత్సహించాలి. క్రీస్తు ప్రేమయే మనలను ఐక్యపరచే బలము. ఆ ప్రేమ లోపించిన నాడు భిన్న మనస్తత్వాలు, సొంత అస్థిత్వాలు బయలు దేరుతాయి. క్రీస్తు ప్రేమ రెహబాము వంటి స్వభావమును అంగీకరించదు, సంఘము యొక్క ఐక్యతను కోరుకుంటుంది, ప్రతి సభ్యుడిని పాలిబాగస్తుడిగా చేర్చుకుంటుంది. కన్ను ఒక్కటి ఉంది కదా అని రెండవ కన్నును ఎవరయినా నిర్లక్యం చేస్తారా? చేతి వెళ్ళు పది ఉన్నాయి కదా అని ఒక్క వేలిని నరికేసు కుంటారా? సంఘములో ఉన్న ప్రతి అంగము అనగా ప్రతి విశ్వాసి అంతే ప్రాముఖ్యం ఉన్నవాడు. అది దేవుని చిత్తముగా జరిగింది కనుకనే ఆ విశ్వాసి ఆ సంఘములోకి నడిపింపబడ్డాడు. విశ్వాసులను సరిచేయటం తప్పు కాదు, వారు మారనప్పుడు వదిలేయటం వాక్యానుసారం కానిది కాదు. కానీ అతను నా వాడు, ఇతను ఫలానా అతని వాడు అని గుంపులు కట్టటం కొరింథీయులకు రాసిన పత్రికలల్లో  పౌలు గారు ఏనాడో దుయ్యబట్టారు.  

రాజులు 18: "31.  యెహోవావాక్కు ప్రత్యక్షమైనీ నామము ఇశ్రాయేలగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు రాళ్లను తీసికొని 32. ఆ రాళ్లచేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి, దానిచుట్టు రెండు మానికల గింజలు పట్టునంత లోతుగా కందకమొకటి త్రవ్వించి"

పై వచనంలో బయలు ప్రవక్తలను సవాలు చేసిన దేవుని ప్రవక్త ఏలీయా యెహోవాకు బలి అర్పించుటకు ముందు విడిపోయిన ఇశ్రాయేలు గోత్రములన్నింటిని బట్టి పన్నెండు రాళ్లు తెప్పించి దేవునికి బలి పీఠము కట్టి ఆ గోత్రముల సమైక్యతను, సమానత్వమును చాటుతున్నాడు. అటువంటి ప్రవర్తన  దేవునికి ఎంత ప్రీతికరమవుతుందో కదా! అటువంటి స్వభావము మనం కలిగి ఉన్నామా? వారు మా కులం వారు, వీరు మా వీధి వారు లేక మా ఉరి వారు అని ఇంకా తారతమ్యాలు పాటిస్తున్నామా?  సంఘము అనగా లోక రీతిగా ఒక కులం వారు కలుసుకోవటం కాదు, ఒక ఉరి వారు విహార యాత్రకు రావటం కాదు, లేదా కేవలం స్నేహితులు చేసుకొనే విందు కాదు.  ఒకరి మంచిని ఒకరు మెచ్చుకుంటూ, ప్రతి ఒక్కరు ఇతరుల మంచిని, క్షేమమమును ఆశిస్తూ, క్రీస్తులో ఎదగటం. అనగా అయన ప్రేమను చూపుతూ ఇతరులను ఎదిగించటం. తద్వారా అయన రెండవ రాకడకై మనం సిద్దపడుతూ అయన చిత్తముగా ఇతర ఆత్మలను రక్షించటం. అందరం క్రీస్తు వారలము, దేవుని బిడ్డలము అన్న భావన కలిగిననాడు సంఘములో ఐక్యతకు లోటేమి ఉంటుంది. ఇవన్ని జరిగేలా చూడవలసింది సంఘములో ఉండే పెద్దలు. యధా రాజా తధా ప్రజ లాగా పరిస్థితి మారకుండా ఉండాలంటే యధా క్రీస్తు తధా సంఘముగా పరిస్థితి మారాలి. 

