పేజీలు

16, జనవరి 2021, శనివారం

సంఘములో ఐక్యత!

సంఘము అనగా యేసు క్రీస్తును తలగా చేసుకొని అయన దేహముగా అయన రెండవ రాకడ కోసం సిద్దపడే వధువు వంటిది. దేహము / శరీరము తో పోల్చినప్పుడు అందులో భాగములు కూడా ఉంటాయి కదా! అనగా సంఘములో ఉండే అంగములే విశ్వాసులు. ఈ విశ్వాసుల మధ్యలో ఐక్యత, సఖ్యత కలిగి ఉంటేనే సంఘమంత ప్రభువు రాకడకు సిద్ధపడుతున్నట్లు చెప్పుకోవచ్చు. కానీ నేటి సంఘములలో అటువంటి ధోరణి కొనసాగుతుందా? వాటి గురించి ఏకరువు పెట్టేముందు! అసలు సంఘము యొక్క లక్షణములు ఏమిటి? వాక్యానుసారముగా తెలుసుకుందాం.  

అపొస్తలుల కార్యములు 2: "44.  విశ్వసించినవారందరు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచు కొనిరి. 45.  ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి, అందరికిని వారి వారి అక్కరకొలది పంచిపెట్టిరి. 46.  మరియు వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందినవారై 47. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువురక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేర్చుచుండెను."

పై వచనములో ఆదిమ సంఘము, పెంతేకొస్తు దినమున పరిశుద్దాత్మ పొందుకొన్న తర్వాత, ఎలా తాము ప్రభువులో ఎదుగుతూ తమ పరిచర్యను కొనసాగించారో తెలుపుతుంది. విశ్వాసులు అందరు  తమకు కలిగినది అమ్మి అవసరం ఉన్నవారికి పంచి ఇచ్చారు. అంతే కాకుండా వారు ఏక మనస్సు కలిగిన వారై! దేవుణ్ణి స్తుతించారు. తద్వారా ప్రజల యొక్క దయను పొందారు. ఆనందముతోను నిష్కపట హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు అనుదినము రక్షణ అనుభవము పొందిన వారిని వారితో చేర్చు చుండెను. అనగా రోజు కొత్తవారు సంఘములో చేర్చబడుచున్నారు. క్రీస్తు సంఘముగా ప్రజల యొక్క ఆదరణ పొందటం ఎంతో ప్రాముఖ్యమయినదిగా పరిగణించాలి.  మన ప్రవర్తనయందు క్రీస్తు ప్రేమను చూపుతూ మన యొక్క రక్షణను ప్రకటించాలి. అదియే ప్రభువు ప్రేమను ప్రజలకు చాటి అయన వైపు వారిని నడిపిస్తుంది. ఇది జరగాలంటే విశ్వాసులు ఏక మనసు కలిగిన వారై ఉండాలి. దేహము యొక్క ప్రవర్తన తలను బట్టి ఉంటుంది గాని చేతిని బట్టి, ముక్కును బట్టి లేదా కళ్ళను బట్టి ఉండదు. అదే విధముగా సంఘము కూడా ప్రభువును బట్టి అనగా వాక్యాను సారముగా నడుచుకోవాలి గాని ఏ ఒక్క విశ్వాసిని బట్టి, సంఘ పెద్దలను బట్టి కాదు. దేవుడు ప్రతి విశ్వాసిని తన దేహములో అనగా సంఘములో అవయవాలుగా చేసాడు. తన చిత్తము చొప్పున తలాంతులు అనుగ్రహించి తన పరిచర్యను చేయటానికి అనగా తన రాజ్య వ్యాప్తికై వాడుకుంటున్నాడు. తద్వారా సంఘము యొక్క అభివృద్ధిని జరిగిస్తున్నాడు అనగా కొత్తవారిని చేర్చటానికి ఇష్టపడుతున్నాడు. కొత్తగా వచ్చిన విశ్వాసుల పట్ల సంఘ సభ్యుల ప్రవర్తనను విశదీకరిస్తూ పౌలు గారు కొరింథీయులకు లేఖ రాశారు (1 కొరింథీయులకు 8) చదవండి. 

1 కొరింథీయులకు 1: "10.  సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాట లాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సు తోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండ వలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను."

