పేజీలు

30, ఏప్రిల్ 2022, శనివారం

ప్రసంగం చెయ్యాలనుకుంటున్నావా?

 

బైబిల్ చదవటం మొదలు పెట్టిన తర్వాత ప్రతి విశ్వాసి ఆశపడే విషయం ఏమిటంటే, తనకు తెలిసిన మరియు అర్థం అయిన దేవుని మాటలు తోటి వారితో పంచుకోవాలని. తద్వారా వారికి ఆదరణ కలిగించటంతో పాటు వారి విశ్వాసమును బలపరచటం మరియు దేవుడు తమతో మాట్లాడిన పలుకులు సాక్ష్యముగా పంచుకోవటం జరుగుతుంది. పరిశుద్దాత్మ దేవుడు సంఘము క్షేమాభివృద్ధి దృష్ట్యా మనకు కొన్ని ఆత్మీయ వరములు అనుగ్రహిస్తాడు! ఇదివరకు మనం తెలుసుకున్నాం. వాటిలో ఒక్కటి, బోధ చేయటం లేదా ప్రసంగం చేయటం. అయితే దేవుని వాక్యములో చెప్పబడిన కొన్ని హెచ్చరికలు గమనించి బోధచేయటం మంచిది.

యాకోబు 3: "1. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి."

ఈ వచనములో యాకోబు గారు ఏమంటున్నారు? బోధకులయినా వారికి తీర్పు కఠినముగా ఉంటుందని తెలుపబడింది.  ఎందుకు? పరిశుద్దాత్మ నడిపింపు లేకుండా, దేవుని పిలుపు లేకుండా బోధించినట్లయితే కేవలం తమకున్న లోక జ్ఞానమును బట్టి దేవుని మాటలు బోధించిన వారుగా మారిపోతారు. తద్వారా సాటి సహోదరులకు లేదా సంఘమునకు వాక్యమునకు విరుద్ధముగా బోధించి వారిని నశింపచేసిన వారు అవుతారు కనుక. 

సహోదరి, సహోదరుడా! యేసయ్య ప్రేమ నీలో నిజంగా ఉందా? నీ జీవితం అయన ఆశించినట్లుగా కొనసాగుతుందా? ప్రభువు అనుమతి నీకు ఉందా? లేక సంఘములో పెద్దలు ప్రోత్సహిస్తే నాలుగు మాటలు ఇంటర్నెట్ లో చూసి, వ్యాఖ్యానాలు చదివి మాత్రమే మాట్లాడుతున్నావా? ఇంటర్నెట్ లో సంచికలు చూడటం, వ్యాఖ్యానాలు చదవటం తప్పు అని చెప్పటం లేదు! కానీ నిశ్చయముగా వాటిని నమ్ముతున్నావా? దాని ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? కనీసం జీవించటానికి ప్రయత్నిస్తున్నావా? నువ్వు చెప్పే విషయం మీద  పూర్తీ అవగాహనా పొందుకున్నావా? 

1 తిమోతి 1: "7. నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపక పోయినను ధర్మశాస్త్రోపదేశకులై యుండగోరి విష్‌ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి."

పౌలు గారు తిమోతి తో ఏమంటున్నారు గమనించండి! కొంతమంది దేవుని వాక్యము మీద పూర్తి అవగాహనా లేకుండా, వాటిని పూర్తిగా నమ్మక పోయినను బోధకులుగా మారిపోతున్నారు. తమ జ్ఞానము చొప్పున లోకపరమయిన ఉదాహారణలతో,  ఛలోక్తులతో ప్రసంగం చేస్తూ ఉంటారు! ప్రసంగంలో ఎన్ని లోకపరమయిన ఉదాహరణలు ఉంటె అంతగా ఆ బోధకుడు సిద్దపడి రాలేదు అని అర్థం! 

బైబిల్ బోధించటానికి బైబిల్ లో లేని ఉదాహరణలు, సంఘటనలు దేనికి? ఏదయినా విషయాన్నీ విశదీకరించటానికి ఉపయెగించటం తప్పు కాదు, కానీ సినిమాల ఉదాహరణలు సైతం ప్రసంగంలో ప్రస్తావించటం, విశ్వాసులకు ఎటువంటి సందేశాలు అందిస్తుంది? పాస్టర్ గారు సినిమా ఉదాహరణ చెప్పారు కాబట్టి, సినిమాలు చూడటం తప్పు కాదన్నమాట అని సంఘం అనుకొంటే తప్పు ఎవరిదీ? ఆ బోధకునికి తీర్పు ఎలా ఉంటుంది?

యేసు క్రీస్తు ప్రభువు "పరిసయ్యులు గ్రుడ్డి వారిగా ఉన్నారు, మరియు వారు ఇతరులకు త్రోవ చూపుతూ వారిని కూడా గ్రుడ్డి తనములో నడుపుతున్నారు, ఇద్దరు కలిసి గుంటలో పడిపోతారని" అన్నాడు కదా (మత్తయి 15: 14). సొంత జ్ఞానమును బట్టి బోధించు వారు, సంఘమునకు ఆనుకూలంగా బోధించువారు అంటువంటి వారె. ఇటువంటి బోధ వలన సంఘములో  ఎంటువంటి అభివృద్ధి ఉండబోదు. ప్రతి ఆదివారం మందిరమునకు వస్తున్నాం, చాల భక్తిపరులుగా ఉన్నాం అన్న భ్రమలో విశ్వాసులను ఉంచుతున్నారు. 

దేవుని ప్రేమతో పాటు, అయన రోషమును కూడా బోధించాలి. పవిత్రత యొక్క ప్రాముఖ్యత, రక్షణ యొక్క విశిష్టత వివరించాలి మరియు మారు మనసు యొక్క ఆవిశ్యకతపై అవగాహనా పెంచాలి. లేదంటే సంఘము హితబోధను పట్టించుకోకుండా, కేవలం తమ చెవులకు ఇంపయినా విషయాలను మాత్రమే విని దేవునికి ఇష్టంలేని కార్యములలో ఇంకా కొనసాగే అవకాశం ఉంది (2  తిమోతికి 4:3) . 

యోహాను 3: "9. అందుకు నీకొదేము ఈ సంగతులేలాగు సాధ్యములని ఆయనను అడుగగా 10.  యేసు ఇట్లనెనునీవు ఇశ్రాయేలుకు బోధకుడవై యుండి వీటిని ఎరుగవా?11.  మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచినదానికే సాక్ష్యమిచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను."

"తిరిగి జన్మించాలి" అన్న యేసయ్య మాటలను నీకొదేము అర్థం చేసుకోలేని సందర్భంలో  నీకొదేముతో  యేసయ్య  అన్న మాటలు ఈ వచనంలో చూడవచ్చు. బోధకుడైన నీకొదేము ఈ సంగతులన్నియు ఎరిగి ఉండాలి. ఎందుకంటే పరిశుద్దాత్మ ఈ సంగతులను ఏనాడో పాత నిబంధన గ్రంథంలో రాయించాడు  (యెహెజ్కేలు 11:19 మరియు యిర్మీయా 32:39-40). 

ఏది ఏమయినప్పటికీ  "మారుమనసు" మరియు "తిరిగి జన్మించటం" అన్న విషయాలు  ఇశ్రాయేలు వారికి యోహాను మరియు యేసయ్య వచ్చే వరకు తెలియలేదు. ఆనాటి ప్రసంగికుల నిర్లక్ష్యమో లేదా సంఘమును ఇబ్బంది పెడితే దశమ భాగాలు రావేమో అని భయపడటమో కానీ నిజమయిన దేవుని పలుకులు వారికి బోధింపబడలేదు. కనుక మన ప్రసంగం సంఘం బాధపడుతుందేమో అని కాకుండా దేవుడు తన విశ్వాసులను ఎలా కోరుకుంటున్నాడు అన్న విషయాలు ఖఛ్చితముగా సంఘమునకు వెల్లడి చేయబడాలి.

బోధ అనేది తల్లి, తండ్రుల నుండి సంక్రమించే ఆస్థి కాదు. దేవుని పిలుపు! ఎటువంటి అవగాహనా లేని చిన్న చిన్న పిల్లలతో కంఠస్థం చేయించి ప్రసంగాలు చేయిస్తున్నారు. ఏ అనుభవ జ్ఞానము లేని తమ పిల్లల చేత బలవంతంగా, సంఘము ముందు నిలబెట్టి, దేవుని వాక్యాలు వల్లే వేయిస్తున్నారు. ఆ సంఘము ఎటు వైపు వెళుతుంది? ప్రసంగం అంటే నాలుగు బైబిల్ వాక్యాలు గుర్తుంచుకొని  అర్థం చెప్పటం కాదు! దేవుని  మాటలు సంఘమునకు తెలపటం! విశ్వాసుల ఆత్మలకు ఆత్మీయ ఆహారం అందించటం. అంటువంటి భాద్యత నిర్వహించటానికి దేవుడు ఎవరిని పడితే వారిని ఎన్నుకుంటాడా? 

ఆనాడు దేవుడు హోషేయ ప్రవక్తను వేశ్యను వివాహం చేసుకొమ్మని ఎందుకు చెప్పాడు, తన ప్రజలు తన నుండి విడిపోయి ఇతర దేవతలతో వ్యభిచారం చేస్తున్నారు, దానిని బట్టి ఆ తండ్రి ఎంతటి భాధను అనుభవిస్తున్నాడో ఆ ప్రవక్తకు అర్థం కావటానికి, తద్వారా తన ప్రజలకు ఆ సంగతులు వివరించి వారిని తిరిగి తన దారికి చేర్చటానికి.  అటువంటి అనుభవాలు దేవుడు నీకు ఇచ్చాడా? నిజమయిన పోరాటలు చేసి, దేవుని కృపను పొంది విశ్వాసంలో బలపడ్డావా? నీ అనుభవ పూర్వకంగా బోధలు చేస్తున్నావా? కేవలం అర్థాలు తెలుసుకొని చెపుతున్నావా? పోరాటం లేని బోధకుడు కేవలం సంఘమును కట్టగలడు కానీ  ఆత్మలను దేవుని వైపు నడపలేడు. 

యిర్మీయా 15: "19. కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చెనునీవు నాతట్టు తిరిగినయెడల నీవు నా సన్నిధిని నిలుచునట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో యేవి ఘనములో నీవు గురుతుపట్టినయెడల నీవు నా నోటివలె ఉందువు; వారు నీతట్టునకు తిరుగవలెను గాని నీవు వారి తట్టునకు తిరుగకూడదు"

ఈ వచనములలో ప్రవక్త అయినా యిర్మీయా తనకు వస్తున్న శ్రమలను బట్టి తనను తానూ నిందించుకొని, నిరాశను వెలిబుచ్చినప్పుడు, దేవుడు తనతో అంటున్న మాటలు చూడండి! నిరాశను వదిలి, శ్రమలను బట్టి దుఃఖపడక ఉంటె తన సన్నిధికి తిరిగి రప్పిస్తానని అంటున్నాడు. ఏవి నీచములో, ఏవి ఘనములో ఎరిగి అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తే తన నోటివలె ఉంటాడని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే ఇతరులు నీలాగా మారాలి కానీ నీవు వారి వలె మారకూడదు. అనగా లోకమంతా చెడు వైపు నడచిన నీవు మాత్రం వారికి ఆదర్శంగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు.