ప్రస్తుతం సంఘములలో పెత్తనాల కోసం పోరు మాములుగా ఉండటం లేదు. దేవుని సంఘములో ఎన్నికలు పెడుతున్నారు. అపొస్తలులు ఏనాడయినా  ఎన్నికలు పెట్టారా? యేసు క్రీస్తు తన వృత్తి చేసిన వారినే శిష్యులుగా ఎంచుకున్నాడా? చీటీలు వేసి తండ్రి నీ చిత్తము బయలు పరచు అని సభ్యులను ఎన్నుకొంటే సరిపోదా? సంఘ పెద్దలు ప్రార్థిస్తే దేవుని చిత్తము బయలు పరచాడా? 

సొలొమోను రాజు దగ్గరికి వచ్చిన ఎంతో ప్రసిద్దమయిన తగువు సంఘటనను ఈ పరిస్థితులకు ఆపాదించాలనిపిస్తుంది. ఇద్దరు తల్లులు ఒక్క బిడ్డతో వచ్చి ఆ బిడ్డ నాదంటే నాదని తగువులాడుకున్నారు. అటువంటి స్థితిలో చాల సంఘాలు కూడా ఉన్నాయి. సంఘము నాదంటే నాది అని సంఘ పెద్దలు తగువులాడుకుంటున్నారు. వారి వారి గొప్ప కోసం సంఘమును ముక్కలు చేయటానికి వెనుకాడటం లేదు. కానీ సొలొమోను బిడ్డను రెండు ముక్కలుగా చేయమన్నప్పుడు నిజమయిన తల్లి బిడ్డను త్యాగం చేయటానికి వెనుకాడలేదు. ఆ తల్లికే బిడ్డ అప్పగింపబడింది కానీ ముక్కలు చేయమన్న తల్లికి కాదు. కనుక సహోదరి, సహోదరుడా సంఘంలో  నీ పరిస్థితి ఎలాంటిదయినా సంఘమును ముక్కలు చేయకు.  దేవుని చిత్తమును కనిపెట్టు ఆయన ప్రేరేపిస్తే అక్కడ నుండి వెళ్ళిపో. ఆయనే నిన్ను తన చిత్తానుసారముగా వాడుకుంటాడు. దేవుణ్ణి నమ్ముకొని, అయన చిత్తము నెరవేర్చి నశించి పోయినవాడు ఎక్కడ వెతికిన దొరకడు. దేవుని సంఘము ఐక్యతను కోరటం కన్న మించిన దేవుని చిత్తము మరోటి ఉంటుందా? దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!

9, జనవరి 2021, శనివారం

దేవుడు కరోనా నుండి కాపాడలేడా?

ఇలాంటి శీర్షిక (టైటిల్) పెట్టింది ఎక్కువ మందిని ఆకర్షించటానికి కాదు గాని ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్యను బట్టి దేవుడి వాక్యమును విపులీకరిస్తే బాగా అర్థం అవ్వటమే కాకుండా సందర్బోచితంగా ఉంటుందని ఈ ప్రయత్నం చేశాను. కరోనా నుండే కాదు మన దేవుడు ఎటువంటి ఆపదనుండి అయినా తనను విశ్వసించిన వారిని కాపాడే సామర్థ్యం కలిగినవాడు. ఆనాడు ఇశ్రాయేలు జనమును ఎన్ని అసాధ్యమయిన కార్యములచే కాపాడాడో బైబిల్ గ్రంథం మనకు తెలుపుతుంది. వాటికి సంబందించిన చారిత్రక అధారాలు మరియు భౌతికమయిన సాక్ష్యాలు ఎన్నో తవ్వకాలలో మరియు పరిశోధనల్లో బయటపడ్డాయి. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో క్రైస్తవులుగా, సజీవమయిన దేవుణ్ణి నమ్ముకున్న వారముగా మనం ఎలా ఉండాలి? అన్నింటికీ మన దేవుడు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు అని ఏమి పట్టించుకోకుండా ప్రవర్తించాలా? అది విశ్వాసముగా పరిగణింపబడుతుందా? ఒక్కసారి వాక్యానుసారముగా తెలుకొనే ప్రయత్నం చేద్దాం. 

సామెతలు 22: "3.  బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు."