పౌలు గారు ఎంతో భారముతో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ వచనము చూడండి. సహోదరులందరు ఏకభావము కలిగిన వారై ఉండాలని, కక్షలు లేకుండా ఏక మనసు కలిగిన వారై ఉంటు  ప్రభువు రాకడకై సంఘముగా సిద్దపడి ఉండాలని ప్రభువు పేరిట వేడుకుంటున్నాడు. విభిన్న మనస్తత్వాలు, నేపథ్యాలు కలిగిన మనుష్యుల మధ్య ఇది సాధ్యమేనా? క్రీస్తును బట్టి నడచుకొంటే సాధ్యమే. ప్రతి విశ్వాసి తమను తాము తగ్గించుకోవాలి, ఇతరులను ప్రేమించాలి అన్న క్రీస్తు లక్షణాలు కలిగి ఉంటె సాధ్యమే కదా! 

1 పేతురు 3: "8.  తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖ ములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి. 9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి." 

అపొస్తలుడయిన పేతురు గారు కూడా తాను రాసిన మొదటి లేఖలోని పై వచనములు చూడండి. ఏక మనస్సు కలవారై ప్రతి ఒక్కరి సుఖదుఃఖముల యందు పాలు పంచుకొంటూ సహోదర ప్రేమ గలవారును, కరుణాచిత్తులుగా, వినయ మనస్సు కలవారై ఉండుమని ప్రోత్సహిస్తున్నారు. ఆశీర్వాదమునకు వారసులు కావటానికి మనం పిలువబడ్డ వారము కనుక కీడు చేసే వారికి ప్రతిగా కీడు చేయకుండా, దూషించిన వారిని తిరిగి దూషించకుండా దీవించుమని పరిశుద్దాత్మ ప్రేరణతో హెచ్చరిస్తున్నారు. యేసు క్రీస్తు చెప్పినట్లుగా "మిమల్ని దీవించిన వారిని దీవిస్తే మీకేమి ప్రయోజనము, మీకు తిరిగి సహాయము చేసేవారికి సహాయం చేస్తే ఏమిటి లాభము" అన్నట్లుగా ప్రతి ఒక్క విశ్వాసి పై లక్షణములు పాటించినట్లయితే సంఘములో ఐక్యత సాధ్యమే. 

సామెతలు 15: "1. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును."

సామెతల గ్రంథములో సొలొమోను రాసిన ఈ గొప్ప మాటను ఒక్కసారి చూడండి. మృదువైన మాట క్రోధమును చల్లార్చుతుంది కానీ నొప్పించు మాట కోపమును రేపుతుంది. అసలు ఇశ్రాయేలు పన్నెండు గోత్రములు విడిపోవడానికి సొలొమోను కుమారుడవైన రెహబాము మాట్లాడిన పరుషమయిన మాటలే అని లేఖనములు స్పష్టం చేస్తున్నాయి. రాజయిన వెంటనే రెహబాము తండ్రి రాసిన సామెతల గ్రంథమును చదివినా బాగుండేదేమో అనిపిస్తుంది. 

రాజులు 12: "3. ​జనులు అతని పిలువనంపగా యరొబామును ఇశ్రాయేలీయుల సమాజ మంతయును వచ్చి రెహబాముతో నీలాగు మనవి చేసిరి. 4. ​నీ తండ్రి బరువైన కాడిని మామీద ఉంచెను; నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మామీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసినయెడల మేము నీకు సేవచేయుదుము."

ఇశ్రాయేలు వివిధ గోత్రముల నుండి కొంతమంది పెద్దలు రెహబాముతో కొన్ని విన్నపములు చేసుకోవటనికి వచ్చారు. అతని తండ్రి అయినా సొలొమోను వారిని ఎంతగా కష్టపెట్టింది చెప్పుకొని తానయినా ఆ కష్టములు తొలగించుమని వేడుకుంటున్నారు. అయితే అహంకారుడయినా రెహబాము పెద్దల మాటను పేడ చెవిన పెట్టి తనవంటి  యవ్వనస్తులు చెప్పిన సలహాలు విని వారితో పరుషంగా మాట్లాడి ఇశ్రాయేలులో పది గోత్రముల వారు విడిపోయేలాగా ప్రవర్తించాడు. 