అంటువంటి ప్రవర్తన నీకు అలవడిందా? మంచి, చేడు  గుర్తించి లోకములో ప్రత్యేకించినట్లుగా ఉంటున్నావా? లేక నూటికి తొంబై తొమ్మిది మంది అలాగే ఉన్నారు నేను కూడా అలాగే ఉండాలి కాబోలు అని అలాగే జీవిస్తూ, ప్రసంగంలో కూడా అటువంటి ఉదాహరణలు, అంటువంటి ఛలోక్తులు కలుపుతున్నావా? సహోదరి సహోదరుడా! దేవుని నోటి వలె ఉండటం ఎంతో ధన్యమయిన విషయం. దానిని చులకనగా తీసుకోకండి. మన అర్హతను పరిశీలించండి, దేవుని పిలుపు కై కనిపెట్టండి. 

1 కొరింథీయులకు 2: "12. దేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము. 13. మనుష్యజ్ఞానము నేర్పుమాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము."

పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పై వచనం చూడండి! దేవుని ఆత్మను పొందుకొని బోధించాము కానీ లౌకికాత్మ ద్వారా కాదు అని చెపుతున్నారు. లౌకికాత్మ అనగా లోక ప్రసిద్దమయిన వాటిని ప్రవచించటం. అంటువంటివి కాక దేవుని ఆత్మను పొందుకొని బోధించటం చెయ్యాలి. మనుష్యుల జ్ఞానము చొప్పున నేర్పయినా మాటలు కాకుండా, ఆత్మ సంభందమయిన సంగతులు ఆత్మ ద్వారానే బోధించాలి అలాగే ఆత్మతోనే సరిచూడాలి.

ప్రియమయిన సహోదరి, సహోదరులారా! బైబిల్ లో లేని పిట్ట కథలు, ఛలోక్తులు బోధించటం ఎంత మాత్రం సంఘము క్షేమమును జరిగించదు. తద్వారా విశ్వాసులకు ఆత్మీయ ఆహారం దొరకదు, వారు బలహినపడి నశించినచో తప్పు ఎవరిది?  దేవుని మీద ఆధారపడితే ఆశ్చర్యకరమయిన సంగతులు ఆయనే మనకు బయలు పరుస్తాడు (కీర్తనలు 119:18). కనుక  ప్రార్థించండి! దేవుని పలుకులు తెలుసుకోండి! ప్రసంగం ఆ విధముగా చేయండి.  

దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాముఅంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాకఆమెన్!!

25, ఏప్రిల్ 2022, సోమవారం

పాపం చేతిలో ఓడి విసిగి పోతున్నావా?

 

క్రీస్తు మన పాపముల నిమిత్తం సిలువలో తన ప్రాణం పెట్టి పునరుత్థానుడిగా మరణం గెలిచినట్లు గుడ్ ఫ్రైడే సందేశములలో ధ్యానించుకున్నాం కదా. "ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు నశించిపోకుండా రక్షించబడులాగున దేవుడు ఆయనను  అనుగ్రహించాడు" (యోహాను 3:16) అని దేవుని వాక్యం చెపుతోంది. అంటే యేసు క్రీస్తును నమ్మితే, అయన ఏవిధంగా పాపం లేకుండా బ్రతికాడో, ఆ సిలువలో మరణించి తిరిగి మూడవ దినం మరణం జయించి లేవటం ద్వారా అయన చెల్లించిన పాప పరిహారం మనకు వర్తింపచేసి ఆయనలోని నీతిని దేవుడు మనకు ఆపాదిస్తాడు. 

ఇది జరగాలంటే మనం కూడా పాపమును విడచి యేసు క్రీస్తువలె పవిత్రంగా జీవించటం మొదలు పెట్టాలి అనగా మారు మనసు పొందుకుని, ఇదివరకు చేసిన పాపములు దేవుని యెదుట ఒప్పుకొని, నూతనముగా జన్మించి, మన పాపములకు కారణం అవుతున్న సమస్త శరీర క్రియలకు ముగింపు పలకాలి. ఈ  పాపమూ మూలముగా క్రీస్తు మనకు బోధించిన, దేవునికి ఇష్టమయిన కార్యములు పాటించలేని వారిగా ఉండిపోతున్నాము. అసలు పాపం అంటే ఏమిటి? దాని నుండి బయటకు రావాలంటే ఏమి చేయాలి? వీటికి సమాధానాలు తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. 

యాకోబు 4: "17. కాబట్టి మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును."

1 యోహాను 3: "4. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము." 

ఈ వచనముల ద్వారా పాపము యొక్క నిర్వచనములు మనకు అవగతం అవుతున్నాయి. పాపమూ రెండు రకములు, మొదటిది  చేయక పోవటం (Omission), ఏమి చేయక పోవటం? చేయగలిగినా మంచిని చేయకపోవటం పాపం.  రెండవది చేయటము (Commision), ఏమి చేయటము? చేయకూడని దానిని చేయటం పాపం. దీన్ని బట్టి  దేవుడు చెప్పిన మంచిని చేయక పోవటం పాపం, అలాగే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు మీరటం కూడా పాపం అని తెలుస్తోంది. 

యోబు 1: "5. వారి వారి విందు దినములు పూర్తికాగా యోబు, తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొకని నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము ఆలాగున చేయుచుండెను."

దేవుని చేత సాతాను ముందు గొప్ప సాక్ష్యము పొందిన యోబు తన పిల్లలు యెక్కడ పాపమూ చేసి వారి హృదయములలో దేవుని దూషించిరేమోనని, బలులు అర్పిస్తున్నాడు. బైబిల్ చరిత్రకారుల ప్రకారం బైబిల్ లో రాయబడిన మొదటి గ్రంథం యోబు. అంటే అప్పటికి దేవుడు పది ఆజ్ఞలు ఇంకా వెల్లడి చెయ్యలేదు. కానీ యోబు తన పూర్వికులనుండి దహన బలులను ఆచరించటం తెలుసుకొని,  తన పిల్లల పాప పరిహారార్థం దేవునికి బలులను అర్పించటం చేసాడు. ఇదంతా యోబుకు దేవుడంటే ఉన్న ప్రేమ, భయ భక్తులను బట్టి చేశాడు. 

తద్వారా స్వస్థత కన్న నివారణ మేలు అన్న నానుడిని పాటిస్తూ తన పిల్లలను  దేవుని దృష్టికి పాపం లేని వారిగా మారుస్తున్నాడు. ఎటువంటి ఆజ్ఞలు లేకపోయినా అనగా ధర్మశాస్త్రము తెలియక పోయిన కేవలం మనసాక్షిని బట్టి దేవునికి ఇష్టం లేని పాపమును  తానూ, తన కుటుంబము చేయకుండా యోబు దేవుని యందు గొప్ప భయ భక్తుతులను చూపించాడు. ఆ విధంగా తనతో పాటు తన వారిని శుద్దీకరించుట ద్వారా దేవునికి  ఇష్టమయిన వాడిగా సాక్ష్యం పొందాడు. 

2 కొరింథీయులకు 13: "5. మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచు కొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి; మీరు భ్రష్టులు కానియెడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గూర్చి మీరే యెరుగరా?"

పౌలు గారు కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో ఏమంటున్నాడు! మనలను మనం ఆత్మ పరిశీలన (Introspection) చేయుట ద్వారా, మనలో ఎటువంటి పాపం రాజ్యమేలుతోంది, ఏ క్రియలు మనలను చిక్కులు పెట్టి దేవుని కృపకు, అయన మహిమకు మనలను దూరం చేస్తున్నాయి గుర్తించాలి. మనం నిజంగా మారు మనసు పొందిన వారమయితే మనలో పాపం మన కళ్లముందు కనబడుతుంది. ఒక వేళ వాటిని సమర్థిస్తూ కారణాలు కనపడితే మనలో క్రీస్తు ప్రేమ లేనట్టుగానే భావించాలి. కనుక మనం ఎన్ని సార్లు కింద పడిపోతే అన్ని సార్లు ఎలాగయితే పైకి లేస్తామో, వంద సార్లు పాపం చేస్తే వంద సార్లు దేవుని దగ్గరకు వెళ్ళి క్షమాపణ అడగాలి.  

పాపములు ఒప్పుకోవటంలో కారణాలు,  సంజాయిషీలు ఉండరాదు.  తద్వారా మన స్థితిని మనం నిత్యం గుర్తించిన వారిగా ఉంటాము. నిత్యము పాపములు ఒప్పోకోవటం అంటే మనలను మనం ఖండించుకుంటూ బ్రతకటం కాదు కానీ, దేవుని కృప ద్వారా నిత్యమూ మనం క్రీస్తు లో నూతన పరచబడుతున్నాము అని ఆనందించాలి. క్రీస్తు రక్తములో క్షమించబడలేని పాపమూ లేదు అని ఎరిగి, మన పాపములు క్షమించబడ్డాయి అని విశ్వసించాలి. పాపముల ఒప్పుకోలు ద్వారా పరిశుద్దాత్మను పొందుకొని ఆ పరిశుద్దాత్మ నడిపింపు ద్వారా ఆ క్రియలను చేయకుండా దేవుని శక్తిని పొందుకుంటాము (అపొస్తలుల కార్యములు 2:38).  

మనం పాపముకు లొంగిపోకుండా ఉండాలంటే ఏమి చేయాలి?  మొదటగా, దేవుడి యెడల భయభక్తులు కలిగి ఉండాలి, అప్పుడు దేవుడు మనకు తన నియమ నిబంధనలు గుర్తు చేస్తూ ఉంటాడు (కీర్తనలు 25:12).  మరియు ఆ పాపమును గుర్తించటానికి కావలసిన జ్ఞానమును,  జయించటానికి అవసరమయిన శక్తిని ఆయనే మనకు అనుగ్రహిస్తాడు. యాకోబు కుమారుడు యోసేపు ఆనాడు పాపం చేయక పోవటానికి గల కారణం, దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండటమే.  కనుకనే  యోసేపు  దేవునికి విరోధముగా పాపము ఎలా చేయగలను అని పాపం చేయమన్న పోతీఫరు భార్యను నిలదీశాడు (ఆదికాండము 39:9)

రెండవదిగా, పాపమూ నుండి పారిపోవటం. యోసేపు తన వస్త్రమును కూడా వదిలి పెట్టి పోతీఫర్ భార్య నుండి దూరంగా పారిపోయాడు (ఆదికాండము 39:12) రాసి ఉంది. కానీ దావీదు మాత్రం స్నానం చేస్తు కంటపడిన బత్షెబ గురించి అరా తీసాడు. పొరపాటున చూసాను అని వదిలిపెట్టకుండా, ఎవరు ఏమిటి అని తెలుసుకొని ఆమెను పిలువనంపాడు (2 సమూయేలు 11:1-3). తద్వారా తన కోరికను జయించలేక, పాపములో పడిపోయాడు.  