నీతి వాక్యాలు ప్రభోదించే సామెతల గ్రంథం ఏమి చెపుతుంది పై వచనం ద్వారా! బుద్దిమంతుడు ప్రమాదము వస్తుందని తెలిసి దాక్కుంటాడు! అంతే కానీ నాకేం కాదు అని ఎదురెళ్లి ప్రమాదంలో పడడు అని చెపుతోంది. అది జ్ఞానం లేని వారు చేసే పని. కరోనా లాంటి ప్రమాదకరమయిన అంటూ వ్యాధి, మందులేని వ్యాధి మన మధ్య ఉందని తెలిసి కూడా, అవసరం ఉన్న లేక పోయిన ఇష్టం వచ్చినట్లు బయట తిరగటం, సామజిక బాధ్యత పాటించక పోవటం దేవునికి ఇష్టమయిన పని, లేదా మన విశ్వాసం చూపించుకోవటం అని మీరు అనుకుంటున్నారా? 

యేసయ్యను సాతాను శోధించు సమయంలో వాడు ఆయనకు లేఖనములు చూయించి, దేవ దూతలు నిన్ను కాపాడుతారు అని ఎంతలా రెచ్చ గొట్టిన కూడా యేసయ్య కొండ మీది నుండి దూకేశాడా? అయన భూమి మీదికి వచ్చిన ఉద్దేశ్యము వేరు అని తెలిసినప్పటికీ, తానూ చనిపోయేది కొండ మీది నుండి దూకి కాదు అని తెలిసి కూడా ఎందుకు దూకలేదు? ప్రభువయినా దేవుణ్ణి నీవు శోధింప వలదని లేఖనములు ఉటంకించి సాతానును ఎదుర్కొన్నాడు.  మరి మన కెందుకు ఇంతటి నిర్లక్ష్య ధోరణి? ఇది విశ్వాసమా? లేక సాతాను వలలో పడిపోవటమా? 

తన శిష్యులను సువార్తకు పంపు సమయంలో యేసయ్య ఎన్ని జాగ్రత్తలు చెప్పాడో ఒక్కసారి మత్తయి సువార్త 10 వ అధ్యాయంలో చదవండి! దేవుడయినా యేసయ్య  శిష్యులకు ఎందుకు  జాగ్రత్తలు చెప్పాడు? తాను వారితో ఉండనందుకు కాదు. నిజానికి అయన కూడా కొన్ని సార్లు  తనకు ప్రమాదం ఉన్నదని తెలిసిన పట్టణములకు వెళ్ళకుండా తన సువార్త పరిచర్యను కొనసాగించాడు (యోహాను 7:1). దేనికి? యేసయ్య భయపడ్డడా? యేసయ్య కంటే మనం ధైర్యవంతులమా?  తన ఘడియ వచ్చే వరకు తండ్రి అయినా దేవుణ్ణి శోధించలేక అయన ఆవిధంగా చేసాడు.  అదే విధంగా శిష్యులకు కూడా జాగ్రత్తలు చెప్పాడు. 

మత్తయి 10: "23. వారు ఈ పట్టణములో మిమ్మును హింసించునప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి; ..... "

పై వచనంలో చూడండి యేసయ్య తన శిష్యులకు ప్రమాదం ఉన్న చోటు నుండి పారిపోండి అని చెపుతున్నాడే గాని ఆక్కడే ఉండి ప్రభువా కాపాడు అని ప్రార్థించమని చెప్పలేదు. మరి మనం చేస్తున్నది ఏమిటి? ప్రమాదానికి ఎదురు వెళ్తున్నాం. జాగ్రత్తలు పాటించకుండా, అవసరం ఉన్న, లేకపోయినా అతి సాధారణంగా తిరిగేస్తున్నాం. ఎందుకు? మన దేవుడు సజీవుడు, ఆయనే మనలను కాపాడుతాడు, అంతేనా? ఇది విశ్వాసమా? లేక దేవుణ్ణి శోధించటమా?

తమ పరిధిలో ఉన్న జాగ్రత్తలు పాంటించి, పరిస్థితులను చక్కబెట్టుకొక దేవుణ్ణి శోధించు వారిని గురించి అపొస్తలుడయినా  పౌలు ఏమంటున్నాడో ఒక్కసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చూద్దాము. 

1 కొరింథీయులకు 10: "9. మనము ప్రభువును శోధింపక యుందము; వారిలో కొందరు శోధించి సర్పములవలన నశించిరి." 

ఇశ్రాయేలు వారు దేవుడు చేసిన అద్భుత కార్యములు మరచిపోయి అదేపనిగా తమకు నచ్చిన ఆహారము కోసము, ఏమాత్రం ఓర్పులేకుండా మోషేతో వాదనలు పెట్టుకున్నారు. దేవుడు చేసిన దీర్ఘకాలిక వాగ్దానాలు విడిచి పెట్టి అప్పటికప్పుడు తృప్తి పరచే కోరికలను జయించలేక దేవుణ్ణి శోధించినారు. కనుకనే దేవుని  ఆగ్రహమునకు గురి అయినారు. దేవుడు మనలను కూడా ఇలాగె నశింపజేస్తాడా? దానిని నేను చెప్పలేను కానీ! ఏదయినా అనుకోనిది జరిగితే ఏమని ప్రార్థిస్తావు? "దేవా నేను ఏ జాగ్రత్తలు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు తిరిగాను, నాకు ఇప్పుడు కరోనా సోకింది, నువ్వే స్వస్థపరచు" అని ప్రార్థిస్తావా? లేక అల్పమయిన కోరికలను, ప్రలోబలను జయిస్తూ, ఓర్పుగా, కలిగినంతలో ఇంట్లో ఉంటూ, దేవుని సన్నిధిలో అనగా ప్రార్థిస్తూ, అయన వాక్యమును ధ్యానిస్తూ అయన నీకు ఇచ్చిన తలాంతులను మెరుగు పరచుకుంటూ  గడుపుతావా! దేవుని సన్నిధికి మించిన ఆనందం ఇంకేదయినా ఉందంటే నీ విశ్వాసమును ఒక్కసారి పరీక్షించుకో. 

ఇన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లోనే ఉంటే మరీ దేవుడు చేసేది ఏమిటి? దీన్నిబట్టి దేవుడు మనలను కాపాడలేడు అని తప్పుగా అర్థం చేసుకోవద్దు. దేవునికి అసాధ్యమయినది ఏది లేదు. అయన జ్ఞానము మనకు అంతుపట్టనిది. ఈ పరిస్థితులు మానవాళి మీదికి అయన ఎందుకు అనుమతించాడో మనకు తెలియదు. కానీ మన ఘడియ కానప్పుడు దేవుడు మనలను ఖచ్చితంగా కాపాడుతాడు. అయన నిన్న, నేడు మరియు రేపు కూడా ఏక రీతిగా ఉండేవాడు. యేసయ్యను కాపాడిన దేవుడే నిన్ను, నన్ను కూడా కాపాడు సామర్థ్యం కలిగినవాడు. 

యోహాను 7: "30. అందుకు వారాయనను పట్టుకొన యత్నముచేసిరి గాని ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టు కొనలేదు."

యోహాను గారు రాసిన సువార్తలో ఏమంటున్నారు చూడండి. పరిసయ్యులు యేసయ్యను పట్టుకొని సంహరించాలనుకున్నప్పుడు అయన ఘడియ ఇంకా రాలేదు కనుక వారు ఆయనను పట్టుకోలేక పోయారు. ఒక్కసారి కాదు, రెండు మూడు సార్లు అదే దేవాలయము దగ్గర వారు ఆయనకు హాని పెట్టాలని చూసారు. కానీ దేవుడు దానిని అనుమతించలేదు. ఒక్కసారి రాళ్లతో కొట్టి చంపాలని చూసారు అయినా దేవుడు దానిని జరగనివ్వలేదు. యేసయ్య చనిపోవలసింది రాళ్ళతో కొట్టబడి కాదు గనుక. 

లూకా 4: "29. ఆగ్రహముతో నిండుకొని, లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్లగొట్టి, ఆయనను తలక్రిందుగా పడద్రోయ వలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటువరకు ఆయనను తీసికొని పోయిరి. 30.  అయితే ఆయన వారి మధ్యనుండి దాటి తన మార్గమున వెళ్లిపోయెను."

లూకా గారు రాసిన సువార్తలో యేసయ్యను జనము పట్టణము నుండి బయటకు తీసుకొచ్చి, కొండ మీది నుండి తల క్రిందులుగా పడేయాలని చూశారు. కానీ అద్భుతంగా అయన జనముల మధ్య నుండి తప్పించుకున్నాడు. ఎలా సాధ్యం అయింది ఇది? అంత మంది జనం మధ్యలో నుండి ఒక మనిషి తప్పించుకోవటం సాధ్యమా? ఇది దేవుని కార్యం కాకపోతే మరీ ఏమిటి? దేవుడు నీ పట్ల,  నా పట్ల అటువంటి ప్రణాళికలు, అంతే ప్రేమ కలిగి ఉన్నాడు. ఐగుప్తు నుండి విడిపించబడిన ప్రతి ఇశ్రాయేలీయుడు కానాను చేరాలన్నది దేవుని ప్రణాళిక, అల్పమయిన కోరికలను జయించలేక నశించపోవటం వారి బుద్దిహీనత. ప్రియా సహోదరి,  సహోదరుడా ప్రమాదం లేదన్న భ్రమలో ఉంటె ప్రమాదం వెళ్ళిపోదు. మన దరికి చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంద్దాం. దేవుడి మీద భారం వేసి, విశ్వాసముతో ముందుకు సాగుదాం. దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!

2, జనవరి 2021, శనివారం

దేవుని వాగ్దానము నెరవేరాలంటే?

ప్రభువు నామములో ప్రియ సహోదరి, సహోదరులయిన మీ అందరికి నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత కాలమంతా తన కృప రెక్కల క్రింద భద్రపరచి మనకు చాలిన దేవుడిగా ఉన్న మన ప్రభువు రక్షకుడు అయినా యేసు క్రీస్తు నామమునకు  కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువు నందు  విశ్వాసులయిన మనకు  నూతన సంవత్సరం అనగానే ఎంతో ఉత్సాహకారమయిన విషయం, వాగ్దానం తీసుకోవటం. అనగా ఆ సంవత్సరానికి దేవుడు మన జీవితములో నెరవేర్చే ప్రణాళికలు, మేలులు మరియు నడిపింపును తెలుసుకొని విశ్వసించి వాటిని నెరవేర్చుమని దేవుణ్ణి వేడుకోవటానికి అవకాశం పొందుకోవటం. దేవుడు ఎల్ల వేళల మన మేలునే కోరుకుంటాడు, నిత్యమూ తన కంటి పాపవలె మనలను కాపాడుతూ, తన ప్రణాళికలను తన యందు విశ్వాసము ఉంచిన  వారి జీవితాలలో నెరవేరుస్తూ ఉంటాడు. కనుక ప్రతి విశ్వాసి వాగ్దనము తీసుకోవటానికయినా డిసెంబర్ 31 న మందిరానికి వెళ్తుంటారు. వాగ్దానము తీసుకున్న తర్వాత వారం రోజులు ఉన్న ఉత్సాహం మళ్ళి వాళ్ళలో కనపడదు. కొందరయితే దాన్ని మరచిపోతారు కూడా. కానీ దేవుని వాగ్దానాల గురించి దైవ గ్రంథమయిన బైబిల్ ఏమి చెపుతోంది! 

సంఖ్యాకాండము 23: "19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా?"

దేవుడు వాగ్దనాలు ఇచ్చి మరచిపోయే వాడు కాదు, మానవుల వలె సందర్భానుసారముగా అబద్దాలు పలికే వాడు కాదు, అయ్యో అనవసరంగా మాట ఇచ్చేసానే అని పశ్చాత్తాప పడేవాడు కాదు. ఒక్కసారి వాగ్దానము ఇస్తే దాన్ని నెరేవేర్చే సామర్థ్యం కలిగిన వాడు. మన దేవుడు సజీవుడు, శూన్యము నుండి సకలమును సృష్టించిన వాడు. కానీ మనకు ఇచ్చిన  వాగ్దానాలు నెరవేరుటలో జాప్యం దేనికి? దేవుడికి మనం అంటే ఇష్టంలేదు కాబోలు అనుకుంటారు చాల మంది. మనలో ఇంకా పాపం ఉంది కనుకనే దేవుడు మన పట్ల తన వాగ్దానాలు నెరవేర్చటం లేదు అనుకుంటారు మరి కొందరు. దేవుడు మనకు తండ్రి అని నమ్మిన నాడు, ఏ తండ్రి కూడా బిడ్డలలో ఉన్న లోపములను బట్టి వారికి మేలులు చేయటం అపి వేయడు. కానీ  వాగ్దానాలు నెరవేర్చటంలో పరలోకపు  తండ్రి (దేవుడు) విధానం లోకపరమయిన తండ్రులకు భిన్నము.  తన పిల్లలయిన మనము ఎల్ల వేళల పవిత్రులుగా జీవించాలని ఆశపడుతున్నాడు. మానవ శరీరంలో ఉన్న మనకు పాపం లేకుండా జీవించటం అసాధ్యమే అయిన బుద్ది పూర్వకమయిన  పాపములకు దూరంగా ఉండాలి. దేవుని వాక్యానుసారముగా జీవించటం తప్పనిసరిగా ఉండాలి. అనగా  పరిశుద్దాత్మ నడిపింపునకు లొంగి నడుచుకోవాలి.  

రోమీయులకు  8: "28. దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము."

రోమీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడయినా పౌలు గారు పై వచనము ద్వారా ఏమి చెపుతున్నారు ఒక్కసారి అర్థం చేసుకుందాం! దేవుణ్ణి ప్రేమించు వారికీ అనగా అయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, అనగా దేవుని చిత్తను సారముగా నడుచుకొను  వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి. దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏమిటో వాక్యాను సారముగా తెలుసుకుందాం. 

1 యోహాను 5: "3. మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే. దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు." 

యోహాను గారు తానూ రాసిన మొదటి పత్రికలో ప్రేమ గురించి చాల వివరంగా రాశారు. పై వచనములో అయన స్పష్టం చేస్తున్న విషయం ఏమిటి? దేవుని ఆజ్ఞలు పాటించటమే దేవుణ్ణి ప్రేమించటం. అనగా వాక్యాను సారముగా నడుచుకుంటూ అయన చిత్తమును కనిపెడుతూ ఉండటమే దేవుణ్ణి ప్రేమించటం. అలాగా దేవుణ్ణి ప్రేమించేవారికి అయన ఆజ్ఞలు కష్టతరం కాదు అని చెపుతున్నారు. ఎందుకంటే అయన మనకు ఇచ్చే విశ్వాసము ద్వారా లోకమును జయిస్తాము అనగా బుద్ది పూర్వకమయిన పాపమును జయిస్తాము. తద్వారా పవిత్రులుగా ఉండటానికి ప్రయత్నిస్తాము, అప్పుడు దేవుడు తన చిత్తానుసారముగా మన పట్ల తన వాగ్దానాలు నెరవేరుస్తాడు. 

రెండవదిగా కొంత మంది విశ్వాసులు దేవుని వాగ్దానాలు పక్కన పెట్టి తమ జ్ఞానమును బట్టి కార్యములు చేయాలనీ చూస్తూ ఉంటారు. అటువంటి వారిని గురించి  దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? క్రింది వచనం చూడండి. 

సామెతలు 3: "5. నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము 6.  నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును."

మన సొంత జ్ఞానమును ఆధారము చేసుకోక, మన పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మకముంచాలి. మన ప్రవర్తన అంతటి యందు అయన అధికారమునకు ఒప్పుకొన్నప్పుడు దేవుడు మన త్రోవలను సరాళము చేస్తాడు, అనగా మన వాగ్దానాలు నెరవేరటానికి దారులు వేస్తాడు. మన ప్రవర్తన యందు అయన అధికారమును ఒప్పుకోవటం అంటే? మన తెలివిని ఉపయోగించి సొంత నిర్ణయాలు మానుకోవటం, పూర్తిగా దేవుని జ్ఞానమును బట్టి నడుచుకోవటం. దేవుని జ్ఞానం ఎలా వస్తుంది? ప్రార్థించటం ద్వారానే అని దేవుని వాక్యం సెలవిస్తోంది. మరియు దేవుని యందు భయము కలిగి ఉండటమే జ్ఞానము. విశ్వాసులకు తండ్రి అయినా అబ్రాహాము గారి జీవితంలో దేవుడు సంతానమును వాగ్దానము చేసినప్పుడు ఏమి జరిగింది తెలుసు కదా?

అయన తన భార్య అయినా శారా మాటలకు తలోగ్గి తన దాసి ద్వారా కుమారుణ్ణి కన్నాడు. కానీ దేవుడు ఆ సంతానమును ఒప్పుకోలేదు. దేవుడు శారాకు సంతానం వాగ్దానము చేస్తే ఆమె తన వయసును దృష్టిలో ఉంచుకొని భర్తను దాసీ ద్వారా కుమారుణ్ణి కనుమని ప్రోత్సహించింది. ఇదంతా కూడా మన సొంత జ్ఞానమును బట్టి తీసుకొనే నిర్ణయాలు మరియు మన ప్రవర్తనయందు దేవుని అధికారమును ఒప్పుకోకపోవటం వలన వచ్చే పరిణామాలు. ఇక్కడ అబ్రాహాము గారు భార్య ప్రోత్సాహంతో తన శక్తి సామర్థ్యాలను నమ్ముకున్నాడు. ఆమె జ్ఞానమును బట్టి నిర్ణయం తీసుకున్నాడు. కనుకనే దేవుడి అమోదము పొందని సంతానమును పొందాడు. కానీ అబ్రాహాము ఎన్నడూ కూడా తన విశ్వాసమును కోల్పోలేదని బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. మన విశ్వాసం ఎంత గొప్పది అయినప్పటికీ ఎదుటి వారి మాటలను బట్టి మన శక్తి సామర్థ్యాలను ఉపయోగించాలని చూస్తుంటాము. ఆ అవసరం వచ్చినప్పుడు దేవుడే మనలను ప్రేరేపిస్తాడు, మనలను నడిపిస్తాడు (కీర్తనలు 32:8)

రోమీయులకు 4: "19. మరియు అతడు విశ్వాసమునందు బల హీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని, 20.  అవి శ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక 21. దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను."

రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు రాసిన వచనం చూడండి! అబ్రాహాముకు  నూరేండ్ల వయసు వచ్చి మరియు భార్య శారా గర్భము పూర్తిగా శక్తి హీనమయిన తర్వాత కూడా అయన విశ్వాసం కోల్పోలేదు. ఇక్కడ అబ్రాహాము తన సొంత జ్ఞానమును వదిలేసాడు, తన ప్రవర్తన అంతటియందు దేవుని అధికారమును ఒప్పుకున్నాడు కనుకనే వారి సామర్థ్యమును బట్టి కాక తన శక్తి ద్వారా సంతానము దయచేసి దేవుడు తన వాగ్దానమును నెరవేర్చాడు. 

మూడవదిగా, దేవుని వాగ్దానాలన్నియు షరతులతో కూడుకున్నవి. అనగా ప్రతి వాగ్దానము నెరవేరటానికి ముందస్తుగా పాటించవలసిన ఆజ్ఞలు ఉంటాయి. దేవుడు ప్రతి వాగ్దానమునకు ముందు వెనుక తన ప్రజలు పాటించవలసిన ఆజ్ఞలు తెలియజేసాడు. కనుక మనకు వచ్చిన వాగ్దనము యొక్క అధ్యాయమును జాగ్రత్తగా ధ్యానించి, దేవుడు ఎవరితో, ఏ సందర్భంలో ఆ వాగ్దానమును ఇచ్చాడు మరియు వారికి ఇవ్వబడిన ఆజ్ఞలు ఏమిటి? వాటిని వారు ఎలా పాటించారు తెలుసుకోవాలి. ఉదాహరణకు క్రింది వచనము చూడండి!

ద్వితీయోపదేశ కాండము 28: "8.  నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నము లన్నిటి లోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును."

ఈ వాగ్దనము తీసుకోని సంతోషపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి! కానీ అదే అధ్యాయం మొదటి వచనములో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాటలు చూడండి!

ద్వితీయోపదేశ కాండము 28: "1. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినినేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనినయెడల నీ దేవు డైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును."

దేవుడు వారికీ ఇచ్చే ఆజ్ఞలు పాటిస్తే ఈ వాగ్దనాలు నెరవేరుస్తాను అంటున్నాడు. పైన చెప్పుకున్నట్లుగా అయన ఇచ్చే ఆజ్ఞలు కష్టతరమయినవేమి కావు. కేవలం మనలను తన స్వరూపంలోకి, అనగా మన రక్షకుడయినా యేసు క్రీస్తు ప్రేమలోకి మార్చటానికే అని గుర్తెరిగిన వారుగా ఉండాలి. ఆయనే తన ఆజ్ఞలు మనకు జ్ఞాపకం చేస్తూ, తన పరిశుద్దాత్మ శక్తితో నడిపిస్తుంటాడు.ఇవన్నీ పాటించి దేవునికి మన పట్ల ఉన్న ప్రణాళికలు నెరవేర్చుకుందాం. దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!