రాజులు 12: "16. కాబట్టి ఇశ్రాయేలువారందరును రాజు తమ విన్నపమును వినలేదని తెలిసికొని రాజుకీలాగు ప్రత్యుత్తరమిచ్చిరి దావీదులో మాకు భాగమేది? యెష్షయి కుమారునియందు మాకు స్వాస్థ్యము లేదు; ఇశ్రాయేలువారలారా, మీమీ గుడారములకు పోవుడి; దావీదు సంతతివారలారా, మీ వారిని మీరే చూచుకొనుడి అని చెప్పి ఇశ్రాయేలువారు తమ గుడారములకు వెళ్లిపోయిరి."

పై వచనములో రాజు తమ మాట మన్నించకపొగ పరుషంగా మాట్లాడినందుకు తన ఏలుబడిలో నుండి వెళ్ళి పోయారు ఇశ్రాయేలు వారు. తద్వారా దేవుని వాగ్దానము నెరవేరటమే కాదు ఇశ్రాయేలులో సమైఖ్యత నశించిపోయింది. సంఘములో సైతం పరుషముగా మాట్లాడుతూ, ఇతరులను నొప్పించువారు ఉన్నట్లయితే సంఘములో ఐక్యత ఖచ్చితంగా దెబ్బ తింటుంది. మృదువయిన మాట తీరును అలవరచుకుందాం! ఏక మనసు కలిగి ఉండటానికి ఇష్టపడుదాం కానీ ఏక పక్షముగా ఉండటాన్ని కాదు. ఇక్కడ రెహబాము ప్రజలు లొంగి ఉంటున్నారు కదా అని నిరంకుశంగా ఏక పక్షంగా ఉండాలని చూశాడు కానీ ప్రజలు దాన్ని స్వాగతించ లేదు. సంఘములో ఉండే పెద్దలు సైతం ఇటువంటి మనస్థితిని జయించాలి. క్రీస్తు సంఘములో ఉన్న ప్రతి విశ్వాసిని సంఘము నిర్ణయలలో పాలిభాగస్తులను చెయ్యాలి. వాక్యానుసారముగా నిర్ణయాలు తీసుకోవటానికి ప్రేరణ కలిగిస్తూ ప్రోత్సహించాలి. క్రీస్తు ప్రేమయే మనలను ఐక్యపరచే బలము. ఆ ప్రేమ లోపించిన నాడు భిన్న మనస్తత్వాలు, సొంత అస్థిత్వాలు బయలు దేరుతాయి. క్రీస్తు ప్రేమ రెహబాము వంటి స్వభావమును అంగీకరించదు, సంఘము యొక్క ఐక్యతను కోరుకుంటుంది, ప్రతి సభ్యుడిని పాలిబాగస్తుడిగా చేర్చుకుంటుంది. కన్ను ఒక్కటి ఉంది కదా అని రెండవ కన్నును ఎవరయినా నిర్లక్యం చేస్తారా? చేతి వెళ్ళు పది ఉన్నాయి కదా అని ఒక్క వేలిని నరికేసు కుంటారా? సంఘములో ఉన్న ప్రతి అంగము అనగా ప్రతి విశ్వాసి అంతే ప్రాముఖ్యం ఉన్నవాడు. అది దేవుని చిత్తముగా జరిగింది కనుకనే ఆ విశ్వాసి ఆ సంఘములోకి నడిపింపబడ్డాడు. విశ్వాసులను సరిచేయటం తప్పు కాదు, వారు మారనప్పుడు వదిలేయటం వాక్యానుసారం కానిది కాదు. కానీ అతను నా వాడు, ఇతను ఫలానా అతని వాడు అని గుంపులు కట్టటం కొరింథీయులకు రాసిన పత్రికలల్లో  పౌలు గారు ఏనాడో దుయ్యబట్టారు.  

రాజులు 18: "31.  యెహోవావాక్కు ప్రత్యక్షమైనీ నామము ఇశ్రాయేలగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు రాళ్లను తీసికొని 32. ఆ రాళ్లచేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి, దానిచుట్టు రెండు మానికల గింజలు పట్టునంత లోతుగా కందకమొకటి త్రవ్వించి"