2 తిమోతికి 2: "22.  నీవు యావనేచ్ఛలనుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము." 

పౌలు గారు తిమోతికి రాసిన రెండవ పత్రికలో నీ యవ్వన కోరికలనుండి పారిపోమ్మని హెచ్చరిస్తున్నాడు. అపవిత్రపు  దృశ్యములు, నేత్రాశలకు అలవాటుపడిన ప్రియా సహోదరి, సహోదరుడా! సమయం మించిపోలేదు. నీకు కలిగే కోరికలనుండి దూరంగా పారిపో! ఆ సెల్ ఫోన్ స్విచ్ అప్ చేయు, ఆ లాప్టాప్ మూసేసి బయటకు వెళ్ళిపో! నువ్వు టీవీ లో చూసే ఆ ఆకతాయి కార్యక్రమం యేసయ్య నీతో ఉండి చూడగలడా? చూడలేడు అనిపిస్తే ఆ ఛానల్ మార్చెయ్! "ఎల్ల వేళలా మంచి ఆత్మీయ స్థితిలో ఉన్న వారితో ప్రార్థిస్తూ, దేవుని యందు విశ్వాసముతో అయన నీతిని, ప్రేమను, సమాధానమును వెతుకుమని" పౌలు గారు చెప్పినది  పాటిద్దాము.  

మూడవదిగా, దేవునికి వాక్యము ధ్యానించుట. ధ్యానించటమే కాకుండా వాక్యమునకు లోబడు వారిగా ఉండాలి. అనగా అయన ఆజ్ఞలను నిత్యమూ గైకొని అనగా పాటిస్తూ జీవించాలి. తద్వారా సాతానును ఎదిరించే శక్తి మనకు వస్తుంది! అప్పుడు  వాడు మననుండి దూరంగా పారిపోతాడు (యాకోబు 4:7). సాతాను యేసయ్యను శోధించినప్పుడు వాడిని ఎలా ఎదురుకొన్నాడు? పాత నిబంధనలో వాక్యములు చూపించి ఆయనను చిక్కులు పెట్టాలనుకున్నప్పుడు వాడికి సమాధానంగా దేవుని వాక్యాలనే ఉటంకించాడు కదా! తద్వారా వాడిని తన నుండి పారిపోయేలా చేసాడు. 

కీర్తనల గ్రంథము 119: "11.  నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను." 

తను రాసిన కీర్తనలో దావీదు దేవుని వాక్యమును బట్టి ఏమంటున్నాడు! "నీ ఎదుట పాపము  చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకున్నాను" అని. అనగా దేవుని వాక్యము మన హృదయములో ఉంచుకోవాలంటే, దానిని నిత్యమూ ధ్యానించాలి, మరియు దానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి. బైబిల్ లో ఉన్న వాక్యాలు ఉన్నదున్నట్లుగా గుర్తు ఉండవలసిన అవసరం లేదు కానీ, దేవుడు ఆ మాటలు ఎందుకు రాయించాడో ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అప్పుడే వాటిని మనం పాటించగలం! శోధనలు ఎదురయినప్పుడు వాక్యాలు జ్ఞాపకం తెచ్చుకొని వాటిని ఎదురించగలం. లేదంటే నామమాత్రంగా రోజు బైబిల్ చదివితే ఉపయోగం ఉండదు కదా! 

నాలుగవదిగా మనం చేయవలసింది నిత్యము ప్రార్థించటం. ప్రార్థన అనేది కేవలం మన అవసరములు దేవునికి తెలుపడటానికి మాత్రమే కాదు, ఆయనతో మాట్లాడటానికి, ఆయనను ఆరాదించటానికి మరియు మన పాప దోషములు ఒప్పుకోవటానికి కూడా చెయ్యాలి. నిరంతరం ప్రార్థించటం వలన దేవుని సాంగత్యం లేదా సహవాసము మనతో ఉంటుంది. యేసయ్య తన శిష్యులను శోధనలో పడిపోకుండా ఎడతెగక ప్రార్థించమన్నాడు కదా! చాల సార్లు మనకు పాపం చేయటం ఇష్టం లేకపోయినా శోధనలో పడిపోతూ ఉంటాము. 

ఎందుకంటే మన ఆత్మ సిద్ధపడినా గాని శరీరము బలహీనమయినది (మత్తయి 26:41 ) అందులో ఏ మాత్రము పవిత్రమయిన కార్యములు గాని, ఆలోచనలు గాని పుట్టవు. మన శరీరము బలహీనమయినది, కనుక దేవుని సన్నిధి మనకు ఎల్ల వేళలా తోడుగా ఉండటం శోధనను జయింపజేస్తుంది.

చివరగా, వీటన్నింటితో పాటు నిత్యమూ దేవుని కృపను పొందు అర్హత కలవారిగా ఉండాలి. తద్వారా పాపమూ మన మీద అధికారము చేయని వారిగా మారిపోతాము (రోమీయులకు 6:14). దేవుని కృప ఎవరికి లభిస్తుంది? దీన మనసు కలిగిన వారికి అనగా అహంకారము విడిచిన వారికి. ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదిరించి, దినులకు తన కృపను అనుగ్రహిస్తాడు (1 పేతురు 5:5). పైన చెప్పిన అన్ని విషయాలు తూచ తప్పకుండా పాటించిన, అహంకారులమయితే దేవుని కృపకు నోచుకోని వారిగానే ఉంటాము, పాపములో పడిపోతూనే ఉంటాము. 

క్రీస్తునందు ప్రియమయిన మీకు మనవి చేయవలసిన ముఖ్యమయిన విషయము,  దేవుడు కరుణ స్వరూపుడు, తనను వేడుకొన్న వారిని త్రోసిపుచ్చని స్వభావము కలిగి ఉన్నవాడు (యోహాను 6:37). కనుక నిరాశపడకుండా నిత్యమూ మన పాపములు ఒప్పుకుంటూ అయన కృపకు పాత్రులుగా ఉందాము. దేవుడు చూసేది, పవిత్రంగా ఉండాలనుకునే మనసును, అలాగే పాపంలోంచి బయటపడాలనుకునే తపనను (2 కొరింథీయులకు 8:12). మన శరీరము బలహీనమయినదని శరీర దారిగా మన మధ్య తిరుగాడిన మన రక్షకుడయిన యేసయ్య ఎరిగియున్నాడు 

దావీదు "నేను పాపమూ చేసితిని" అని నాతానుతో తన పాపం ఒప్పుకోగానే,  నాతాను "నువ్వు చావకుండునట్లు దేవుడు నీ పాపమూ పరిహరించెను" అన్నాడు (2 సమూయేలు 12:13). దావీదు చేసిన వ్యభిచారము, నర హత్యను కూడా ఒప్పుకోగానే క్షమించిన దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు. అయన  ముందు పాపం ఒప్పుకుని పశ్చాత్తాపపడు,  ఎన్నిమార్లయినా క్షమించటానికి అయన సిద్ధముగా ఉన్నాడు, కానీ అయన ప్రేమను, కృపను అలుసుగా తీసుకోవద్దు. 

కృప ఉంది కదా అని బుద్ది పూర్వకముగా పడిపోయే వారి నిమిత్తం ఇంకా బలి ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తోంది (హెబ్రీయులకు 10:26). ఆలా పడిపోతూ అయన చిత్తములో నుండి తొలగిపోవద్దు. ఏడ తెగక ప్రార్థించు, నిత్యము అయన వాక్యము ధ్యానించు, ఈ పాపము  నుండి విడుదల కావాలని అయన ముందు మోకరించి రోధించు, నిన్ను విజయుడిగా ఆయనే మార్చుకుంటాడు. 

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! నిజాయితీగా నీ ప్రయత్నాలు చేస్తూ, పడిపోయిన కూడా దేవుడు నీ హృదయపు సిద్ధపాటును బట్టి, పాపముపై నీకు ఉన్న నిరసనను బట్టి అయన  నిన్ను తప్పక క్షమిస్తాడు. మనస్ఫూర్తిగా క్షమించమని వేడుకుంటే "ఇక మీదట నీ పాపములు ఏమియు నేను గుర్తుంచుకోను" అని సెలవిచ్చిన దేవుడు, నిన్ను వదిలేయాడు. "సగం మునిగాం కదా, ఇంకా చలి దేనికి" అనుకుని అందులోనే ఉండిపోతే! నువ్వు ఉందనుకుంటున్న మారు మనసు నీలో లేదేమో ఒక్కసారి పరిశీలించి చూసుకో! 

దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!

16, ఏప్రిల్ 2022, శనివారం

ఈస్టర్ సందేశము

 

ప్రియమయిన సహోదరి, సహోదరులకు ఈస్టర్ శుభాకాంక్షలు. మన ప్రభువు,  రక్షకుడయినా యేసు క్రీస్తు మనలను పాపం నుండి వచ్చే జీతము, మరణము నుండి రక్షించి అనగా నిత్య నరకము నుండి తప్పించి నిత్య జీవితము అనగా తండ్రి, కుమారునితో పరలోకమందు నివసించటానికి, సిలువలో ప్రాణం పెట్టి తిరిగి మూడవ దినమున మరణం నుండి పునరుత్థానుడిగా  లేచాడు అని మనలో అందరికి తెలిసిన విషయమే కదా!

మత్తయి 28: "10యేసు భయపడకుడి; మీరు వెళ్లి, నా సహోదరులు గలిలయకు వెళ్లవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను."

క్రీస్తు మరణం గెలిచి సమాధి నుండి బయటకు వచ్చిన తర్వాత తనను వెతుకుతున్న మగ్దలేనే మరియకు కనబడి చెప్పిన ఈ మాటను మనం కాస్త లోతుగా ధ్యానించుకుందాము. ఇక్కడ అయన తన  శిష్యులను "నా సహోదరులు" అని సంభోదించాడు. అంతకుముందు అయన వారిని ప్రేమించాడు కానీ, ఇటువంటి సంబోధన చేసినట్లు మనం చూడము. దీన్ని బట్టి యేసయ్య, మనం అయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం తనతో పాటు తండ్రి దగ్గర ఉండబోతున్నాము అని  నిశ్చయతను ఇస్తున్నాడు. ఈ వచనమును మరి కాస్త లోతుగా ఆలోచిస్తే అయన శిష్యులను గలిలయలో కలుసుకోవాలనుకున్నాడు. దానికి గల  కారణం  మనం లేఖనముల బట్టి అర్థం చేసుకుందాము. 

దయచేసి మత్తయి 4:14-16 చదివినట్లయితే యేసు క్రీస్తు, యెషయా ప్రవక్త తన ప్రవచనములో చెప్పినట్లు  అంధకారంలో ఉన్న ఆ ప్రాంతం అనగా గలిలయ ప్రాంతం, వెలుగు పొందుకోను లాగా తన  పరిచర్యను అక్కడ నుండే మొదలు పెట్టాడు అని చూడవచ్చు.  అలాగే యోహాను సువార్త 7:40-52  చూసినట్లయితే,  యేసును క్రీస్తు అని కొందరు, ప్రవక్త అని కొందరు వాదించుకున్నారు. అయితే పరిసయ్యులు మాత్రం "అధికారులు, పరిసయ్యులలో (మత నాయకులు) ఎవరయినా అతణ్ణి విశ్వసించరా? అసలు గలిలయ ప్రాంతం నుండి ఎవరయినా ప్రవక్త వస్తాడా? విశ్వాసించే ఈ ప్రజలు ధర్మ శాస్త్రం తెలియని శాపగ్రస్తులు" అంటున్నారు. 

క్రీస్తు ఒకరి లేఖనముల జ్ఞానం చూసి రక్షణ ఇవ్వడు. కేవలం తన యందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే తానూ సాధించిన రక్షణను పంచబోతున్నాడు. లేఖనముల గర్వంతో క్రీస్తును గుర్తించలేని జ్ఞానులయిన వారిని సిగ్గుపరచులాగా, ఆ ప్రాంతం నుండి జాలరులయిన వారిని తన శిష్యులుగా చేసుకొని విశ్వాసంలో వారిని నడిపించాడు. మరల ఇప్పుడు సర్వ లోకానికి సువార్త పరిచర్యను శిష్యులకు అప్పగించటానికి వారిని అక్కడ కలుసుకో బోతున్నాడు అని అవగతమవుతుంది. 

క్రీస్తు మరియతో అన్న మరొక మాట భయకుడి. ఈ మాటను యేసయ్య తన బోధనలలో పలు మార్లు చెప్పినట్లు మనం చూడవచ్చు. ఆ మాటను ఇప్పుడు చెపుతుంది, మరణం నుండి లేచినా తనను చూసి భయపకుడి అని చెపుతున్నాడా?  లేదా నేను లేచాను గనుక ఇక భయపడకుడి అని చెపుతున్నాడా? మానవులకు అత్యంత భయంకరమయిన విషయము మరణము. దానిని వారికి  తప్పించటానికి,  సృష్టికి కారకుడయినా యేసును సిలువ మరణానికి అప్పగించి, మృత్యుంజయుడిగా చేసాడు తండ్రి అయినా దేవుడు. 

క్రీస్తు తాను పరిశుద్ధ పరచిన, మరియు పరిశుద్ధపరచ బోయే అందరిని సోదరులుగా పిలవటానికి సిగ్గుపడలేదు. వాక్కుగా ఉన్న అయన మనకోసం శరీరం ధరించి, మనవలె రక్త మాంసములు పొందుకొని, మన శరీరంలో మరణానికి అధిపతి అయినా సాతానును జయించి మన రక్త మాంసములలో  పాలిభాగస్తుడయ్యాడు (హెబ్రీయులకు 2:11-15).  తనయందు విశ్వాసం ఉంచిన మానవులకు మరణ భయమును దూరం చేయగల సమర్ధుడిగా లేచాడు, అందును బట్టి తానూ మరణం గెలిచి లేచిన వెంటనే భయపడకుడి అని చెపుతున్నాడు. 

మరి ఆయనకు నిజమయిన  సహోదరీ, సహోదరులుగా మనం అర్హత సంపాదిస్తున్నామా? యేసయ్య భూమిమీద బ్రతికినప్పుడు, తన సొంత తల్లి, సహోదరులు తనను  చూడవచ్చారని చెప్పినప్పుడు ఏమన్నాడు? (లూకా 8:21)  దేవుని వాక్యము విని దాని ప్రకారము చేయువారు మాత్రమే నా తల్లి, నా సహోదరులు అని చెప్పాడు కదా! దేవుని వాక్యము అన్నింటికన్నా ఎక్కువ దేనిని ఖండిస్తుంది, అవిశ్వాసమును. ఎందుకంటే పాపి అయినా వాడిని రక్షించటానికే క్రీస్తు భూమి మీదికి వచ్చాడు కానీ అవిశ్వాసి అయినా వాడు ఎన్నడూ కూడా దేవుణ్ణి సంతోష పెట్టలేడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది (హెబ్రీయులకు 11:6)

అయితే సహోదరులు అని సంభోదించిన క్రీస్తు శిష్యులు మాత్రం విశ్వాసం చూపించలేక పోయారు. కనుక అయన వారిని "అవివేకులారా, క్రీస్తు గురించి ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా" అని  గద్దించి  మోషే, మరియు సమస్త ప్రవక్తలు తన గురించి చెప్పిన మాటలకూ అర్థం వివరించాడు. అయినప్పటికి వారి కనులు తెరువబడలేదు. ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రము చెప్పి  విరిచి  ఇచ్చిన తరువాత ఆయనను గుర్తుపట్టారు. అయన అదృశ్యం అయినా తరువాత ఒకరితో ఒకరు "అయన లేఖనముల అర్థం చెపుతుంటే హృదయంలో మండింది కదా!" అని చెప్పుకున్నారు (లూకా 24:25-32). దీనిని బట్టి మనకు అర్థం అవుతున్న సంగతి ఏమిటి? దేవుని వాక్యం వారిలో క్రియ చేసింది కానీ, వారి అవిశ్వాసం, హృదయ కఠినత్వం క్రీస్తును వారు గుర్తించని స్థితిలో ఉంచింది.  

ఆనాడు వారికి బైబిల్ అందుబాటులో లేదు, మరియు క్రీస్తు ఇచ్చిన ఆదరణ కర్త అనగా పరిశుద్దాత్మ ఇంకా రాలేదు. కనుక క్రీస్తు వారిని గద్దించి తిరిగి విశ్వాసం నేర్పించాడు. ఎక్కడ పడితే అక్కడ రక రకాల రూపంలో దేవుని వాక్యం అందుబాటులో ఉంది, అర్థం చెప్పటానికి పరిశుద్దాత్మ దేవుడు తోడుగా ఉన్నాడు. మరి ఎంతవరకు వాక్యం చదువుతూ పాటిస్తున్నాం? అసలు రోజుకు ఒక్కసారి చదువుతున్నామా?

కీర్తనలు 104: "34. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండును గాక నేను యెహోవాయందు సంతోషించెదను."

ఇక్కడ కీర్తన కారుడు "దేవుని గురించిన ధ్యానము ఆయనకు ఇంపుగా ఉంటుంది కాబట్టి, అందును బట్టి నేను సంతోషిస్తాను" అంటున్నాడు. దేవుని గురించి ధ్యానము ఎలా చేస్తాము, అయన వాక్యము చదవటం ద్వారానే కదా? అందును బట్టి దేవుడు మనలను తనకు ఇంపైన వారిగా ఎన్నుకుంటాడు.  అందులోనే మన సంతోషం దాగి ఉంది. తద్వారా మన విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. 

ప్రియా సహోదరి, సహోదరుడా! మనం  క్రీస్తు విశ్వాసులం అని చెపుతూ  అని పాటలు పాడుతూ, సంఘానికి వెళితే సరిపోదు. ప్రభువు చెప్పిన సువార్త పరిచర్య భారం కలిగి ఉండాలి, ప్రభువే మార్గాలు తెరుస్తాడు. దేవుని వాక్యము నిత్యమూ చదువుతూ అయన స్వరమును వినాలి. విన్నది ఆచరించాలి, వాక్యం ఒకటి చెపుతుంటే, ఎవరో ఎదో చెప్పారని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించి దేవునితో ఉన్న సోదర సంబంధమును పోగొట్టు కోవద్దు, ప్రభువు మన కొరకు సిలువలో వేధన పడి, మరణాన్ని గెలిచి తెచ్చిన రక్షణ కోల్పోవద్దు. 

దేవుని చిత్తమయితే మరో వాక్య భాగం ధ్యానించుకుందాము! అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!

15, ఏప్రిల్ 2022, శుక్రవారం

గుడ్ ఫ్రైడే - ఏడవ మాట (లూకా 23:46)

 

దేవుడు మానవులను తన స్వరూపంలో ఏర్పరచుకున్నది వారిని తన సాంగత్యములో ఉంచుకొని వారితో స్నేహం చేయటానికి, కనుకనే పిలిచిన వెంటనే తనయందు విశ్వాసం ఉంచిన అబ్రాహామును, తనకు స్నేహితునిగా దేవుడు పేర్కొన్నాడు (యెషయా 41:8). ఈ ఏర్పాటు జగతి పునాది వేయబడక ముందే దేవుని చిత్తములో ఉన్నట్లుగా లేఖనములలో మనం చూడవచ్చు. అయితే మనం ఇదివరకు సిలువ మాటల ధ్యానంలో చెప్పుకున్నట్లుగా, మానవాళి దేవుని ఉద్దేశ్యములు కోల్పోయి నశించు వారిగా మారిపోయారు. 

కనుక యేసు క్రీస్తు సిలువలో మన కోసం ప్రాణం పెడుతూ, తన శారీరక శ్రమను బట్టి వేధనతో ఈ మాటలు పలుకలేదు కానీ, మనకు దేవుని పట్ల విశ్వాసమును పెంపొందించే లాగున, మరియు ఆయనకు మనలను దగ్గరగా తీసుకు రావటానికే పలుకుతున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. అయన ఇప్పుడు సిలువలో పడుతున్న శ్రమ ద్వారా తండ్రి తనను ఘనపరుస్తాడని యెరిగి ఉన్నాడు. ఎందుకంటే దేవుని వాగ్దానాలు పూర్ణ హృదయముతో విశ్వసించాడు. 

అందుకే అయన సిలువలో పలికిన చివరి మాట అనగా ఏడవ మాట లూకా సువార్త 23:46 లో చూడవచ్చు. 
 
లూకా 23: "46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి--తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను."

యేసు క్రీస్తుకు అన్నింటి మీద అధికారం ఇవ్వబడింది. "ఎవరు కూడా తన అనుమతి లేనిదే తన ప్రాణం తియ్యలేరని" చెప్పాడు (యోహాను 10:18) . ఇక్కడ ఈ ఏడవ మాటలో తన ఆత్మను తండ్రికి అప్పగిస్తున్నాడు. అనగా తను చనిపోవడానికి సిద్ధపడుతున్నాడు. అప్పటివరకు మన పాప క్షమాపణకై  రక్త ప్రోక్షణ గావించి, చివరగా మన పాపం వలన మనం పొందవలసిన మరణమును తాను పొందుతున్నాడు. 

అందుకే పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అంటాడు "అయన ఆకారములో మనిషివలె కనబడి, మరణము పొందునంతగా తనను తానూ తగ్గించుకున్నాడు" అని (ఫిలిప్పీయులకు 2:6). వీటన్నింటిని బట్టి చూస్తే మనకు ఏమి అవగతమవుతుంది, క్రీస్తు తండ్రి చిత్తమును నెరవేర్చటానికి తన ఆత్మను అప్పగిస్తున్నాడు. దైవ లేఖనములలో ఉన్న వాగ్దానములను పూర్తిగా విశ్వసించాడు. మన వలె శోధించే శరీరంలో ఉండి కూడా నిత్యము దేవునికి మొఱ్ఱపెట్టుట ద్వారా, దేవుని నడిపింపును పొందుకున్నాడు.  

కనుకనే తనకు ఈ లోకంలో కలిగే శ్రమలను బట్టి వేధన పడకుండా, దూషణలను బట్టి దూషించకుండా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు (1 పేతురు 2:23). తద్వారా దేవుని వాగ్దానాల పట్ల, మరియు అయన  సత్య శీలత పట్ల మనకు విశ్వాసం కలిగిస్తున్నాడు. కానీ అటువంటి విశ్వాసము మనకు కలగాలంటే మనలను మనం పూర్తిగా దేవునికి అప్పగించుకోవాలి. క్రీస్తు తన బోధలలో ఏమని చెప్పాడు? "మీరు చెడ్డవారు అయి ఉండియు, మీ బిడ్డలకు మంచి ఈవులు ఇవ్వ జూస్తారు కదా! నీతిమంతుడయిన మీ పరలోకపు తండ్రి మీకు కీడు చేయాలనీ చూస్తాడా?" అన్నాడు కదా. 
 
కాబట్టి మనకు కలిగే శ్రమలను బట్టి అధైర్య పడకుండా, దేవుని మీద విశ్వాసముతో కొనసాగాలి, మనలను మనం పూర్తిగా ఆయనకు అప్పగించుకోవాలి. సిలువ మరణం తర్వాత దేవుడు తనను మరణం నుండి లేపుతాడని క్రీస్తు పూర్తిగా విశ్వసించాడు. మరియు ఇదివరకు చెప్పుకున్నట్లు, లేఖనములు నెరవేరులాగా ఈ మాటను పలికినట్లుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. 

కీర్తనలు 31: "5. నా ఆత్మను నీ చేతికప్పగించుచున్నాను యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే."


ఈ వచనములో దావీదు, "నా ఆత్మను నీ చేతికి అప్పగించు చున్నాను, సత్య దేవా నన్ను విమోచించు వాడవు నీవే" అంటున్నాడు. ఇక్కడ దావీదు తనకు దేవుని మీద ఉన్న గొప్ప విశ్వాసమును వెల్లడి చేస్తున్నాడు, కానీ ఇక్కడ తానూ నిజంగా తన ఆత్మను అప్పగించలేదు. దేవుడు వాగ్దానము తప్పని వాడని లేఖనములలో మనం చాల సార్లు  చూడవచ్చు.  కనుకనే క్రీస్తు సిలువలో ఈ మాట పలుకుట ద్వారా మనకు మరో సారి దేవుని సత్య సందతను గుర్తు చేస్తున్నాడు. తన ప్రాణం పెట్టుట ద్వారా, అయన యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు నిత్య జీవం ఇస్తాడని, అయనను  మరణం నుండి లేపుట ద్వారా నిరూపించ బడుతుందని క్రీస్తు ఎరిగి ఉన్నాడు.  

అపొస్తలుల కార్యములు 7: "59. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి."

క్రీస్తు మరణ, పునరుత్థానం తర్వాత శ్రమలు అనుభవించిన క్రీస్తు విశ్వాసులలో మొదటి హత సాక్షి అయినా సైఫను తనను రాళ్ళతో కొట్టి చంపుతున్న వారిని క్షమించి యేసు ప్రభువుకు తన ఆత్మను అప్పగించుకుంటున్నాడు. క్రీస్తు సిలువలో చూపిన క్షమా గుణం, దేవునికి  తనను తానూ అప్పగించుకోవటం తానూ కూడా చేశాడు. మరి మన జీవితంలో కలిగే శ్రమలను బట్టి, విశ్వాసంలో సడలి పోతున్నామా? లేక దేవుని వాగ్దానాలు నమ్ముకొని, ఏనాటికయినా దేవుడు మనకు న్యాయం తీరుస్తాడని నిరీక్షణతో ఎదురు చూస్తున్నామా?

అన్ని సక్రమంగా జరుగుతుంటే ఏ భాధ ఉండదు, అసలు విశ్వాసంలో తప్పిపోవటమే ఉండదు కదా! కానీ శ్రమలు లేకుండా దేవుని మీద ప్రేమ ఎలా తెలుస్తుంది? అసలు విశ్వాసం ఎలా పెరుగుతుంది? దేవుడు  యోబు గురించి సాతానుకు చెప్పినప్పుడు వాడు ఏమి అన్నాడు! అతన్ని బాగా దీవిస్తావు కాబట్టి, నిన్ను ప్రేమిస్తాడు, విశ్వసిస్తాడు అని! కానీ శ్రమల ద్వారా యోబు యొక్క విశ్వాసం ఎంత గొప్పదో తెలిసింది. నా విమోచకుడు సజీవుడు అని తనను తానూ దేవునికి అప్పగించుకున్నాడు. తద్వారా రెండింతలు ఆశీర్వాదాలు పొందుకున్నాడు. 

1 పేతురు 4: "19. కాబట్టి దేవుని చిత్తప్ర కారము బాధపడు వారు సత్‌ప్రవర్తన గలవారై, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను." 

పేతురు గారు పరిశుద్దాత్మ ప్రేరణతో ఏమని రాస్తున్నారు చూడండి. దేవుని చిత్త ప్రకారం భాదపడు వారు మంచి ప్రవర్తన వదిలి పెట్టకుండా, నమ్మకమైన సృష్టి కర్తకు, అనగా దేవునికి తమ  ఆత్మలు అప్పగించు కోవాలని. ఈ విశ్వాసం నిజమయిన దేవుని వాగ్దనాలను నమ్ముట ద్వారా, నిత్యమూ ఆయనతో ఉండే సన్నిహిత సాంగత్యమును బట్టి వస్తుంది. అబ్రాహాము దేవుని చేత స్నేహితుడని ఎలా పిలువ బడ్డాడు? దేవుణ్ణి నమ్ముట ద్వారా. 

సహోదరి, సహోదరుడా! క్రీస్తు సిలువలో పలికిన ఈ ఆఖరి మాట ద్వారా, మనకు నేర్పుతున్న విశ్వాసం, తగ్గింపు, శ్రమలలో మనలను మనం ఆయనకు అప్పగించుకోనే ప్రయత్నం చేస్తున్నారా? ఒక వేళ చేయక పోతుంటే, ఈ రోజు నుండయినా చేద్దామా? తండ్రిని  కూడా విశ్వాసించక పొతే, మరిం  ఇంకేవరిని విశ్వసిస్తాం చెప్పండి! 

దేవుని చిత్తమయితే ఈస్టర్ సందేశమును ధ్యానించుకుందాము! అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!! 

14, ఏప్రిల్ 2022, గురువారం

గుడ్ ఫ్రైడే - ఆరవ మాట (యోహాను 19:30)

 

యేసు క్రీస్తుల వారు సిలువలో పలికిన ఆరవ మాట మనం యోహాను సువార్త 19:30 లో చూడవచ్చు. 

యోహాను 19: "30. యేసు ఆ చిరక పుచ్చుకొనిసమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను."

ఆనాడు ఏదెను వనములో అవ్వ, ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి చేసిన పాప దోషమును బట్టి దేవుడు మానవాళికి ఇచ్చిన వాగ్దానమును అనగా పాపం నుండి విమోచన కలుగజేయటానికి క్రీస్తు సిలువలో తన ప్రాణం పెడుతున్నాడని ఇదివరకు మనం ధ్యానించుకున్న మాటలలో కూడా  ప్రస్తావించుకున్నాము. ఆదాము, అవ్వ దేవుని ఆజ్ఞను అతిక్రమించి, ఎలాగ పాపం చేశారో దానికి పూర్తీ విరుద్ధముగా క్రీస్తు, నిత్యము దేవుడు ఇచ్చిన ప్రతి ధర్మశాస్త్ర నియమమును అనగా దేవుని ఆజ్ఞను నెరవేర్చి పవిత్రంగా జీవించాడు.  

మనవలె శోధించబడే శరీరము పొందుకొని కూడా శోధనలు జయించి కళంకం లేని దేవుని గొఱ్ఱె పిల్లగా జీవించాడు. దేవుడు మోషే ద్వారా మానవాళికి పది ఆజ్ఞలను ఇచ్చి వారు తనకు ఇష్టమయిన వారుగా అనగా పాపం లేని వారిగా జీవించాలని కోరుకున్నాడు. అయితే పొరపాటున ఆజ్ఞలు అతిక్రమించి పాపం చేసినట్లయితే, వారికి పాప క్షమాపణ కలుగు లాగున  దేవుడు తానూ పేర్కొన్న జంతువుల రక్త ప్రోక్షణను  మరియు దహన బలి, సమాధాన బలి, పాప పరిహర్ధ బలి, అపరాద పాప పరిహారార్ధ బలి మొదలగు వాటిని చేయుటకు నిబంధన పెట్టాడు.

ఈ నిబంధన ప్రకారం, దేవుడు లేవి గోత్రికులను తనకు యాజకుకులుగా నియమించుకున్నాడు. అందులో ప్రధాన యాజకులు, ఆయనకు సహాయకులు యాజకులు. ఈ ప్రధాన యాజకుడు దేవుని ఆలయంలో ఉంటూ ప్రజలు తెచ్చిన బలులను దేవునికి అర్పిస్తూ, ప్రజల మీద జంతువుల రక్తము ప్రోక్షిస్తూ, వారికి పాప క్షమాపణ కలిగించే వాడు. ఈ నిబంధన ప్రకారం ప్రధాన యాజకులు తప్ప ఇతరులు ఎవరు బలులు అర్పించటానికి లేదు, మరియు ఈ ప్రధాన యాజకులు కూడా ఎన్నో నియమ నిష్టలు పాటించాలి.

లేదంటే దేవుని ఆగ్రహానికి గురి అయ్యేవారు, బలుల అంగీకార సూచనగా దేవుని నుండి అగ్ని వచ్చి ఆ బలులను దహించేది. అయితే ఆపవిత్రమయిన అగ్నితో బలులను దహించాలని చూసిన అహరోను కుమారులను దేవుని అగ్ని దహించినట్లు కూడా మనం చూడవచ్చు (లేవీయ కాండము 10:1-2). ప్రతి యేడాది ప్రధాన యాజకుడు దేవుని మందిరములో అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి తన పాపముల నిమిత్తము, మరియు ప్రజల పాపముల నిమిత్తము జంతువుల రక్తమును అర్పించే వాడు (లేవీయ కాండము 16:34)

అయితే ఈ నిబంధనను రద్దు చేసి కొత్త నిబంధనను మానవాళికి ఇవ్వటానికి యేసయ్య ఈ భూమి మీదికి రక్షకుడిగా వచ్చాడు. తన జీవితం అంత ధర్మ శాస్త్రమును నెరవేర్చి, పాపం లేని వాడిగా జీవించి, శ్రేష్ఠమయిన బలిగా తనను తానె అర్పించుకోవటం ద్వారా ప్రధాన యాజకుల కంటే గొప్ప ప్రధాన యాజకుడిగా పిలువ బడ్డాడు (హెబ్రీయులకు 4:14-15) .

యేసు క్రీస్తు దేవుని ఆజ్ఞలు నెరవేర్చటంతో పాటు, దేవుని మీద ఆధారపడి, ఆ స్థాయిని మించిన జీవితము జీవించి మనకు బోధించాడు. ఉదాహరణకు పాత నిబంధనలో నర హత్య చేయరాదు అని ఉంటె క్రీస్తు ఒకరి మీద ఆగ్రహం ఉండటమే హత్యగా బోధించాడు. మరియు వ్యభిచారం చేయరాదు అని ధర్మశాస్త్రం చెపితే మోహపు చూపు కలిగి ఉండటమే వ్యభిచారం అని మన విశ్వాసపు స్థాయిని పెంచాడు. తన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, పరిశుద్దాత్మను పొందుకుని తనవలె జీవించే పరిస్థితులను మనకు కలిగించాడు.

దేవుని హృదయాను సారుడు అను పిలువ బడే దావీదు ఆకలితో ఉన్నప్పుడు దేవుని ఆలయంలో ఉంచిన పవిత్రమయిన రొట్టెలు కూడా తిన్నాడు, కానీ యేసు క్రీస్తు నలుపది దినములు ఉపవాసం ఉండి కూడా, తనను సాతాను రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమన్నప్పుడు "నరుడు కేవలం రొట్టె ద్వారా కాదు, దేవుని నోటి నుండి వచ్చే మాట ద్వారా" అని వాడిని గద్దించాడు. ఇక్కడ దావీదు తప్ప చేసాడని చెప్పటం ఉద్దేశ్యం కాదు, కానీ నూతన నిబంధనను దేవుని మీద ఆధారపడి యేసయ్య అప్పటినుండే జీవించాడు.

"నీ శిష్యులు ఎందుకు ఎప్పుడు ఉపవాసం ఉండరు" అని పరిసయ్యులు యేసును ప్రశ్నించినప్పుడు, అయన ఏమన్నాడు. "పెండ్లి కుమారుడు వారితో ఉండగా ఎవరు ఉపవాసం చేయారని, పెండ్లి కుమారుడు వెళ్లిపోయే రోజు దగ్గరలోనే ఉంది అప్పుడు వారు ఉపవాసం చేస్తారు" అని. మరియు "పాత వస్త్రము పై చిరుగుకు కొత్త వస్త్రం వేయ కూడదని, ఆలాగే పాత తోలు సంచులలో కొత్త ద్రాక్షరసం దాచరాదని" దీని అర్థం ఏమిటి, క్రీస్తు రాకడ నూతన నిబంధన ఏర్పాటు చేయటానికి.

అంటే ఇదివరకు ఉన్న రక్త ప్రోక్షణ, దహన  బలులు రద్దు చేయబడ్డాయి. ప్రధాన యాజకుడు అనే పాత్ర ముగిసి పోయింది, దేవుని ఆలయంలో పవిత్ర స్థలం వెళ్ళే అర్హత  అందరికి లభించింది. ఎలాగంటే మన దేహమే దేవుని ఆలయంగా, క్రీస్తు తన రక్తమిచ్చి కొనుట ద్వారా మనం అయన సొత్తుగా మారిపోయాము. క్రీస్తు ఇచ్చిన ఆదరణ కర్త రూపంలో దేవుడు మనలోనే నివసించటం మొదలు పెట్టాడు. 

నూతన నిబంధనను క్రీస్తు ద్వారా పొందుకున్న మనము నూతనమయిన జీవితము బ్రతుకుతున్నామా? పరిశుద్దాత్మ శక్తి ద్వారా మన శరీర క్రియలను ఉపవాసం ఉంచుతున్నామా? లేక ఈ ఒక్కసారి ఆకలి తీర్చుకుందాం అని సాతానుకు లొంగి పోతున్నామా?

సహోదరి, సహోదరుడా! యేసయ్య మన కోసం తన జీవితం అంత పవిత్రంగా బ్రతికాడు. ఆ సిలువలో తన ఆఖరి రక్తపు బిందువు వరకు మన కోసం కార్చాడు. మరి మన పాత జీవితానికి ముగింపు చెప్పేది ఎప్పుడు! ఆ పాత నిబంధన స్థాయి అనగా శారీరక ఆజ్ఞల నుండి నూతన నిబంధన స్థాయి అనగా మానసిక మార్పులొకి రావాలి. అది కేవలం క్రీస్తు మీద ఆధారపడి, పరిశుద్దాత్మ శక్తి ద్వారానే సాధించగలం. అనగా అయన ఆజ్ఞలు పాటించుట ద్వారా. 

అనాడు అహరోను కుమారులను దహించినట్లు దేవుడు మన పాపములను బట్టి ఈనాడు దహించక పోవచ్చు, కానీ క్రీస్తు పెండ్లి కుమారునిగా వధువు సంఘం కోసం త్వరలో రానున్నాడు. ఆనాడు మనం ఎవరో ఆయనకు  తెలియదంటే మన పరిస్థితి ఏమిటి?  దేవుడు  క్రీస్తు ద్వారా  మనలను ఎన్నుకొని రాజులయిన యాజకులుగా చేశాడు (1 పేతురు 2:9). కానీ మనం ఇంకా పాపనికి బానిసలుగా ఉంటే, క్రీస్తు సిలువలో మన కొరకు ప్రాణం పెడుతూ "సమాప్తమయినది" అని చెప్పిన మాట మనకు అర్థమయినట్లేనా? 

దేవుని చిత్తమయితే ఏడవ మాటను ధ్యానించుకుందాము. అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!

13, ఏప్రిల్ 2022, బుధవారం

గుడ్ ఫ్రైడే - అయిదవ మాట (యోహాను 19:28)

 

"నశించి పోతున్న దాన్ని వెతికి  రక్షించటానికి నేను తండ్రి నుండి వచ్చాను" మరియు "నా  ద్వారానే తప్ప, ఎవడు కూడా మరో విధంగా తండ్రిని చేరలేడు" అని యేసయ్య పలుమార్లు తన భోధలలో ప్రస్తావించాడు. కనుకనే తండ్రి యొద్ద కొలువు తిరి ఉండటం భాగ్యమని ఎంచక, మనలను తండ్రి వద్దకు చేర్చటానికి, మనకు పాప క్షమాపణ ఇవ్వటానికి సిలువలో వ్రేలాడుతూ బలియాగం చేస్తున్నాడు. సిలువ త్యాగానికి ముందు, యేసయ్య ఎన్నో మార్లు తానూ ఎక్కడ నుండి వచ్చింది, తనను ఎందుకు విశ్వసించాలి అని తన భోధలలో వివరించాడు. కానీ ప్రజల గ్రుడ్డితనమును బట్టి ఆయనను గుర్తించక వెంబడించ లేక పోయారు, ఇప్పటికి చాల మంది అదే స్థితిలో ఉన్నారు. 

యేసయ్య తండ్రి తనకు అనుగ్రహించిన అన్ని ఆత్మలను రక్షించాలని నిత్యమూ ఆరాట పడ్డాడు. తన స్వస్థతల ద్వారా, తన బోధనల ద్వారా దేవుని ప్రేమను తెలియ చేసాడు, మరియు తండ్రికి ఇష్టమయిన వారిగా ఎలా జీవించాలో నేర్పించాడు. అయితే ఈ చివరి ఘడియాలలో కూడా ఆ సిలువలో పలికిన అయిదవ మాట ద్వారా తనకు ఉన్న ఆత్మల రక్షణను బట్టి దప్పిగొన్నాడని చెప్పవచ్చు.  

యోహాను 19: "28. అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లునేను దప్పిగొను చున్నాననెను."

ఈ వచనమును మనం పరిశీలిస్తే, సమస్తము సమాప్తమైనదని ఎరిగి అని ఉంది. ఏమి సమాప్తము అయింది? మానవాళిని రక్షించటానికి తండ్రి తన మీద పెట్టిన భారము పూర్తీ అయింది అని యేసు క్రీస్తు గ్రహించాడు. అంతకు ముందు నాలుగవ మాటలో మనం చెప్పుకున్నట్లు, దేవుడు క్రీస్తు మీద మన  పాప భారం మోపి, క్రీస్తుకు, తనకు ఎడబాటు కలిగించాడు. తద్వారా క్రీస్తు మనకై చెల్లించ వలసిన క్రయధనము అనగా పాపమూ ద్వారా మనకు కలిగే జీతము మరణమును పొందుకోబోతున్నాడు. ఇకపై మిగిలిన కార్యము, మానవాళి తన యందు విశ్వాసము ఉంచి, తన ద్వారా నీతిని పొందుకొని తండ్రిని చేరుకోవటమే. ఈ సువార్తను చాటించి ఆత్మలను రక్షించు లాగున, ఆత్మల భారంతో  దాహము పొందుకున్నాడు. 

దయచేసి యోహాను సువార్త 4 అధ్యాయం పూర్తిగా చదవండి. యేసయ్య సమరయ స్త్రీ దగ్గరికి ఏమని వెళ్ళాడు? తనకు దాహంగా ఉన్నది, కొంచెం నీళ్ళు ఇమ్మని కదా! నీళ్ళు ఇవ్వ జూచిన ఆమెతో, ఈ నీరు తాగితే మరల దాహం కలుగుతుంది, కానీ నేను ఇచ్చే నీరు తాగితే ఎన్నటికీ దాహం కలుగదు అని చెప్పి, తానే వారు ఎదురు చూస్తున్న మెస్సియ్య నని ఆమెకు తెలియ జేశాడు. అప్పటి వరకు పాపంలో  ఉండి, సిగ్గు పడుతూ, ఎవరు చూడకుండా  మధ్యాహ్నం మంచి నీటికై వచ్చిన ఆ స్త్రీ, యేసయ్య మెస్సియ్య అని తెలుకోగానే, ఎవరు ఏమి అనుకుంటారోనని పట్టించుకోకుండా, ఊరిలోకి వెళ్ళి అందరిని క్రీస్తు దగ్గరికి చేర్చింది ! 

యేసయ్య అదే సందర్భంలో కోత కాలం గురించి శిష్యుల వద్ద ప్రస్తావించి, ఆత్మల రక్షణను తెలియ చేసాడు. మరియు తన తండ్రి కార్యము నెరవేర్చటమే తనకు ఆహారముగా ఉన్నదని కూడా చెప్పినట్లు మనం చూడవచ్చు. యేసయ్య ఆ సమరయ స్త్రీ వద్దకు వచ్చింది, సహజంగా కలిగే దాహము తీర్చుకోవటానికి కాదు కానీ ఆత్మలను తన దగ్గరకు చేర్చుకోవాలని. ఆ స్త్రీ ద్వారా ఉరి వారంత రక్షణ పొందుకున్నారు, యేసయ్యను వారితో పాటు రెండు రోజులు ఉండమని బ్రతిమాలుకున్నారు. మనలో ఎంత మంది క్రీస్తు దాహం తీర్చే దిశగా అడుగులు వేస్తున్నాము? మన ద్వారా ఎంతమంది క్రీస్తు తమతో ఉండాలని కోరుకుంటున్నారు? 

ఉరి వారందరి చేత ఛీత్కరింపబడుతూ, ఎవరి ముందుకు రాలేక, సిగ్గుపడుతూ బ్రతుకుతున్న సమరయ స్త్రీ కంటే హీనమయిన స్థితిలో మనం లేము కదా? మరి సువార్త చెప్పటానికి ఎందుకు సిగ్గు? మనం అపొస్తలుల వలె ప్రాణాలు పెట్టాలని దేవుడు చెప్పలేదు,  ఒకవేళ అటువంటి స్థితి వస్తే దేవుడు మనకు తగిన కృపను ఇస్తాడు. కానీ కనీసం మన జీవితం ద్వారా, క్రీస్తు ప్రేమను చూపించే వారీగా ఉన్నామా? తద్వారా సువార్తను చాటిస్తున్నామా? క్రైస్తవులంటే ఇంత కనికరం, క్షమా గుణం కలిగి ఉంటారా? అని అన్యులు అనుకునేలా బ్రతికే ప్రయత్నం చేస్తున్నామా?

యేసయ్య నిత్యమూ ప్రజలకు తన గురించి చెప్పి, తనయందు విశ్వాసం కలిగించి వారిని రక్షించాలని చూశాడు. ఎవరయినా దప్పికగొంటే తన యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవాలని పిలుపు నిచ్చాడు. తన యందు విశ్వాసము ఉంచిన వారిలో నుండి జీవజలములు ప్రవహిస్తాయని లేఖనములు గుర్తు చేశాడు (యోహాను 7:34)మరి క్రీస్తు విశ్వాసులుగా చెప్పుకొనే మనము, లేఖనాలలో రాసి ఉన్నట్లుగా మన జీవితంలో జరగటానికి, క్రీస్తు బోధలు పాటిస్తున్నామా?  లేఖనముల నెరవేర్పుకై క్రీస్తు ఎన్నో మార్లు తన సొంత చిత్తమును, ఘనతను వదిలి పెట్టాడు. ఇప్పుడు దప్పిక గొనటానికి మరొక కారణం లేఖనముల నెరవేర్పుగా కూడా మనం చూడవచ్చు. 

లూకా 24: "44. అంతట ఆయన–మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడిన వన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను"

క్రీస్తును గురించిన ప్రవచనాలు, లేఖనాలలో ఎన్నో మార్లు రాయబడి ఉన్నాయి. కీర్తనలు 69:21 లో చూసినట్లయితే దావీదు పరిశుద్దాత్మ ప్రేరేపితుడయి "నాకు చేదు ఆహారము పెట్టిరి, నేను దాహము గొన్నప్పుడు వారు  చిరకను తాగ నిచ్చిరి" అని రాసాడు. ఈ మాట క్రీస్తును గురించినది కాబట్టి, యేసయ్య సిలువలో ఆ ప్రవచనం నెరవేర్చులాగా  దాహం పొందుకున్నాడు. తర్వాత సైనికులు ఆయనకు చేదు ద్రాక్షారసములో చిరకను ముంచి అందించారు. 

సహోదరి, సహోదరుడా! ఆత్మల రక్షణకై చేదు అనుభవాలు ఎదుర్కోవటానికి, కష్టాలు భరించటానికి సిద్దపడి ఉన్నామా? మనలను బట్టి అయన ఇంకా దాహంగానే ఉన్నాడు అని గుర్తిస్తున్నామా!  ఆ సమరయ స్త్రీ జీవితంలో యేసయ్య ద్వారా లోకపరమయిన అద్భుతాలు ఏమి జరుగలేదు, కేవలం రక్షకుడు అయినా యేసయ్యను తెలుసుకుంది. పాపము చేత సిగ్గుతో నిండుకున్న ఆమె జీవితం ఇప్పుడు ధైర్యంతో, సంతోషంతో నిండి పోయింది. తనకు దొరికిన ఆ సంతోషం, ఆ రక్షణ ఉరి వారందరికి పంచి పెట్టింది.  అటువంటి సువార్త పరిచారం మనం చేస్తే, మన కొరకు, మనలాంటి వారి కొరకు సిలువలో నలిగినా యేసయ్య దాహం తీర్చిన వారిగా ఉంటాము.

దేవుని చిత్తమయితే ఆరవ మాటను ధ్యానించుకుందాము. అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!

12, ఏప్రిల్ 2022, మంగళవారం

గుడ్ ఫ్రైడే - నాలుగవ మాట (మార్కు 15:34)

 

మనలో అందరికి తెలిసిన విధంగా, ఆదాము అవ్వ చేసిన పాపము నుండి మానవాళిని  విడిపించలని  బలియాగం చేయటానికి దేవుడు పాపం లేని క్రీస్తును అనగా త్రిత్వము లో ఒక్కరయినా తన కుమారుడిని  తండ్రి మన తరపున సిలువ శిక్షకు అప్పగించాడు. అయనలో  ఏ పాపమూ లేదు , కనుకనే ఇదివరకు ప్రధాన యాజకులు  చేసిన  బలుల కంటే శ్రేష్ఠమయిన బలిగా దేవుడు పరిగణించాడు. కనుకనే అయన చేసిన ఒక్కే ఒక్క బలి ద్వారా సర్వ మానవాళికి పాపం నుండి  క్షమాపణ అనుగ్రహించాడు దేవుడు. ఈ క్షమాపణ క్రీస్తును విశ్వాసించి, ఆయనను వెంబడించిన వారికి మాత్రమే లభిస్తుంది. 

పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో చెప్పినట్లుగా (రోమీయులకు 3:23) అందరమూ పాపమూ చేసి దేవుని మహిమను కోల్పోతున్నాము. అనగా మనకు  పాపంతో సహవాసం ఉంటె దేవునితో సంబంధం లేని వారీగా అయిపోతాము. అయితే క్రీస్తు సకల మానవాళి పాపముల నిమిత్తం సిలువలో బలియాగం అవుతున్న సమయంలో, మన పాపముల భారం అయన పై మోపిన దేవుడు, తన పవిత్రతను బట్టి క్రీస్తును స్వల్ప కాలం వదిలి వేసాడు. ఆ స్వల్ప కాల దూరమును సైతం యేసు క్రీస్తు భరించలేక సిలువలో పలికిన నాలుగవ మాట ద్వారా బిగ్గరగా ఏడుస్తూ దేవుణ్ణి అడుగుతున్నాడు. 

మార్కు 15: "34. మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను; అ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము."

అప్పటి వరకు దేవుణ్ణి తండ్రిగా సంబోధించిన క్రీస్తు ఈ సమయంలో మాత్రం నా దేవా అని సంబోధిస్తున్నాడు. తన మీద ఉన్న పాప భారమును బట్టి దేవుడి తో తనకు ఉన్నసంబంధం తండ్రి అని పిలిచే చనువు నుండి దేవా అని పిలించేంత దూరం పెరిగిందని క్రీస్తు ఎరిగి యున్నాడు. కానీ దేవుణ్ణి మనం ఎలా చూడాలో మనకు నేర్పిస్తున్నాడు క్రీస్తు. దేవుడంటే దయ, జాలి లేని తీర్పు తీర్చేవాడిగా కాకుండా, తండ్రిగా మనలను ఆదరించు వాడని క్రీస్తు మనకు చూపించాడు. శిష్యులు మాకు ప్రార్థన చేయటం నేర్పుమని ఆడినప్పుడు యేసయ్య దేవుణ్ణి ఏమని సంబోధించాడు  "పరలోక మందు ఉన్న మా తండ్రి" (మత్తయి 6:9) అని కదా. 

అయితే తండ్రి అని పిలిచే ఈ చనువు మనకు ఎలా వస్తుంది? ప్రతి ఒక్కరు తండ్రి అని పిలువ వచ్చా? ముమ్మాటికీ కాదు. పాపమూ పట్ల విముఖత ఉండి, దాని మీద విజయం పొందుకోవాలనే తపన ఉండాలి. క్రీస్తు మీద విశ్వాసంతో అయన చేసిన బోధనలు నిత్యం పాటించు వారీగా ఉండాలి. క్రీస్తు ఇచ్చిన ఆదరణ కర్త ద్వారా అనగా పరిశుద్దాత్మ ద్వారా మన శరీర క్రియలను జయిస్తూ క్రీస్తు స్వభావంలోకి మారిపోవాలి. అప్పుడే దేవుణ్ణి మనం తండ్రి అని పిలవటానికి అర్హులుగా ఉంటాము. 

దయచేసి లూకా సువార్త 19:12-28 వరకు చదవండి. అందులో మూడవ దాసుడు తనకు డబ్బు ఇచ్చిన యజమానిని కఠినుడిగా విశ్వాసించి, తనకు భయపడి ఏ వ్యాపారం చేయలేదని చెప్పినపుడు, ఆ యజమాని ఆగ్రహించి "చెడ్డ దాసుడా, నేను కఠినుడనా, నువ్వు నమ్మినట్లే నీకు అవును గాక" అని వాడిని శిక్షించాడు కదా! యేసయ్య దేవుడు కఠినాత్ముడు కాడని, ప్రేమ కలిగిన వాడని చెప్పటానికే ఈ ఉపమానం మనకు బోధించాడు. అయితే మొదటి పని వాడు, ఎక్కువ కష్టపడ్డాడు, దేవునికి ఎక్కువ విధేయత చూపించాడు, కనుకనే ఎక్కువగా ఫలించాడు. అలాగే మనం దేవునికి ఎంత విధేయత చూపితే అంతగా దేవునికి ప్రియమయిన వారిగా మారిపోతాము. 

యేసయ్య దేవుని తో సంబంధం విడిపోయిన కొద్దీ సమయానికే తన ఆత్మను అప్పగించాడు. కానీ ఆ కొద్దీ సేపు సమయానికి కూడా దేవునితో దూరన్నీ భరించలేక పోయాడు. తానూ భూమి మీద బ్రతినంత కాలం, శోధించే శరీరం తనను ఆత్మీయ మరణానికి గురి చేయకుండా, నిత్యమూ రోదిస్తూ, కన్నీళ్ళతో దేవుణ్ణి వేడుకున్నాడు. దేవుని పట్ల అమితమయిన భయభక్తులు చూపించుట ద్వారా దేవుడు అయన ప్రార్థనలు అంగీకరించాడు, పాపం మీద విజయం అనుగ్రహించాడు (హెబ్రీయులకు 5:7). కేవలం రోదిస్తూ ప్రార్థన చేస్తే సరిపోదు కానీ, దేవుని చిత్తమును నెరవేర్చు వారీగా ఉండాలి. దేవుని చిత్తము పట్ల ఆసక్తి,  అటువంటి పోరాటం  మనకు ఉందా? దేవుని సన్నిధి దూరం అయితే తట్టుకోలేని ఆరాటం మనలో ఉందా

క్రీస్తు తండ్రి చిత్తము అంగికరించి సిలువ శ్రమలు పొందుట ద్వారా దేవుడు మన పాపములు రద్దు చేయటంతో పాటు, క్రీస్తును ఘనపరిచాడు. ఆయనను సిలువ మరణం నుండి లేపటమే కాకుండా ఆ దినము నుండి ఆయనను కుడిపార్శ్వమున ఆసీనుడిగా చేసాడు (లూకా 22:69). అటువంటి ఘనత పొందటానికి, దేవునికి  మన పట్ల ఉన్న ప్రణాళికలు నెరవేరటానికి సిద్దముగా ఉన్నామా? అసలు దేవుణ్ణి తండ్రి అని పిలవటానికి అర్హత కలిగి ఉన్నామా? కేవలం పెదవుల ద్వారా తండ్రి నీ చిత్తము నెరవేర్చు అంటాము, కానీ మళ్ళి దేవుని చిత్తం మనకు నచ్చింది కాకపోతే ఎలా? అని లోపల భయపడుతాం కదా? 

కానీ దేవుని ప్రణాళికలు మన ఆలోచనల కన్న ఉన్నతమయినవి. అయన మన మీద అనుమతించే ప్రతి  పరిస్థితి మనలను అభివృద్ధి పరిచేదే గాని  మనకు కీడు చేసేదిగా ఉండదు. సహోదరి, సహోదరుడా! తండ్రి చిత్తమును నెరవేర్చటానికి యేసయ్య అన్ని శ్రమలు పడ్డాడు, సిలువ శ్రమల కన్న కష్టమయిన విషయం, దేవుని సాంగత్యం కోల్పోయాడు. మరి మనకు ఎదురయ్యే ఈ చిన్న, చిన్న సమస్యలకు లొంగి పోయి, తండ్రితో ఉండే ఆ సంబంధం కోల్పోతామా? ఆయనను సంతోషపెట్టే అవకాశం వదులుకుందామా?

దేవుని చిత్తమయితే అయిదవ మాటను ధ్యానించుకుందాము! అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!

11, ఏప్రిల్ 2022, సోమవారం

గుడ్ ఫ్రైడే - మూడవ మాట (యోహాను 19:26-27)

 

ఆనాడు ఏదెను వనములో దేవుడు ఏర్పాటు చేసిన మానవ సంబంధాలు , మరియు కుటుంబ వ్యవస్థ ఎంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయో క్రీస్తు మనకు తన చివరి ఘడియలో సిలువలో పలికిన మూడవ మాట ద్వారా నేర్పిస్తున్నాడు. అంతే కాకుండా దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞలలో తండ్రిని, తల్లిని సన్మానించుమనటం కూడా ఒక్క ఆజ్ఞ. కనుకనే క్రీస్తు తన తర్వాత  తన తల్లి బాధ్యతను ప్రియా శిష్యుడయినా యోహాను గారికి అప్పగిస్తున్నాడు. క్రీస్తు పలికిన ఆ మూడవ మాట యోహాను సువార్తలో మనం చూడవచ్చు. 

యోహాను 19: "26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా,యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను, 27. తరువాత శిష్యుని చూచి యిదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియనుండి ఆ శిష్యుడు ఆమెను తన యింట చేర్చుకొనెను."

సిలువకు ఆయనను వ్రేలాడ దీయక ముందు యేసును ఎన్నో రకాల శారీరక హింసలు పెట్టారు సైనికులు. తర్వాత సిలువ మోసుకుంటూ కొండ ఎక్కించారు, తర్వాత కాళ్ళకు, చేతులకు మేకులు కొట్టి సిలువకు వ్రేలాడ దీశారు. కోన ఊపిరితో కొట్టుకుంటున్నాడు, ఆ సమయంలో ఇతరుల గురించి ఎవరు ఆలోచిస్తారు. కానీ క్రీస్తు ఆ సమయంలో కూడా మనకు మన బాధ్యతలు నేర్పిస్తున్నాడు, తల్లిని గౌరవించటం చూపిస్తున్నాడు. 

ముసలి వారయినా తల్లి, తండ్రిని ఎప్పుడు చస్తారా అని ఎదురు చూసే సంతానం ఉన్న రోజులలో బ్రతుకుతున్నాము. తల్లికి, తండ్రికి ఒక్క ముద్ద పెడితే ఆస్తులు కరిగి పోతాయా? ఎదో జబ్బు చేసి మందో మాకొ  ఇప్పిస్తే భవిష్యత్తు భగ్నం అయిపోతుందా? నీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని చింతిస్తున్నావా? దేవుని వాక్యం నమ్మితే, నీ దిగులు వ్యర్థమయినదిగా అర్థమవుతుంది. ఆకాశ పక్షులు విత్తవు, కోయవు కానీ వాటికి కొదువ ఉంటుందా? అని క్రీస్తు ప్రసంగించ లేదా? నా జీవితం అంత చూశాను, నీతి మంతుడు పడిపోవటం కానీ, అతని పిల్లలు యాచించటం కానీ నేను చూడలేదు అని దావీదు కీర్తనలో రాయలేదా? 

ఎఫెసీయులకు 6: "1. పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధే యులైయుండుడి; ఇది ధర్మమే. 2. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, 3. అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడ వగువుదు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది.

ఈ వచనములో పౌలు గారు పరిశుద్దాత్మ ప్రేరణ ద్వారా చెపుతున్న మాట ఏమిటి? తల్లిని తండ్రిని సన్మానించటం ధర్మము, మరియు ఆలా చేయు వారు ఆశీర్వదించబడుతారు అని కాదా? కానీ తల్లిని, తండ్రిని విస్మరించి మనం ఏవో ఆస్తులు కూడబెట్టాలని చూడటం, మనం కూర్చున్న కొమ్మను మనం నరుకుంటూ పైకి ఎక్కాలనుకోవటం లాంటిదే! కన్న వారిని విస్మరించటం ద్వారా దేవుని ఆజ్ఞను ధిక్కరించి అయన ఆగ్రహమును మన మీదికి తెచ్చుకోవటమే అవుతుంది (మార్కు 7:10). 

చాల మంది కుటుంబమును, మానవ సంబంధాలను నిర్లక్యం చేస్తూ దేవుని పరిచర్య చేస్తున్నాము కదా అని చెప్పటం కూడా దేవుని వాక్యం ఖండించింది. దేవుడు కుటుంబమును, మానవ సంబంధాలను ఎంతో ఉన్నతమయిన ఉద్దేశ్యాలతో ఏర్పరిచాడు. మన వలె సాటి వారిని ప్రేమించటం, దేవుని ప్రేమను తెలపటం మానవ సంబంధాలలో భాగమే. అదే విధంగా, మన సంతానమును, కుటుంబమును దేవుని వైపు నడిపించటం దేవుడు మనకు ఇచ్చిన బాధ్యత. 

మన బాధ్యతను సక్రమంగా నెరవేర్చకుండా, మనం ఎంత గొప్ప పరిచర్య చేసిన వ్యర్థమేనని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. అందుకే క్రీస్తు ఆ సిలువలో వ్రేలాడు కూడా తన భాధ్యతను  నెరవేర్చాడు, మనకు పాఠంగా మన ముందుంచాడు. మన పరిచర్య మొదలు కావాల్సింది మన ఇంటి నుండి, మన కుటుంబమునే దేవుడి వైపు నడుపలేని మనం ఇతరులను ఎలా దేవుని వైపు నడపగలం? (1 తిమోతి 3:5) 

నీ శిష్యులు మతాచారములు ఎందుకు పాటించటం లేదని ప్రశ్నించిన పరిసయ్యులను యేసయ్య ఏమని గద్దించాడు? మత్తయి సువార్త 15:4-5 వచనములలో చదవండి. వారు వాక్యమును ఎలా వక్రీకరించి, తల్లితండ్రికి ఒకడు చేయవలసిన మేలును ఎలా తప్పిస్తారో చెప్పాడు. నా వాళ్ళ నీకు కలిగే మేలు నేను దేవునికి ఇచ్చేసాను అని చెప్పించి వారిని బాధ్యత నుండి తప్పుకునేలా చేస్తున్నారు అంటూ  పరిసయ్యుల  వేషధారి తనమును దుయ్యబట్టాడు. దేవుడు మనకు ఇచ్చిన కుటుంబ బాధ్యతను, తల్లి తండ్రుల బాధ్యతను రక రకాల కారణాలు చెప్పి తప్పించుకోవటం వేషధారి తనమే అవుతుంది.

పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:8 వచనంలో ఏమంటున్నాడు? ఎవరయినా తన సొంత వారిని, ముఖ్యంగా ఇంటి వారిని సంరక్షించక  పోయినట్లయితే, అలాంటి వాడు రక్షణ లేని అవిశ్వాసి కన్న చెడ్డవాడుగ  పరిగణింపబడుతాడని. కనుక సహోదరి, సహోదరుడా మన వారిని మనం నిర్లక్యం చేస్తూ, మనం ఎంత ప్రార్థన పరులం అయినా ప్రయోజనం లేదు,  మనకు రక్షణ రాదు. 

ఎన్నో సార్లు మనం కష్టాల గుండా వెళుతున్నప్పుడు, దేవుడు నా కష్టాలు చూస్తున్నాడా? అసలు నేను ఉన్నాను అన్న సంగతి దేవునికి తెలుసా అని ఆలోచిస్తాము. కానీ దేవుడు ఎప్పుడు మనలను చూస్తూనే ఉంటాడు. ఏనాడు మనలను విస్మరించాడు, మన పట్ల తన ప్రణాళికను నెరవేర్చకుండా ఉండడు. ఆయనకు దగ్గరగా ఉండటమే మనం చేయవలసింది. ఇక్కడ మరియమ్మ, యోహాను యేసయ్య దగ్గరే ఉన్నారు, కనుకనే యేసు వారిని చూసాడు, మరియమ్మ బాధ్యతను యోహానుకు అప్పగించాడు. మనం కూడా  అంతే దగ్గరగా  ఉంటే దేవుడు మన బాధ్యత తీసుకోలేడా? మన సమస్యను తీర్చలేడా? 

మరియమ్మ తల్లి కాబట్టి కొడుకు మీద ప్రేమతో ఆయనకు దగ్గరగా ఉండవచ్చు, కానీ సైనికుల చేత హింసలు పొంది, నిస్సయహంగా వ్రేలాడుతున్న యేసయ్యను చూసి కూడా, అయనతో ఉంటే తనను ఏమయినా చేస్తారేమోనని భయపడకుండా,  ఆయనకు దగ్గరగా ఉన్న యోహాను విశ్వాసం ఎంత గొప్పది? యేసయ్య తన తల్లి బాధ్యత ఇవ్వగానే, తన ఇంట్లో చేర్చుకున్నాడు కదా. మరి దేవుడు ఇచ్చిన మన బాధ్యతలను అంతే విశ్వాసంతో నెరవేరుస్తూ, క్రీస్తుకు మరింత దగ్గరగా ఎదుగుదామా? 

దేవుని చిత్తమయితే నాలుగవ మాటను ధ్యానించుకుందాము, అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక. ఆమెన్!!