పై వచనంలో బయలు ప్రవక్తలను సవాలు చేసిన దేవుని ప్రవక్త ఏలీయా యెహోవాకు బలి అర్పించుటకు ముందు విడిపోయిన ఇశ్రాయేలు గోత్రములన్నింటిని బట్టి పన్నెండు రాళ్లు తెప్పించి దేవునికి బలి పీఠము కట్టి ఆ గోత్రముల సమైక్యతను, సమానత్వమును చాటుతున్నాడు. అటువంటి ప్రవర్తన  దేవునికి ఎంత ప్రీతికరమవుతుందో కదా! అటువంటి స్వభావము మనం కలిగి ఉన్నామా? వారు మా కులం వారు, వీరు మా వీధి వారు లేక మా ఉరి వారు అని ఇంకా తారతమ్యాలు పాటిస్తున్నామా?  సంఘము అనగా లోక రీతిగా ఒక కులం వారు కలుసుకోవటం కాదు, ఒక ఉరి వారు విహార యాత్రకు రావటం కాదు, లేదా కేవలం స్నేహితులు చేసుకొనే విందు కాదు.  ఒకరి మంచిని ఒకరు మెచ్చుకుంటూ, ప్రతి ఒక్కరు ఇతరుల మంచిని, క్షేమమమును ఆశిస్తూ, క్రీస్తులో ఎదగటం. అనగా అయన ప్రేమను చూపుతూ ఇతరులను ఎదిగించటం. తద్వారా అయన రెండవ రాకడకై మనం సిద్దపడుతూ అయన చిత్తముగా ఇతర ఆత్మలను రక్షించటం. అందరం క్రీస్తు వారలము, దేవుని బిడ్డలము అన్న భావన కలిగిననాడు సంఘములో ఐక్యతకు లోటేమి ఉంటుంది. ఇవన్ని జరిగేలా చూడవలసింది సంఘములో ఉండే పెద్దలు. యధా రాజా తధా ప్రజ లాగా పరిస్థితి మారకుండా ఉండాలంటే యధా క్రీస్తు తధా సంఘముగా పరిస్థితి మారాలి. 

ప్రస్తుతం సంఘములలో పెత్తనాల కోసం పోరు మాములుగా ఉండటం లేదు. దేవుని సంఘములో ఎన్నికలు పెడుతున్నారు. అపొస్తలులు ఏనాడయినా  ఎన్నికలు పెట్టారా? యేసు క్రీస్తు తన వృత్తి చేసిన వారినే శిష్యులుగా ఎంచుకున్నాడా? చీటీలు వేసి తండ్రి నీ చిత్తము బయలు పరచు అని సభ్యులను ఎన్నుకొంటే సరిపోదా? సంఘ పెద్దలు ప్రార్థిస్తే దేవుని చిత్తము బయలు పరచాడా? 

సొలొమోను రాజు దగ్గరికి వచ్చిన ఎంతో ప్రసిద్దమయిన తగువు సంఘటనను ఈ పరిస్థితులకు ఆపాదించాలనిపిస్తుంది. ఇద్దరు తల్లులు ఒక్క బిడ్డతో వచ్చి ఆ బిడ్డ నాదంటే నాదని తగువులాడుకున్నారు. అటువంటి స్థితిలో చాల సంఘాలు కూడా ఉన్నాయి. సంఘము నాదంటే నాది అని సంఘ పెద్దలు తగువులాడుకుంటున్నారు. వారి వారి గొప్ప కోసం సంఘమును ముక్కలు చేయటానికి వెనుకాడటం లేదు. కానీ సొలొమోను బిడ్డను రెండు ముక్కలుగా చేయమన్నప్పుడు నిజమయిన తల్లి బిడ్డను త్యాగం చేయటానికి వెనుకాడలేదు. ఆ తల్లికే బిడ్డ అప్పగింపబడింది కానీ ముక్కలు చేయమన్న తల్లికి కాదు. కనుక సహోదరి, సహోదరుడా సంఘంలో  నీ పరిస్థితి ఎలాంటిదయినా సంఘమును ముక్కలు చేయకు.  దేవుని చిత్తమును కనిపెట్టు ఆయన ప్రేరేపిస్తే అక్కడ నుండి వెళ్ళిపో. ఆయనే నిన్ను తన చిత్తానుసారముగా వాడుకుంటాడు. దేవుణ్ణి నమ్ముకొని, అయన చిత్తము నెరవేర్చి నశించి పోయినవాడు ఎక్కడ వెతికిన దొరకడు. దేవుని సంఘము ఐక్యతను కోరటం కన్న మించిన దేవుని చిత్తము మరోటి ఉంటుందా? దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి